Saturday, 3 December 2016

ATM కార్డ్ కు ON / OFF సిస్టమ్

నగదురహిత లావాదేవీలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది కేంద్రం. మీ కార్డే మీ పర్స్ నినాదంతో ముందుకెళ్లోంది. దీంతో అన్ని బ్యాంకులు సరికొత్త విధానాలతో ముందుకొస్తున్నాయి. ఇదే సమయంలో ఖాతాదారుల భద్రత విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మీ బ్యాంక్ కార్డ్ సురక్షితంగా అయ్యే విధంగా దానికి ON / OFF సిస్టమ్ తీసుకొచ్చింది SBI బ్యాంక్. మీ ATM కార్డ్ ను స్టేట్ బ్యాంక్ ఇండియా కొత్తగా రూపొందించిన SBI Quick అనే యాప్ నుంచి నియంత్రించొచ్చు. ఈ యాప్ తో మీ ATM  కార్డ్ ను కనెక్ట్ చేసుకుని.. స్వచ్ ఆన్.. ఆఫ్ చేసుకోవచ్చు. మీరు ATM సెంటర్ కు వెళ్లినప్పుడు ఆన్ చేసుకుంటే.. కార్డ్ పనిచేస్తుంది. ఆ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కార్డ్ ఆఫ్ లో ఉన్నప్పుడు మీ ATM కార్డ్ నుంచి ఎలాంటి లావాదేవీలు చేయటానికి వీలుకాదు. ఒక్క ATM సెంటర్ నుంచి కాదు.. ఎక్కడైనా సరే కార్డ్ ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడే మాత్రమే ఆన్ చేసుకుంటే సేఫ్ గా ఉంటుందని SBI అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో అన్ని క్రయ, విక్రయాలు కార్డ్ ద్వారానే జరుగనున్నాయి. ఈ క్రమంలోనే కార్డ్ కు మరింత భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
https://play.google.com/store/apps/details?id=com.sbi.sbiquick&hl=en

Friday, 2 December 2016

ఆధారే ఆధారం...

  • క్యాష్‌ వద్దు.. కార్డు రద్దు!
  • ఆధార్‌ నంబర్‌ ఉంటే చాలు
  • అన్ని లావాదేవీలూ చేయొచ్చు
  • రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
  • ఫోన్‌, ఆధార్‌, వేలి ముద్రే కీలకం
ఆధార్‌.. అన్నింటికీ ఆధారం. గుర్తింపు పత్రంగానే కాదు.. నగదు రహిత లావాదేవీల్లోనూ కీలకంగా మారబోతోంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డున్నా ఆధార్‌ ఉంటేనే లావాదేవీ!

             నగదే కాదు.. కార్డులు కూడా త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్నాయి. దేశాన్ని నగదు రహిత భారతగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం కొన్నాళ్లకు కార్డు లావాదేవీలను కూడా రద్దు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కేవలం ఆధార్‌ నంబర్‌ ధారంగా లావాదేవీలు జరిగే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్‌.. ఫోన్‌.. వేలి ముద్ర ఆధారంగా ఒక నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. దీంతో మీరు ఆధార్‌ నంబరును చెప్పి.. మీ వేలి ముద్రను ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేసి మీ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాలకు పంపవచ్చు. ఈ దిశగా సాఫ్ట్‌వేర్‌ను, ఫోన్లను అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఒక పథకం రూపొందిస్తోంది. ఈ అంశంపై నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత మాట్లాడుతూ.. ‘‘ఇకపైౖ దేశంలో ఉత్పత్తి చేసే ఫోన్లన్నీ వేలి ముద్రల (ఫింగ్‌ప్రింట్‌) స్కానర్‌ను లేదా కనుపాప (ఐరిస్‌) స్కానర్‌ను కలిగి ఉండేలా చూడాలని మొబైల్‌ తయారీదారులను కోరుతున్నాం. ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తే ఆధార్‌ ఆధారిత లావాదేవీలు జరిపేందుకు వీలుంటుంది.
 
అప్పుడు కార్డు అవసరం కూడా తగ్గిపోతుంది.’’ అని వివరించారు. దీంతో మన 12 అంకెల ఆధార్‌ నంబరే లావాదేవీలకు అత్యంత కీలకం కానుంది. బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలకు ప్రస్తుతం ఆధార్‌ నంబరును తప్పనిసరి. అన్ని బ్యాంకు ఖాతాలూ ఆధార్‌ కిందకు వచ్చేస్తాయి. దీంతో ఆధారిత లావాదేవీల నిర్వహణ సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి కసరత్తు చేస్తున్న నీతి ఆయోగ్‌ త్వరలోనే పక్కా ప్రణాళికను ప్రభుత్వం ముందు ఉంచే వీలుంది. ఇదే అంశంపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ పాండే మాట్లాడుతూ.. ‘‘ఆధార్‌ ఆధారిత లావాదేవీలు నగదు, పిన్‌ రహితం అవుతాయి. స్మార్ట్‌ ఫోన్లు వాడేవారు తమ ఆధార్‌ నంబరు, వేలి ముద్రలను ఆధారం చేసుకుని లావాదేవీలు నిర్వహించవచ్చు.’’ అని వివరించారు.ఆధార్‌ ఆధారిత లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం.. బ్యాంకులు, మొబైల్‌ తయారీ సంస్థలు, వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మూడు వర్గాల నుంచీ మద్దతు లభిస్తే ఆధార్‌ ఆధారిత లావాదేవీల ప్రయోగం విజయవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు.
 
నగదు రహిత లావాదేవీలను విజయవంతంగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీలో నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత కూడా ఉన్నారు. ఈ కమిటీ ఏడాది పాటు అధ్యయనం చేసి దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఏం చేయాలో వివరిస్తుంది. ఈ నేపథ్యంలో అమితాబ్‌ కాంత ఆధార్‌ ఆధారిత లావాదేవీల గురించి వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వ్యాపారులందరినీ ఈ-చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలవైపు మళ్లించేందుకు కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది.
 
‘ఆధార్‌’ లావాదేవీ ఇలా ఉంటుంది!
  • మీరు కిరాణా కొట్టుకు వెళ్తారు. కావాల్సిన సరకులు కొనుగోలు చేస్తారు.
  • దుకాణాదారుడు ఆ సరకులకు ఎంత మొత్తం అయిందో లెక్కించి చెబుతాడు.
  • ఆ డబ్బులు ఇవ్వమంటారు.
  • మీరు చేతిలో డబ్బులు లేవు. ఆధార్‌ ఖాతా నుంచి తీసుకోండని చెబుతారు. ఆధార్‌ నంబరును వెల్లడిస్తారు.
  • దుకాణదారుడు మీ ఆధార్‌ నంబరును, చెల్లించాల్సిన మొత్తాన్ని ఫోన్‌లో ఎంటర్‌ చేస్తాడు. మీ వేలిని ఫోన్‌లోని ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వద్ద పెట్టమంటాడు. అక్కడ మీరు వేలిని పెట్టాక మీ ఆధార్‌ ఖాతాలో నుంచి డబ్బులు కట్‌ అయి దుకాణాదారుని ఆధార్‌ ఖాతాలోకి వెళ్తాయి.

Thursday, 24 November 2016

ప‌డిపోయిన రూపాయి

డాల‌ర్‌తో రూపాయి మారుక విలువ ఎప్పుడూ లేనంద‌గా ప‌త‌నం అయ్యింది. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ రూ.68.87గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో 70 మార్కును తాకే అవ‌కాశ‌మున్న‌ట్లు బిజినెస్ అన‌లిస్ట్‌లు చెబుతున్నారు.విదేశీ ఇన్వెస్ట‌ర్లు భార‌త స్టాక్స్‌ను అమ్మ‌డంతో ఒక్క‌సారిగా రూపీ వాల్యూ ప‌డిపోవ‌డానికి కార‌ణ‌మైంద‌న్నారు వాణిజ్య నిపుణులు. డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న విజ‌యం కూడా రూపాయి ప‌త‌నానికి కార‌ణంగా విశ్లేషిస్తున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత అంటే న‌వంబ‌ర్ 9 నుంచి రూపాయి విలువ 3శాతం మేరా ప‌త‌న‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశీ ఇన్వెస్ట‌ర్లు రూ.13వేల కోట్ల మేరా భార‌త స్టాక్స్‌ను అమ్మారు. చివరిసారిగా 2013, ఆగష్టు 28 68.80కు పడిపోయింది.

ఈ నెల 28న మెడికల్ షాపుల బంద్

మెడికల్ షాపు యాజమాన్యాలు ఈ నెల 28న బంద్ కు పిలుపునిచ్చాయి. డ్రగ్స్ కంట్రోల్ శాఖ దాడులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. మెడికల్ షాపులతో పాటు … ఆస్పత్రుల్లో ఉన్న షాపులు బంద్ లో పాల్గొనాలని  … కెమిస్ట్ర్ ఎండ్  డ్రగ్గిస్ట్  అసోసియేషన్ నిర్ణయించింది. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తీరును తప్పుబడుతున్నారు మెడికల్ షాప్ ఓనర్స్. అధికారులు టార్గెట్స్ పేరుతో ఇష్టానుసారంగా దాడులు చేసి.. కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా.. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్ పాటించి నిరసన తెలపాలని… రాష్ట్ర కెమిస్ట్ ఎండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ డిసైడ్ చేసింది. జలుబు, తలనొప్పి, జ్వరం వాటికి  కూడా ప్రిస్కిప్షన్ అంటూ డ్రగ్ కంట్రోల్ అధికారులు కేసులు పెడుతున్నారన్నారని … కెమిస్ట్ర్ అండ్ డ్రగ్గిస్ట్ అసిసోయేషన్ ప్రెసిడెంట్ వెంకటపతి ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారన్నారు. లైసెన్స్, ఫార్మసిస్ట్, నాసిరకం డ్రగ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28న రాష్ట్రంలో ఉన్న 25వేల మెడికల్ షాప్స్ తో పాటు.. ఆస్పత్రుల్లో ఉన్న షాపులు కూడా బంద్ లో పాల్గొంటాయన్నారు. H, H1 మెడిసిన్ అమ్మకాలపై సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు. వారం రోజుల్లోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తామని తేల్చి చెప్పారు.

Thursday, 10 November 2016

నోట్ల రద్దు నేపథ్యంలో రెండున్నర లక్షల డిపాజిట్ మించితే ఏమౌతుందో తెలుసా?

ఈ నెల 10నుంచి డిసెంబర్ 30 మధ్యలో చేసే డిపాజిట్లలో పూర్తి పారదర్శకత ఉండాలని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తెలిపారు. చిరు వ్యాపారులు, కార్మికులు చేసే డిపాజిట్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ పన్ను పరిధిలోకి రాదని చెప్పారు. రెండున్నర లక్షల రూపాయలను మించి డిపాజిట్ చేయాలనుకుంటే ఆ మొత్తం ఆదాయ రిటర్న్స్‌లో గతంలో వెల్లడించిన దానికి సరిపోవాలని చెప్పారు. లేకపోతే రెండు వందల శాతం టాక్స్ పెనాల్టీ పడుతుందని రెవిన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు.

క్యాష్‌ ఆన్‌ డెలివరీ బంద్‌...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు ఈ-కామర్స్‌ సంస్థలు క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీవోడీ) సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. మరికొన్ని సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. అమెజాన్‌ సంస్థ క్యాష్‌ ఆన్‌ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేసింది. 8వ తేదీ వరకు సీవోడీ ద్వారా ఆర్డరు చేసిన వినియోగదారులను సైతం డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలని సూచించింది. అవి అందుబాటులో లేని పక్షంలో చెల్లుబడి అయ్యే నోట్లను ఇచ్చి వస్తువులను డెలివరీ తీసుకోవాలని కోరింది. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు సీవోడీ ఆర్డర్లపై పరిమితులు విధించాయి. రూ.2 వేలు లోపు కొనుగోళ్లకే సీవోడీ ఆర్డర్లను అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ-కామర్స్‌ సంస్థలు జరిపే లావాదేవీల్లో 60 శాతం సీవోడీ ద్వారానే జరుగుతుంటాయి. త్వరలోనే సీవోడీ ఆర్డర్లను పునరుద్ధరిస్తామని ఈ-కామర్స్‌ సంస్థలు ప్రకటించాయి.

రేపటి నుంచి ఏటీఎంల్లో కొత్త నోట్లు...

దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్‌ లావాసా తెలిపారు. అదే రోజు నుంచి కొత్తగా ముద్రించిన రూ.500, రూ.2 వేల నోట్లు ఏటీఎంల్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. అయితే కొద్దిరోజుల పాటు వినియోగదారులు రోజుకి రూ.2 వేలు మాత్రమే ఏటీఎం నుంచి డ్రా చేసుకొనే వెసులుబాటు ఉంటుందని, వారానికి గరిష్ఠంగా రూ.20వేలు వితడ్రా చేసుకోవచ్చని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల్లో పాత నోట్లను మార్చేందుకు వీలుగా బుధ, గురువారాల్లో ఏటీఎంలను మూసివేసిన విషయం విదితమే. కొద్ది రోజులపాటు ఏటీఎంల నుంచి నగదు వితడ్రాయిల్స్‌ భారీగా పెరుగుతాయని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి అనుగుణంగా తరచూ ఏటీఎంల్లో నగదు నింపేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వంద నోట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ బ్రాంచీలు, ఏటీఎంల్లో రానున్న రెండు రోజుల్లో రూ.100 నోట్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచనున్నట్లు ఎస్‌బీఐ ఎండీ రజనీష్‌ కుమార్‌ ప్రకటించారు.

Tuesday, 8 November 2016

రూ.2000 నోటు త్వరలో...

రూ.2000 నోటును జారీ చేయడానికి భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 
 
రూ.2000 నోటు ఇదే.

రెండు రోజులు ఏటీఎంలు బంద్


అవినీతిపై యుద్ధం ప్రకటించిన ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అవినీతిని దేశం నుంచి సమూలంగా నిర్మూలించేందుకు ఇప్పటి వరకు దేశంలో చలామణిలో ఉన్న రూ.1000, రూ.500 నోట్లను నిషేధిస్తున్నట్ట ప్రకటించారు. అంతేకాక రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు ఏటీఎంలు పనిచేయవని పేర్కొన్నారు.

నేటి అర్ధరాత్రి నుంచి 500, వెయ్యినోట్లు చెలామణిలో ఉండవు: ప్రధాని మోదీ

నల్లధనంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారు. నేటి అర్ధరాత్రి నుంచి అంటే నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, వెయ్యిరూపాయల నోట్లు చెలామణిలో ఉండవని ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న 500, వెయ్యి నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల గడువిచ్చారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకూ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో పాత 500, వెయ్యినోట్లు మార్చుకునే వీలిచ్చారు. నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Monday, 31 October 2016

కంటిచూపును పెంచే అరటి

తిన్న ఆహారం సులువుగా జీర్ణం చేయటానికి, తక్షణ శక్తి ఇవ్వటానికి ఉపయోగపడే అరటిపండు కంటి ఆరోగ్యానికీమంచిదని తాజా సర్వేలో తేలింది.ప్రతిరోజూ ఓ అరటిపండు మన మెనూలో ఉంటే కంటికి మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. చక్కని కంటిచూపుతో పాటు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజూ అరటిని తీసుకుంటే మంచిదని వారంటున్నారు. అరటిలో ఉండే కెరొటినాయిడ్స్‌ లివర్‌నే కాదు కంటిచూపునూ కాపాడుతుంది. ఇంతకుముందు వచ్చిన సర్వేల్లో పండ్లలో అధికంగా ఉండే కెరొటినాయిడ్స్‌ కారణంగా క్రానిక్‌ డిసీజ్‌లతో పాటు క్యాన్సర్స్‌ కూడా రావని తేలింది. అయితే ఈ తాజా సర్వేలో అరటిపండ్లలో రిచ్‌ ప్రొవిటమిన్‌ ఎ కెరొటినాయిడ్స్‌ అధికంగా ఉంటాయని తేలింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీ పరిశోధకులు అరటిపై పరిశోధన చేశారు. అందరికీ అందుబాటు ధరలో ఉండే అరటిపండు పిల్లలకే కాదు పెద్దల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మొత్తానికి కంటిచూపు సమస్యలు రాకుండా ఉండాలంటే అరటితో నేస్తం చేయాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.

‘శాతకర్ణి’ దీపావళి కానుక అదిరింది !

నందమూరి నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు దీపావళీ కానుకను అందించాడు. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ దసరా పండుగకు టీజర్ ద్వారా అభిమానులను అలరించిన బాలకృష్ణ మరోసారి ‘శాతకర్ణి’ సినిమా ఆసక్తిని పెంచే ఓ చిత్రాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఆసక్తినిరేకెత్తిస్తున్న ఈ ఫోటోలో బాలకృష్ణ కత్తదూస్తూ ఆవేశంగా కనిపిస్తున్నాడు. టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న వారిఆసక్తిని మరింత పెంచింది.

రాజన్న క్షేత్రంలో కార్తీక సందడి

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో కార్తీక సందడి ప్రారంభమైంది. తెలంగాణాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయం కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్ల మీదుగా శ్రీస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారికి ఆలయ అర్చకులు ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

రోజుకో చాక్లెట్ తింటే అకాల మరణాలు తగ్గుతాయట!

పిల్లల నుంచి పెద్దల వరకూ చాక్లెట్లను ఇష్టపడని వారంటూ ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో! చాక్లెట్లు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు తప్పవన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే ఈ అభిప్రాయం సరికాదు అంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ ఒక చాక్లెట్‌ తినడం వలన గుండెజబ్బులు వచ్చే ప్రమాదం నుంచి 25 శాతం వరకూ తప్పించుకోవచ్చన్న విషయం వీరు నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని చాక్లెట్‌ పెంచుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు. రోజుకో చాక్లెట్‌ తినడం వలన 45 శాతం వరకూ అకాల మరణాలు తగ్గుతాయని అంటున్నారు అందువలన నిరభ్యంతరంగా రోజుకో చాక్లెట్‌ తినొచ్చని వీరు సూచిస్తున్నారు.

చలికాలం మిరపకాయ బజ్జీలు తింటున్నారా? పేపర్‌తో జాగ్రత్త!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటే దేన్నైనా సాధించవచ్చంటారు. మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? మన నిర్లక్ష్యంతో పాడు చేసుకుంటున్నామా? కొన్ని సార్లు కొన్ని విషయాలు తెలియక జాగ్రత్తలు తీసుకోలేము. మరికొన్ని సార్లు మనం తీసుకునే జాగ్రత్తలే ఇంకో రూపంలో హాని చేస్తాయి. అందులో న్యూస్‌పేపర్‌లు వాడడం కూడా ఒకటి. పూరీలు, వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం వాటిని న్యూస్‌పేపర్‌ మీద వేస్తుంటాం. అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం న్యూస్ పేపర్‌‌ను వాడటం మాత్రం హానికరమే!
 
ఎందుకంటే నూనె వంటకాలను పేపర్‌ మీద వేయగానే దాంట్లోని న్యూస్‌ ప్రింట్‌ ఇంక్‌ కరగటం మొదలుపెడుతుంది. ఈ ప్రింట్‌ ఇంక్‌లోని గ్రాఫైట్‌ మనం తినే పదార్థాల్లోకి చేరి నేరుగా శరీరంలోకి చేరుతుంది. గ్రాఫైట్‌ వల్ల మూత్రపిండాలు, కాలేయం, ఎముకలు, కణజాలం పెరుగుదల దెబ్బతింటాయి. సాధారణంగా ఎలాంటి హానికారక పదార్థాన్నైనా మన శరీరం సహజసిద్ధంగానే విసర్జిస్తుంది. కానీ గ్రాఫైట్‌ అలా కాదు. అది శరీరంలో నిల్వ ఉండిపోతుంది. కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్‌ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించండి. అలాగే చేతులు తుడుచుకోవటానికి కూడా! న్యూస్‌ పేపర్‌ తడవనంతవరకూ దాంట్లోని గ్రాఫైట్‌తో ఎటువంటి ప్రమాదం లేదు. కానీ తడి లేదా నూనె వల్ల న్యూస్‌ పేపర్‌ తడిస్తే ఇంక్‌ప్రింట్‌లోని గ్రాఫైట్‌ కరగటం మొదలుపెడుతుంది. కాబట్టి న్యూస్‌ పేపర్‌ను చదవటానికే తప్ప పదార్థాల నిల్వకు, చేతులు తుడుచుకోవటానికి, అదనపు నూనె పీల్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి. ముఖ్యంగా ఇప్పుడు చలికాలం వస్తోంది. చాలా మంది మిరపకాయ బజ్జీలు తినడానికి ఇష్టపడతారు. ఏ బడ్డీకొట్టు దగ్గరికి వెళ్లినా న్యూస్ పేపర్ మీదే వేసిస్తారు. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా  ఉండండి. న్యూస్  పేపర్‌లో కాకుండా పేపర్ ప్లేట్‌లో తీసుకుని తింటే మంచిది.

7 గంటల కంటే తక్కువగా నిద్రపోతే కలిగే ఏడు ప్రమాదాలు!

టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో, అంతే హాని చేస్తుందనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా యువత సోషల్ మీడియాకు అలవాటు పడి నిద్రకు కూడా దూరమవుతున్నారు. ఉద్యోగులు కూడా నెట్‌కు బానిసలుగా మారుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ నిద్రలేమి ఇప్పుడు చాలామందిని వేధిస్తోన్న ప్రధాన సమస్య. రాత్రి 2 గంటల వరకూ నెట్‌లో గడుపుతూ, ఫోన్‌లో సినిమాలు చూసుకుంటూ గడిపేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
 
మళ్లీ ఉదయాన్నే 7 గంటలకు నిద్ర లేచి హడావుడిగా ఆఫీస్‌కు రెడీ అవుతుంటారు. అలాంటి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. యువత కనీసం 7 నుంచి 9 గంటలు, టీనేజర్స్ 8నుంచి 10 గంటలు, చిన్నపిల్లలు 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. యువత రాత్రుళ్లు నిద్రను దూరం చేసుకుంటూ, ఏడు గంటల నిద్రకు దూరమవ్వడం వల్ల ప్రధానంగా ఏడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. అవేంటో తెలుసుకుందాం...
 
1. ఒక్కరోజు నిద్ర దూరమవడం వల్ల మరుసటి రోజు విపరీతమైన ఆకలితో అతిగా తింటున్నారని, దీంతో బరువు పెరిగి ఊబకాయంతో బాధపడుతున్నారని అప్స్ల యూనివర్సిటీ సర్వేలో తేలింది.
 
2. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు వేధిస్తున్నట్లు తెలిసింది. చర్మంపై ముడతలు, కళ్ల కింద మచ్చలు ఇలాంటి వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని సర్వే వెల్లడించింది.
 
3. సరిపడినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడు ఆలోచించే శక్తిని క్రమంగా కోల్పోతుందని సర్వే వెల్లడించింది. దానివల్ల మతిమరుపు పెరుగుతోంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
4. ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతే కేవలం వ్యక్తిగత జీవితంలోనే కాదు వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు ఎదురవుతాయట. 2002లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ, మెటాబాలిజమ్‌లో ప్రచురితమైన కథనం ఈ విషయాన్ని నిజం చేస్తోంది. తక్కువగా నిద్రపోయే మగవారిలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయని, శృంగార ఆస్వాదనలో దాని ప్రభావం అధికంగా ఉంటుందని సర్వే వెల్లడించింది.
 
5. రోగనిరోధక శక్తి తగ్గడం: నిద్రలేమి వల్ల జలుబు చేసినా తట్టుకోలేని విధంగా తయారవుతారని సర్వేలో తేలింది. వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
 
6. రక్తపోటు ప్రభావం అధికంగా ఉండటం: ఆరేడు గంటల కంటే తక్కువగా నిద్రపోతే రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలతో బాధపడక తప్పదని సూచిస్తున్నారు. హార్ట్ స్ట్రోక్స్ వల్ల చనిపోయే వారిలో ఇలాంటి వారే ఎక్కువని సర్వేలో తేలింది.
 
7. మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం: నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు మనుషులను చుట్టుముడతాయని సర్వే ఫలితాల్లో తెలిసింది. మానసిక ఒత్తిడి ఆలోచన శక్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని సర్వే వెల్లడించింది. ప్రశాంతత కరువై నిద్రలేని రాత్రులు గడపడానికి అలవాటు పడే ప్రమాదముందని సర్వేలో తేలింది.

చెన్నైలో వెలుగుచూసిన బిర్యానీ బాగోతం !


తమిళనాడు రాజధానిలో క్యాట్ బిర్యానీ అమ్ముతున్నారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గురించి తెలుసు కానీ ఈ క్యాట్ బిర్యానీ ఏంటని ఆశ్చర్యపోకండి. పిల్లులను చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ తయారుచేసి వండివడ్డిస్తున్నారు. అందుకోసం, ఎవరికీ తెలియకుండా పిల్లులను ఓ బోనులో బంధించి ఉంచుతారు. ఈ అక్రమ బాగోతం పల్లవరంలో వెలుగుచూసింది. జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. పిల్లులను బోనులో నుంచి విడిపించారు. అయితే పిల్లుల ప్రవర్తనను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. పిల్లుల సాధారణ ప్రవర్తనకు, ఆ పిల్లుల ప్రవర్తనకు సంబంధం లేదు.
గోడపై బల్లి పాకినట్లు ఎక్కుతున్నాయి. దూకుతున్నాయి. ఈ విషయంపై వాలంటీర్లు మాట్లాడుతూ ఎక్కువ రోజులు బోనులో ఉంచడం వల్ల వాటి మానసిక స్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు. గత కొద్దిరోజులుగా పెంపుడు పిల్లులు కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసిందని పోలీస్ అధికారి జి.వెంకటేషన్ తెలిపారు. అయితే చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్తేమీ కాదని, గతంలో కూడా పలు హోటళ్లలో ఈ బాగోతం వెలుగుచూసిందని స్థానికులు పేర్కొంటున్నారు. పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

Friday, 28 October 2016

‘సింగం’ గర్జించింది!

తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మాంఛి క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు సూర్య. హరి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎస్‌-3’. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ (తమిళం) విడుదలైంది. స్టూడియో గ్రీన్‌ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, శృతిహాసన్‌లు కథానాయికలు.
సింగం సిరీస్‌లో మూడో భాగమైన ఈ చిత్రంలో 2015 మిస్టర్‌ వరల్డ్‌, బుల్లితెర నటుడు థాకూర్‌అనూప్‌ సింగ్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి హేరిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌-3కి ముందు వచ్చిన ‘యముడు’, ‘సింగం’ సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘సింగం’ సిరీస్‌లో సూర్యతో పాటు అనుష్క కామన్‌ పాయింట్‌ అయితే ఎస్‌-3లో కొత్తగా శృతిహాసన్‌ వచ్చి చేరారు.
అయితే ఎస్‌-3 చిత్రం దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేసింది. కానీ సూర్య సోదరుడు కార్తీ నటించిన ‘కాష్మోరా’ చిత్రం కూడా దీపావళికే విడుదల కావడంతో సినిమా విడుదలను వాయిదా వేయమని.. నిర్మాత జ్ఞానవేల్‌ రాజాను సూర్య కోరినట్లు సమాచారం. దాంతో సినిమాను డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
 

Friday, 21 October 2016

చరణ్‌ రిక్వెస్ట్‌ను పవన్‌ కాదంటాడా?



మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి చాలా రోజులైంది. ఈ మధ్య అతని సినిమా లేవీ జనాలను ఆకట్టు కోవడం లేదు. ఆ కొరతను తన రాబోయే సినిమా ‘ధృవ’ తీరు స్తుందని చరణ్‌ కాన్ఫి డెంట్‌గా ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌ను చరణ్‌ సీరియస్‌గా తీసుకుంటున్నాడట. అందుకే ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌కు బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానించాలని అనుకుంటున్నాడట.
నిజానికి చరణ్‌ ఆడియో ఫంక్షన్‌లన్నింటికీ మెగాస్టారే చీఫ్‌ గెస్ట్‌. అయితే పవన్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరైన చరణ్‌ సినిమాలు ‘మగధీర’, ‘నాయక్‌’ సూపర్‌ హిట్‌లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్‌తోనే ‘ధృవ’ ఫంక్షన్‌కు పవన్‌ను ఆహ్వానించాలని ప్లాన్‌ చేస్తున్నాడట. సాధారణంగా అయితే చరణ్‌ రిక్వెస్ట్‌ను పవన్‌ కాదనడు. కానీ, ‘ధృవ’ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్‌. ఆయనతో పవన్‌ రిలేషన్‌ అంతంత మాత్రమే. ‘ప్రజారాజ్యం’ టైమ్‌ నుంచి వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అరవిందే కాకుండా బన్నీ కూడా పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడను అని ప్రకటించి వివాదం రేపాడు. ఈ పరిణామాలన్నింటి మధ్య పవన్‌ ఈ ఆడియో ఫంక్షన్‌కు వస్తాడా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

రానా మెడకు చుట్టుకుంటున్న ‘రమ్మీ’!

బాహుబలి విలన్‌పై కేసు నమోదైంది. సినిమాలో ప్రతినాయకుడి పాత్ర భల్లాలదేవుడిగా కనిపించిన దగ్గుబాటి రానాపై ఓ వ్యక్తి కేసు వేశాడు. మరి అతడిపై కేసు ఎందుకు నమోదైనట్టు అనేనా డౌటు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే రానా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. దానికి కారణం ‘రమ్మీ’. ఆ రమ్మీ(పేకాట)ని ప్రోత్సహించేలా రానా ప్రకటనలు చేస్తున్నాడంటూ తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన పి.ఇళగోవన్ అనే సామాజిక కార్యకర్త కేసు వేశాడు. రానాతో పాటు ప్రకాష్ రాజ్‌పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘‘రానా, ప్రకాష్ రాజ్‌లు పలు వెబ్ సైట్ల ద్వారా గాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. రమ్మీ ఆడేందుకు పురిగొల్పేలా ప్రకటనలు ఇస్తున్నారు. టీవీల్లోనూ అవి ప్రసారం అవుతున్నాయి. వీరు ప్రచారం చేసే సైట్ సహా పలు వెబ్‌సైట్లు కూడా బెట్టింగ్‌కు పురిగొల్పుతున్నాయి’’ అంటూ కోయంబత్తూర్ కమిషనర్‌కు ఇళగోవన్ ఫిర్యాదు చేశాడు. కాగా, బెట్టింగ్, రమ్మీ, గాంబ్లింగ్‌లపై నిషేధం ఉండడంతో ఇళగోవన్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీంతో భల్లాల దేవుడికి తిప్పలు తప్పేలా లేవు.

జనతాపై సరైనోడిదే పైచేయా?


ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’, ఎన్టీయార్‌ ‘జనతాగ్యారేజ్‌’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఒక్కో సినిమా 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు కలెక్ట్‌ చేశాయని ఆయా సినిమాల నిర్మాతలు ప్రకటించారు. అయితే అసలు కలెక్షన్లు ఎంతన్నది మాత్రం నిర్మాతలకు తప్ప ఎవరికీ తెలియదు. కానీ, ఫ్యాన్స్‌ మాత్రం ఎవరి వాదనలను వారు సమర్థించుకుంటున్నారు.
 
గతంలో అయితే ఓ సినిమా ఎంత పెద్ద హిట్టు అనేది లెక్కెయ్యడానికి ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడిందని లెక్కేసేవారు. ప్రస్తుతం అలా వందేసి రోజులపాటు థియేటర్లలో సినిమాలు ఉండడం చాలా అరుదైపోయింది కాబట్టి కలెక్షన్ల మీద ఆధారపడుతున్నారు. అయితే ఈ కలెక్షన్ల లెక్కలన్నీ ఫేక్‌ అనే విషయం తెలిసిందే.
 
అందుకే పాత పద్ధతిలోనే లెక్కేస్తే ‘జనతాగ్యారేజ్‌’ కంటే ‘సరైనోడు’ పెద్ద హిట్‌గా కనబడుతోంది. ‘సరైనోడు’ 115 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. ‘జనతాగ్యారేజ్‌’ 39 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. అయితే ఈ ఏడాది విడుదలైన ఇతర సినిమాలేవి ఈ రెండు సినిమాల రేంజ్‌లో విజయం సాధించలేకపోయాయి. కాబట్టి ఈ హీరోలిద్దరూ ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌ హీరోలే.

ఇజం : రివ్యూ

రేటింగ్: 2.5/5
నిర్మాణ సంస్థ:
య‌న్‌.టి.ఆర్‌.ఆర్ట్స్‌
తారాగ‌ణం: నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌
ఎడిటింగ్‌: జునైద్‌
పాటలు: భాస్కరభట్ల
ఫైట్స్‌: వెంకట్‌ 
ఆర్ట్‌: జానీ
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
 
హీరోలోని మాస్ యాంగిల్‌ను స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేస్తూ, సినిమాలో త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పే ద‌ర్శ‌కుల్లో డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌రు. అందుకే ఈ త‌రం యంగ్ హీరోలు అంద‌రూ పూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని అనుకుంటారు.టెంప‌ర్ సినిమాలో ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాల‌పై త‌న స్వ‌రాన్ని వినిపించిన పూరి ఈసారి ఇజం సినిమాలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ద్వారా బ్లాక్ మనీపై గళం విప్పారు. ఇజం సినిమా ముందు వ‌ర‌కూ బొద్దుగా ఉన్న క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌కు టెంప‌ర్‌తో సూప‌ర్‌హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు పూరి, క‌ళ్యాణ్‌రామ్‌కు ఎలాంటి స‌క్సెస్ ఇస్తాడోన‌ని నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. మ‌రి పూరి, ఇజం ద్వారా ఏం చెప్పాడో చూద్దాం.....

క‌థ:
అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ జావేద్ ఇబ్ర‌హీం(జ‌గ‌ప‌తిబాబు) ఎవ‌రికీ తెలియ‌ని ద్వీపంలో ఉంటూ ఇండియాలో అండ‌ర్ వ‌ర‌ల్డ్ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తుంటాడు. జావేద్ కుమార్తె అలియా(ఆదితి ఆర్య‌). ఇండియాలో రాజ‌కీయ నాయ‌కులు అక్ర‌మంగా సంపాదించిన ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను జావేద్ త‌న బ్యాంక్ ఆఫ్ ప్యార‌డైజ్‌లో దాస్తుంటాడు. జావేద్‌కు ఇండియాలో కోటిలింగం(పోసాని కృష్ణ‌ముర‌ళి) అనే సెంట్ర‌ల్ మినిష్ట‌ర్ స‌పోర్ట్ చేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో స్ట్రీట్ ఫైట్ చూడ‌టానికి వెళ్లిన అలియాను, అక్క‌డ ఫైట్ చేయ‌డానికి వ‌చ్చిన స‌త్య మార్తాండ్‌(క‌ళ్యాణ్‌రామ్‌) చూసి ప్రేమించి ఆమె వెంట‌ప‌డ‌తాడు. అలియాను కూడా స‌త్య త‌న ప్రేమ‌లో ప‌డేలా చేసుకుంటాడు. అయితే క‌థ అక్క‌డే మ‌లుపు తిరుగుతుంది. స‌త్య మార్తాండ్‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన జావేద్ ఉన్న‌ట్టుండి త‌న‌పై కాల్పులు జ‌రుపుతాడు.జావేద్ కాల్పుల నుండి స‌త్య త‌ప్పించుకుంటాడు. ఇంత స‌త్య మార్తాండ్ ఎవ‌రు? జావేద్‌కు, స‌త్య‌కు ఉన్న లింకేంటి? గ‌్రాండ్ లీకేజ్ వెబ్ సైట్‌కు,స‌త్య‌కు ఉన్న సంబంధం ఏమిటి? అస‌లు స‌త్య స‌మాజానికి ఏం చేయాల‌నుకుంటాడు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే....

ప్ల‌స్ పాయింట్స్
- క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న‌
- అనూప్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌
- సినిమాటోగ్ర‌ఫీ
- పూరి డైలాగ్స్‌

మైన‌స్ పాయింట్స్
- ఫ‌స్టాఫ్‌
- క్లైమాక్స్‌

విశ్లేష‌ణ: 1947లో భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్పుడు ఇండియ‌న్ కరెన్సీకి, డాల‌ర్‌కు స‌మానమైన విలువ ఉండేది. కానీ ఇప్పుడు రూపాయి విలువ డాల‌ర్ కంటే 70 శాతం వెన‌క‌బ‌డింది. అందుకు కార‌ణం. లంచం...ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ‌పెట్టే సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేర‌నీయ‌కుండా మ‌న దేశంలో రాజ‌కీయ నాయ‌కులు ల‌క్ష‌లు కోట్లు బ్లాక్ మ‌నీని సంపాదించి ఇత‌ర దేశాల్లోని బ్యాంకుల్లో దాస్తున్నారు. దాని వ‌ల్ల దేశంలో పేద‌రికం, నిరుద్యోగ స‌మ‌స్య ఏర్ప‌డ‌మే కాకుండా రైతుల ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం, ఆక‌లితో రోజుకు సగ‌టు ఏడు వేల మంది దాకా చనిపోయే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.
 
ఈ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మ‌నీని మ‌న‌దేశానికి ర‌ప్పించ‌డ‌మే. అలా వ‌చ్చిన డ‌బ్బులో ప‌ది శాత‌మో, ఇరవై శాత‌మో పేద వాళ్ల కోసం ఖ‌ర్చు పెడితే దేశంలో పేద‌రికం అనేది ఉండ‌దు...అలా ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే అప్పుడు దేశంలోని స‌మ‌స్య‌కు కార‌ణం మ‌న‌మే అవుతాం.. సింపుల్‌గా చెప్పాలంటే ఇజం క‌థాంశ‌మిదే. ఈ పాయింట్‌ను చెప్పాల‌నుకున్న పూరి త‌నదైన స్టైల్లో ముఖంపై కొట్టేలా చెప్పాడు. స్వాతంత్రానికి ముందు తెల్ల‌వాళ్లు దేశాన్ని దోచుకున్నార‌ని చ‌దువుకుంటున్నాం కానీ వాళ్లు మ‌న‌కు రోడ్లు, రైలు, నౌకాయానం, విమానం, అడ్మినిస్ట్రేష‌న్ కార్య‌కలాపాల‌ను నేర్పించారు. కానీ స్వాతంత్ర్యం త‌ర్వాత మ‌న‌ల్ని మ‌న‌మే దోచుకుంటున్నాం..ఇప్పుడు మ‌నం చ‌దువుకోవాల్సిందే ఎప్పుడో దేశాన్ని దోచుకున్న తెల్ల‌వాడి గురించి కాదు..ఇప్పుడు దేశాన్ని దోచుకుంటున్న న‌ల్ల‌వాడి గురించే...
 
బ్లాక్‌లో కొందామ‌నుకున్నామంచివాడనేవాడు క‌న‌ప‌డ‌టం లేదు...వంటి డైలాగ్స్‌తో పూరి త‌న‌లో ర‌చ‌యిత‌కు బాగానే ప‌ని చెప్పాడు. ఇంటర్వెల్ ముగిసిన త‌ర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కు సినిమాను పూరి ఆస‌క్తిక‌రంగా న‌డిపాడు. అయితే ఎప్ప‌టిలాగే ఫ‌స్టాఫ్‌లో హీరో, హీరోయిన్‌ను ఏడిపించ‌డం, డాన్ జావేద్ ద‌గ్గ‌ర ర‌హ‌స్యాల‌ను రాబ‌ట్టం అనే క‌థాంశంతో ఫ‌స్టాఫ్ చ‌ప్ప‌గా ఉంది. ప్రీ క్లైమాక్స్‌లో క్లైమాక్స్ ఉంది. పూరి ఆ సంగ‌తిని మ‌రిచాడేమో..అక్క‌డ నుండి సినిమాను సాగ‌దీయడం ప్రేక్ష‌కుడికి విసుగు తెప్పిస్తుంది.
 
క‌థ‌, క‌థ‌నం విష‌యంలో పూరి మ‌రింత జాగ్ర‌త్త తీసుకుని ఉండుంటే సినిమా ఇంకా బావుండేద‌నిపించింది. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ముఖ్యంగా ఇట‌లీ అందాల‌ను త‌న కెమెరాలో చ‌క్క‌గా బంధించాడు. అనూప్ అందించిన సంగీతం క‌నులు నీవైనా అనే సాంగ్‌..హీరోయిన్ టీజింగ్ సాంగ్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది.
 
ఇక న‌టీన‌టుల విషయానికి వ‌స్తే..క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌నప‌రంగా మంచి మార్కుల‌ను కొట్టేశాడు. ముఖ్యంగా లుక్ విష‌యంలో కేర్ తీసుకుని సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. పూరి టేకింగ్ వ‌ల్ల క‌ళ్యాణ్‌రామ్‌లో కొత్త కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. హీరోయిన్ ఆదితి ఆర్య పాత్ర ఉండాలంటే ఉంది అన్న‌ట్లు క‌న‌ప‌డింది. ప‌వ‌ర్‌ఫుల్ డాన్ అంటూ జ‌గ‌ప‌తిబాబు చేసిన జావేద్ పాత్ర సినిమా ఆసాంతం తేలిపోయింది. ఈ పాత్రను జ‌గ‌ప‌తిబాబులాంటి సీనియ‌ర్ హీరో చేయాల్సిందేనా అనే ఆలోచ‌న వస్తుంది. వెన్నెల‌ కిషోర్‌, అలీ కామెడి ఏదో ఉందంటే ఉంద‌నిపిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి, ఈశ్వ‌రీరావు, పోసాని త‌దిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.
 
బోట‌మ్ లైన్: గ‌తి త‌ప్పిన పూరి జ‌ర్న‌లి(ఇ)జం..

స్టూడెంట్‌ని రోడ్డు గుంత చంపేసింది

కూకట్‌పల్లి (హైదరాబాద్‌): రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ ఎస్‌ఎస్‌కాలనీకి చెందిన అరుణకుమార్‌(25) ఎంటెక్‌ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హఫీజ్‌పేట నివాసి సోమశేఖర్‌(32)తో కలిసి ద్విచక్రవాహనంపై మూసాపేట వైపు వెళ్తుండగా కూకట్‌పల్లి వై జంక్షన్‌ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న అరుణ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, సోమశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న గుంతలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజుగారి గదిలో నాగ్‌?

కొత్తదనం ఉన్న కథల్ని. కొత్త ఆలోచనలతో వచ్చిన దర్శకుల్నీ భుజం తట్టి ప్రోత్సహిస్తుంటారు నాగార్జున. ఆయన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అనే లెక్కలే ఉంటాయి. అందుకే చిన్న సినిమాలకూ ఆయన తనవంతు సహాయం చేస్తుంటారు. అలాంటి సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఇప్పుడూ అలాంటి ప్రయత్నమే జరుగుతోందని టాలీవుడ్‌ టాక్‌. గతేడాది వచ్చిన చిన్న చిత్రాల్లో ‘రాజుగారి గది’ కూడా మెరిసింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అందుకు నాలుగు రెట్లు లాభాల్ని సంపాదించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘రాజు గారి గది 2’ వస్తోంది. ఇందులో ఓ కీలకమైన పాత్రలో నాగార్జున కనిపిస్తారని సమాచారం. ఇది వరకు ఈ పాత్ర వెంకటేష్‌ చేస్తారని చెప్పు కొన్నారు. అది చివరికి నాగార్జున చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. హారర్‌ చిత్రంలో నటించడం నాగ్‌కి ఇదే ప్రధమం. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

అతిచిన్న స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

ప్రస్తుతం 4 నుంచి 6 అంగుళాల స్క్రీన్‌ ఉండే స్మార్ట్‌ఫోన్లపైనే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు అందరినీ ఆకట్టుకున్న మూడంగుళాల ఫోన్ల వూసే ఇప్పుడు లేకుండా పోయింది. కానీ.. ఈ ఫోన్‌ చూశారా? దీని డిస్‌ప్లే సైజు కేవలం 1.54 ఇంచులు మాత్రమే! అందుకే ప్రపంచంలోనే అతి చిన్న టచ్‌స్క్రీన్‌ ఫోన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.
తాజాగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ చిట్టి ఫోన్‌ పేరు ‘వీఫోన్‌ ఎస్‌8’. చైనాలోని ‘వీఫోన్‌’ అనే సంస్థ అభివృద్ధి చేసింది. అయితే పరిమాణంలో ఇది పొట్టిదైనా.. ఫీచర్ల విషయంలో మాత్రం పెద్ద స్మార్ట్‌ఫోన్లకు ఏ మాత్రం తీసుపోదట. ఐఓఎస్‌.. ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇతర ఓఎస్‌లను సపోర్ట్‌ చేసే ఫోన్లనూ తీసుకురానున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ఫోన్‌ ధర 30 డాలర్లు(సుమారు రూ. 2000)గా ప్రకటించింది.
దీనికి కేవలం పవర్‌ బటన్‌ మాత్రమే ఉంది. తెరపై మరో మూడు వర్చువల్‌ బటన్స్‌ ఉన్నాయి. మిగతా ఫోన్లలాగే స్పీకర్‌, మైక్రోఫోన్‌ కలిగి ఉంది. బ్లూటూత్‌ సదుపాయం.. హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు చూస్తే..
* బిల్ట్‌ఇన్‌ ఎఫ్‌ఎం రేడియో
* హార్ట్‌ రేట్‌ సెన్సర్‌
* నడకను లెక్కించే పెడోమీటర్‌
* లైట్‌ సెన్సర్‌
* 64ఎంబీ ర్యామ్‌
* 128ఎంబీ ఇంటర్నల్‌ మెమొరీ(8జీబీ వరకు పెంచుకోవచ్చు)
* 380యంఏహెచ్‌ బ్యాటరీ
ఇది ప్రస్తుతానికి చైనా మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది.

Thursday, 20 October 2016

వెండితెరపై సీఎం కేసీఆర్ జీవితచరిత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితిచరిత్ర ఆధారంతో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు మధుర శ్రీధర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాజ్ కందుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. 2017 జూన్ 2న సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం రోజు సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Wednesday, 19 October 2016

ఎయిర్‌టెల్ మరో బంపరాఫర్.. రూ.259కే..

రిలయన్స్ జియో ప్రభావమో ఏమో.. టెలికం సంస్థలు దెబ్బకు దిగొస్తున్నాయి. ఇప్పటికే టారిఫ్ ప్లాన్లను బాగా తగ్గించి వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థలు జియోతో పోటిపడుతున్నాయి. తాజాగా మార్కెట్ పోటీని తట్టుకునేందుకు భారతి ఎయిర్‌టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా కొనుగోలు చేసే ఏ 4జీ మొబైల్‌కైనా రూ.259తో 10 జీబీ డాటాను ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే 1 జీబీ కేవలం రూ.25కే అన్నమాట. భారతదేశమంతటా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రీచార్జ్ చేసిన వెంటనే 1 జీబీ వినియోగదారుడి ఖాతాలో చేరుతుంది. మిగతా 9 జీబీల డాటాను ‘మై ఎయిర్‌టెల్’ యాప్ ద్వారా పొందవచ్చు. కొత్త వినియోగదారులు మూడు నెలల వ్యవధిలో గరిష్టంగా మూడుసార్లు రీచార్జ్ చేసుకోవచ్చు. ఆగస్టులో ఈ ఆఫర్‌ను కేవలం సామ్‌సంగ్ గెలాక్సీ జె సిరీస్ ఫోన్ల కొన్నవారికి మాత్రమే పరిమితం చేయగా ఇప్పుడు అన్ని ఫోన్లకు వర్తింపజేసింది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ప్రారంభించిన ఈ ఆఫర్‌ను ఇప్పుడు దేశమంతా విస్తరించింది. కాగా వొడాఫోన్ కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్‌నే ప్రకటించింది. ఎంపిక చేసిన మెట్రోపాలిటిన్ నగరాల్లో 4జీ మొబైల్ కొన్న కొత్త వినియోగదారులకు 1జీబీ డాటా రేటుకే 10జీబీని అందిస్తున్న సంగతి తెలిసిందే.

పెట్రోల్ బంకులు ఆరు రోజులు బంద్!


పెట్రోల్ బంకులు వినియోగదారులకు షాకిచ్చాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వచ్చే నెలలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగేందుకు సిద్ధమయ్యాయి. 2012లో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగనున్నాయి. ఈ కారణంగా నవంబర్‌లో బంకులకు యాజమాన్యాలు 5రోజుల సెలవు ప్రకటించాయి. నవంబర్ 3, 15న బంకులు పూర్తిగా మూతపడే అవకాశమున్నట్లు సమాచారం. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లో బంకులు తెరవకూడదనే నిర్ణయానికొచ్చాయి. నవంబర్ 5 నుంచి బ్యాంకు సెలవులు, పండుగ రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ నిరసనకు మద్ధతు ప్రకటిస్తూ అక్టోబర్ 19, 26 తేదీల్లో రాత్రి 7 నుంచి 7.15 వరకూ పెట్రోల్ బంకుల్లో లైట్లను ఆఫ్ చేయనున్నారు. పావు గంట పాటు పెట్రోల్ గానీ, డీజిల్ గానీ అమ్మకూడదని నిర్ణయించుకున్నారు.

అందుకే బాలయ్య పేరు ముందు ‘నందమూరి’ పెట్టలేదట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి విడుదల కానుంది. ఇటీవల జరగిన దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌లను విడుదల చేశారు. టీజర్‌లో బాలకృష్ణ పేరుకు ముందు నందమూరి అని ఉండదు. నిజానికి బాలయ్యకు తన ఇంటి పేరు అంటే ఎంతో ఇష్టం. కానీ, ఈ సినిమాకు మాత్రం తన పేరుకు ముందు నందమూరి అని వేసుకోలేదు.
దీని వెనుక ఆసక్తికరమైన కారణముందంటున్నాడు దర్శకుడు క్రిష్‌. ‘పూర్వం వ్యక్తుల పేర్లకు ముందు తండ్రుల పేర్లే ఉండేవి. అది చాలా హీనం అని భావించాడు శాతకర్ణి. అలాంటి కరుడుగట్టిన పితృస్వామ్య రోజుల్లో కూడా తన తల్లి పేరైన గౌతమిని తన పేరుకు ముందు పెట్టుకుని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అని పిలిపించుకున్నాడు. ఆ నియమాన్నే పాటిస్తూ మేము కూడా ‘బసవతారకపుత్ర బాలకృష్ణ’, ‘అంజనీపుత్ర క్రిష్‌’ అని వేయించామన్నా’డు. ఓ కొడుకు తండ్రి కంటే గొప్పవాడు కాగలడేమో గాని, తల్లి కంటే మాత్రం గొప్పవాడు కాలేడని క్రిష్‌ అన్నాడు.

Sunday, 9 October 2016

కొత్త జిల్లాల స్పెషల్...

కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషనను నేడో, రేపో జారీ చేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించిన ట్లు సమాచారం. అలాగే జిల్లాల సంఖ్య 31గానే ఉం డనుంది. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశం 3 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. అయితే కొత్త జిల్లాలపై చర్చ తక్కువగానే జరిగినట్టు సమాచారం. కొత్త జిల్లాలు, గ్రామాల సంఖ్య, మండలాల సంఖ్య, జనాభా, విస్తీర్ణం వంటి వివరాలతో పాటు ఏ జిల్లాలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి వంటి వివరాల కోసం ఈ కింద లింక్‌లను క్లిక్ చేయండి...



Friday, 7 October 2016

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా డిమాండ్‌ లేమితో నేటి బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. పది గ్రాముల పసిడి ధర రూ.170 తగ్గి రూ.30,320కి చేరింది. అలాగే వెండి ధర కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర రూ.920 తగ్గి రూ.41,930కి పడిపోయింది. వెండికి పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కూడా డిమాండ్‌ తగ్గినట్లు బులియన్‌ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1254.40డాలర్లు కాగా, ఔన్సు వెండి ధర 17.27డాలర్లుగా ఉంది.

అరుదైన పామును రక్షించిన పోలీసులు

అరుదుగా కనిపించే రెండు తలల ఎరుపు ఇసుక రంగు పాము(బో)ను బెంగళూరు పోలీసులు రక్షించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పామును వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వణ్యప్రాణి వాణిజ్య మార్కెట్‌లో దీని విలువ రూ.కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురు వ్యక్తులకు అరుదైన జంతువులను అక్రమంగా తరలించే ముఠాతో ప్రమేయం ఉన్నట్లు చిక్కజల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాములను పట్టుకునే వారి నుంచి తక్కువ మొత్తంలో ఏజెంట్లు కొనుగోలు చేసి తర్వాత వీటిని భారీ లాభాలకు అమ్ముకుంటారని పోలీసులు అంటున్నారు. నిందితుల నుంచి రక్షించిన పామును బన్నేర్‌ఘట్ట జాతీయ పార్క్‌కు చేర్చినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇండియాలో రెండు తలల పాము తమ దగ్గర ఉంటే అదృష్టం వరిస్తుందని పులువురి నమ్మకం అంతే కాకుండా చేతబడుల కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లో వీటిని మందులు తయారీకి వినియోగిస్తారు. బెంగళూరులోని ఆర్మీ లేఅవుట్ సమీపంలో వేంకటేశ్వర కాలేజీ దగ్గర ఆదివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో.... రెండు తలల ఎరుపు రంగు పామును అమ్మడానికి ముఠా ప్రయత్నిస్తోందన్న విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకోడానికి పథకం వేశారు. ప్రైవేట్ వాహనంలో వచ్చిన నిందితులు ఎప్పటిలాగే పామును అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఈ మారు వేషంలో వచ్చిన పోలీసుల వారి ప్రయత్నాన్ని వమ్ము చేశారు. రూ.లక్ష బేరం కుదుర్చుకుంటున్న తరుణంలో హఠాత్తుగా పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని ముని కృష్ణ (28), గోపాల్ (22), పునీత్ (21), కార్తీక్ (18)గా గుర్తించారు. ఇలాంటి అరుదైన పాములు కర్ణాటకలోని బేగేపల్లి, ములబగల్, కోలార్, తుముకూరులోని సిర ప్రాంతాల్లో వీటి ఉనికి ఎక్కువని అధికారులు తెలిపారు. వీటిని అక్రమ రవాణా ద్వారా అమ్ముతుంటారని, విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఇవి తమ దగ్గర ఉంటే అదృష్టంగా భావిస్తారు. అలాగే జపాన్, మలేసియా, సింగపూర్, చైనా దేశాలకు వీటిని స్మగ్లింగ్ చేస్తారని, స్థానికుల నుంచి కొనుగోలు చేసిన బో పాములను అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ మొత్తానికి అమ్ముతారని నార్త్-ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పీఎస్ హర్ష తెలిపారు.

బ్యాంకులకు 5 రోజుల సెలవు

బ్యాంకులకు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఎనిమిదో తేదీన రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత 9వ తేదీ ఆదివారం, 10వ తేదీ ఆయుధ పూజ, 11వ తేదీ మంగళవారం విజయదశమి, 12వ తేదీన మొహర్రం పండుగలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

సీఎం జయలలితను సింగపూర్‌కు తరలించే అవకాశం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సింగపూర్‌ వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. గత నెల 22వతేదీన అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. కాగా... ఇప్పటికే ఆమెకు లండన్ నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు కూడా చికిత్స నిర్వహించారు. కాగా... శుక్రవారం సింగపూర్ నుంచి వచ్చిన వైద్యులు ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. అలాగే జయలలితను సింగపూర్ తరలించే అవకాశముందనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు ‘అమ్మ’గా పిలుచుకునే జయలలిత... త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆమెను సింగపూర్ కు తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.

ముగ్గురు నైజీరియన్ల అరెస్టు

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో వాహనాల విక్రయం పేరుతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందంటూ బాధితుడు లవీశ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లవీశ్‌కుమార్‌ నుంచి ఈ ముఠా రూ.1.85లక్షలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో..నెగిటివ్‌ గ్రూప్‌ రక్తం కొరత

గాంధీ ఆస్పత్రిలో ప్రసవవేదన పడుతున్న ఓ గర్భిణికి రక్తం అవసరమైంది. ఆమె గ్రూప్‌రేర్‌కు సంబంధించి కావడంతో ఆస్పత్రిలో అందుబాటులో లేదు. దీంతో కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఉరుకుల పరుగుల మీద నగరంమొత్తం గాలిం చారు. చివరకు రక్తంసేకరించి ఆస్పత్రి వైద్యులకు అందజేశారు. సకాలంలో రక్తం లభించడంతో రోగిప్రాణాలు కాపాడ గలిగారు. గాంధీలోనే కాదు... ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి.ఆంధ్రజ్యోతి,హైదరాబాద్‌ సిటీ: గాంధీ, ఉస్మాని యా ఆస్పత్రుల్లో ఒకరు రక్తం ఇస్తేగానీ రోగికి ఎక్కిం చలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఆస్పత్రుల్లో అడ్మిట్‌ రోగికి రక్తం అవసరమైతే ముందుకుగా కుటుంబసభ్యులు, బంధు వులు, మిత్రులుకానీ రక్తం ఇవ్వాల్సిన దుస్థితి.
నెగిటివ్‌ బ్లడ్‌ దొరకడం కష్టమే....
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రధానంగా నెగిటివ్‌ బ్లడ్‌ దొరకడం కష్టంగా మారింది. ఎ నెగిటివ్‌, బి నెగిటివ్‌, ఓ నెగిటివ్‌ గ్రూపులకు సంబంధించిన రక్తం ఉస్మానియాలో దాదాపు అందుబాటులో లేదు. ఈ గ్రూపు రక్తం కావాలంటే రోగుల బంధువులు బయటకు పరుగులు తీయాల్సిందే. బి నెటిటివ్‌ కావా లంటే ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే నలుగురు బి నెగిటివ్‌కోసం బాధితులు పేర్లను నమోదుచేసుకుని సిద్ధంగాఉన్నట్లు తెలిసింది.
అవసరం మేరకు లేదు
ప్రతినెలా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 500 నుంచి 600 యూనిట్ల రక్తం అవసరమవుతోంది. కానీ ఆ మేరకు నిల్వ ఉండడం లేదు. ఇక ఇక్కడ ఓ నెగిటివ్‌, ఏబీ నెగిటివ్‌ రక్తం నలుగురికి సరిపో యేంత ఉంది. దీంతో రోగులు రక్తంకావాలంటే నానా తంటాలు పడాల్సిందే. ఉస్మానియాలో ప్రతిరోజూ 40 మందికి రక్తం అవసరమైతే 10 మంది మాత్రం దానం చేస్తున్నారని వైద్యులు తెలిపారు. అవసర మైతే ఐపీఎం నుంచి తెప్పించుకుంటున్నామని వైద్యులు తెలిపారు.
50- 60 బ్యాగ్‌ల రక్తం కొనుగోలు
విపత్కరపరిస్థితుల్లో రక్తంకోసం రోగులు, బంధు వులు పడే ఆందోళన అంతా ఇంతా కాదు. ప్రైవేట్‌ బ్లడ్‌బ్యాంకుల నిర్లక్ష్యం, రీప్లేస్‌మెంట్‌రక్తం లభించక పోవడం, సకాలంలో దాతలుఅందుబాటులో లేకపోతే రోగి కుటుంబసభ్యులు తల్లడిల్లాల్సిందే. ఈ ఆస్పత్రు ల్లో ప్రతినెలా 50 నుంచి 60 బ్యాగ్‌ల రక్తాన్ని రోగులు బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు.
ఒకరు దానం చేస్తేనే రక్తం సరఫరా....
ఈ ఆస్పత్రుల్లో రోగికిరక్తం కావాలంటే మరొకరు రక్తాన్ని దానంచేయాల్సిందే... రోగులకు రక్తం అవసరమైన సమయంలో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి రక్తాన్ని ఇవ్వాల్సి వస్తోంది. చాలా మంది కుటుంబ సభ్యులు రక్తాన్ని ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరూ రక్తదానం చేయకపోతే రోగి బంధువులు ప్రైవేట్‌బ్లడ్‌ బ్యాంకులకెళ్లి కొనుగోలు చేయాల్సిందే.
పట్టించుకోని ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు
నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ బ్లడ్‌ బ్యాంకులు ఉస్మా నియా, గాంధీ ఆస్పత్రులకు రక్తం సరఫరా చేయాలి. వైద్యశిబిరాల ద్వారా సేకరించిన రక్తం నుంచి 30 శాతం మేరకు రక్తాన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు తప్పని సరిగ్గా ఇవ్వాల్సిందే. అయితే అవి అవసరమైన రక్తాన్ని సరఫరాచేయడం లేదని సమాచారం. ప్రైవేట్‌ బ్లడ్‌బ్యాంకుల్లో ఎక్కువగా అవసరంలేని గ్రూపుల రక్తాన్నే సరఫరా చేస్తున్నట్లు వైద్యులు వివరించారు.
నారాయణ బ్లడ్‌ బ్యాంకే దిక్కు..
వివిధ జిల్లా నుంచి వచ్చిన రోగుల బంధువులు రక్తంకోసం నారాయణబ్లడ్‌బ్యాంక్‌ను ఆశ్రయి స్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పెద్దాస్పత్రిలో వైద్యం దొరకుతుందని వచ్చిన నిరుపేదలకు నారాయణబ్లడ్‌బ్యాంకే దిక్కవు తోంది. వైద్యులుసూచనతో ఈ బ్లడ్‌ బ్యాంక్‌కు రోగుల బంధువులు పరుగులు తీస్తున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో నెంబర్ వన్ ఏదో తెలిసిపోయింది!

పండగ సీజన్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఇది వరకు షాపింగ్ చేయాలంటే పనిగట్టుకుని షాపుకి వెళ్లి కొనుగోళ్లు చేసేవారు. అది చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటిదాన్ని సులభతరం చేయడానికి ఎన్నో ఆన్‌లైన్ రిటైల్ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతీ సంస్థ ఏదో ఒక ఆఫర్ పెట్టడం, డిస్కౌంట్లు ఇవ్వడం వంటివి చేసి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఆయా సంస్థల మధ్య పోటీలో ప్రధమ స్థానంలో నిలిచే రిటైల్ సంస్థ ఏదనే చర్చలు కూడా నడిచాయి. అయితే ఆ చర్చలకు ఫ్లిప్‌‌కార్ట్ సంస్థ పుల్‌స్టాప్ పెట్టింది.
 
దసరా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తాము ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ ఫెస్టివల్ అమ్మకాల్లో ఎక్కువ యూనిట్లను విక్రయించి దేశీయ ఆన్ లైన్ మార్కెట‌్‌లో ప్రధమ స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. బిగ్ బిలియన్ డే పేరిట అక్టోబర్ 2 నుంచి 6వ తేదీ వరకు 15.5 మిలియన్ యూనిట్లను విక్రయించినట్టు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. దీనికి స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ విక్రయాలు ఎక్కువగా సహకరించినట్టు వారు చెప్పారు. అయితే అంతకు ముందు రోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరేతో 15 మిలియన్ యూనిట్ల విక్రయాలు చేసినట్లు ప్రకటించింది.

ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్‌

ఆర్థిక లావాదేవీల వివరాలను, వ్యక్తిగత అంశాలను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం. కానీ.. సోషల్‌మీడియా సైట్లలో ఛాటింగ్‌ ద్వారా అలాంటి విషయాలను పంచుకోవడం ఏమాత్రం మంచిది కాదన్నది నిపుణుల సూచన. ఎందుకంటే.. మనకు తెలియకుండానే హ్యాకర్లు, గూఢచార సంస్థలు మన విలువైన సమాచారాన్ని దొంగలించే అవకాశం చాలా ఎక్కువ. ఇక నుంచి ఆ భయం అక్కర్లేదంటోంది ఫేస్‌బుక్‌. అందుకోసం మెసెంజర్‌ యాప్‌లో ‘సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
స్నాప్‌చాట్‌.. వాట్సాప్‌.. వైబర్‌ తీసుకొచ్చిన ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ విధానం ఇప్పుడు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తికి అర్థమయ్యే పరిస్థితి ఉండదు. వాటిని ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి.. ప్రభుత్వ నిఘా సంస్థలు కూడా అర్థం చేసుకునే వీలుండదట.
అలాగే ‘సీక్రెట్‌ కన్వర్‌జేషన్‌’ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తే మనం పంపిన మెసేజ్‌లు మనం ఎంచుకున్న కాల వ్యవధిలో డిలీట్‌ అయిపోతాయి. అది ఎంత సమయంలో అంటే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజుల్లోగా డిలీట్‌ అయ్యేట్లు సెట్‌ చేసుకోవచ్చు. ఈ సదుపాయం తాజాగా విడుదలైన గూగుల్‌ ‘అల్లో’ యాప్‌లోనూ ఉంది. మరో విశేషమేమిటంటే.. ఒక డివైజ్‌ నుంచి పంపిన మెసేజ్‌లను మరో డివైజ్‌లో లాగిన్‌ అయ్యి చూసుకునే వీలుండదు. ఉదాహరణకు.. స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా జరిపిన సంభాషణలు డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో లాగిన్‌ అయ్యి చూస్తే కనిపించవు.
ఆండ్రాయిడ్‌.. ఐఓఎస్‌ వెర్షన్‌లో మెసెంజర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్‌ తెలిపింది.

అమెరికాను వణికిస్తున్న మాథ్యూ హరికేన్‌

హైతీలో 283మంది మృతి
అత్యవసరస్థితి ప్రకటించిన ఒబామా

జాక్సోన్‌విల్లే: పెనుతుపాను ‘మాథ్యూ’ దెబ్బకు అమెరికాలోని ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోతోంది. హైతీలో మాథ్యూ హరికేన్‌ వల్ల ఇప్పటికే 283 మంది ప్రాణాలు కోల్పోవడంతో అమెరికా భయపడుతోంది. ఈ పెనుతుపాను ఇప్పుడు ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో అగ్రరాజ్యం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇప్పటికే ఫ్లోరిడా, జార్జియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హరికేన్‌.. పెనుగాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ్యాథ్యూ హరికేన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ ప్రమాదక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు. పెను తుపాను మనుషులను చంపేస్తుంది, చాలా సీరియస్‌, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది నాలుగో కేటగిరీ హరికేన్‌ అని అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంలో కరేబియన్‌ ప్రాంతంలో సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు చెప్తున్నారు. అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలు ఫ్లోరిడా నుంచి నార్త్‌కెరోలినా వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎమర్జెన్సీ ప్రకటించారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కొన్ని చోట్ల విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. మాథ్యూ తీవ్రతను తెలియజేస్తూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దాదాపు 25లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. ఫ్లోరిడా మీదుగా వెళ్లాల్సిన దాదాపు 2800 విమానాలను రద్దు చేశారు. గంటకు 230కిలోమీటర్ల వేగంతో గాలలు వీస్తాయని అంచనావేస్తున్నారు.
హైతీలో ఈ పెనుతుపాను తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించింది. జెరెమీ నగరంలో దాదాపు 30వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోచ్‌ ఎ బాట్యూ నగరంలోనే 50 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం హైతీ, క్యూబాలతో పాటు బహమాస్‌పై కూడా పడింది. భారీ వేగంతో వీచే గాలుల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అయితే ప్రాణనష్టం ఎక్కువగా హైతీలోనే జరిగింది. తీరప్రాంతంలోని మత్స్యకార గ్రామాలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్‌, టెలిఫోన్‌, రవాణా వ్యవస్థలు దెబ్బతినడంతో పాటు ఆహరం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

మన వూరి రామాయణం : రివ్యూ

నటీనటులు: ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, పృథ్వీ, సత్య తదితరులు
సంగీతం: ఇళయరాజా
మాటలు: గోపిశెట్టి రమణ, ప్రకాష్‌రాజ్‌
ఛాయాగ్రహణం: ముఖేష్‌
నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌
విడుదల: 07 –10-2016

నటుడిగా ప్రకాష్‌ రాజ్‌ స్థాయి ఏంటో అందరికీ తెలుసు. జాతీయ అవార్డుల్ని అందుకొన్న నటుడాయన. దర్శకుడిగానూ తనలో ఉన్న కోణాన్ని బయటపెట్టాలనుకొన్నారాయన.  అందుకే ‘ధోని’ సినిమాతో మెగాఫోన్‌ పట్టారు. ‘ఉలవచారు బిర్యానీ’ రుచి చూపించారు. అయితే.. ఈ రెండు సినిమాలూ అంతంత మాత్రంగానే ఆడాయి. ఇప్పుడు ‘మన వూరి రామాయణం’ అంటూ మరో కథ చూపించేందుకు సిద్ధమయ్యారు. మలయాళ చిత్రం ‘షట్టర్‌’కి రీమేక్‌ ఇది. మరి ఆయన ప్రయత్నం ఎలా సాగింది?  ప్రకాష్‌రాజ్‌లోని దర్శకుడు ఎంతవరకు బయటకొచ్చాడు? ఇంతకీ ఈ సినిమా కథేంటి? అన్నది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే: అదో పల్లెటూరు. శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ వూర్లో భుజంగం (ప్రకాష్‌రాజ్‌) పెద్ద మనిషి. అందరూ సలాం కొడుతుంటారు. ఇంట్లో పెళ్లీడొచ్చిన కూతురు ఉంటుంది. తనకో  సంబంధం తీసుకొస్తాడు. ‘నేనప్పుడే పెళ్లి చేసుకోను’ అంటుందా అమ్మాయి. ఇంట్లోవాళ్లు తన మాట వినడం లేదని అసహనంతో రగిలిపోతుంటాడు భుజంగం. శివ (సత్య) ఓ ఆటో డ్రైవర్‌. తనకు భుజంగం వీసా ఇప్పిస్తే దుబాయ్‌ వెళ్లిపోవాలని.. అతని చుట్టూ తిరుగుతుంటాడు. తెల్లారితే  శ్రీరామనవమి అనగా ఆ రోజు రాత్రి చిత్తుగా తాగుతాడు భుజంగం. ఆ మత్తులో ఓ వేశ్య (ప్రియమణి)ని చూసి మనసు పారేసుకొంటాడు.
ఎలాగైనా సరే.. తనని అనుభవించాలనుకొంటాడు. సత్య సాయంతో బేరమాడి ఆ వేశ్యని తన ఇంటి ముందున్న షెడ్డులోకి తీసుకొస్తాడు. కానీ ఎందుకో మనసొప్పదు. ఈ వ్యవహారం బయటి జనానికి తెలిస్తే  పరువు పోతుందని కంగారు పడుతుంటాడు. అనుకోకుండా ఆ షెడ్డుకి తాళం వేసి వెళ్లిపోతాడు సత్య. గంటలో వస్తాడనుకొంటే ఓ చోట ఇరుక్కుపోతాడు. మరి.. ఆ గదిలోంచి వీరిద్దరూ బయటపడ్డారా?  భుజంగం భాగోతం వూరి జనానికి తెలిసిపోయిందా? ఆ ఒక్క సంఘటన వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అన్న విషయాలు వెండితెర మీద చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: సన్నటి దారం పోగులాంటి కథాంశం ఇది. అసలు ఇలాంటి పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా? అనిపిస్తుంది. మలయాళంలో ఆ ప్రయత్నం చేసిన దర్శకుడ్ని అభినందించాలి. దాన్నే తెలుగులో అనువదించే ప్రయత్నం చేశారు ప్రకాష్‌రాజ్‌. ఈ కథంతా నాలుగు పాత్రల చుట్టూనే నడుస్తుంది. వివిధ సందర్భాల్లో వాళ్ల భావోద్వేగాలు, సంఘర్షణ, జీవితాన్ని చూసే కోణం వీటి మధ్య సన్నివేశాల్ని అల్లుకొన్నారు. చిన్న గదిలో దాదాపు సగం సినిమా నడుస్తుంది. ప్రియమణి..  ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేవేశాలు కట్టిపడేస్తాయి. తొలిసగం సమయం తెలీకుండానే గడిచిపోతుంది. మలి సగం మాత్రం కాస్త సాగుతున్నట్లు అనిపించినా.. ఆ అసంతృప్తి కొంత మేరే.  వాస్తవానికి ఇలాంటి కథల్లో వినోదాన్ని ఆశించలేం. కానీ తెలివిగా గరుడ అనే దర్శకుడి పాత్రని ప్రవేశ పెట్టాడు. కథలోనే  వీలైనంత వినోదం పండించే ప్రయత్నం జరిగింది. ఎలా చేశారంటే: ప్రియమణి తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. చాలాకాలం తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది. మంచి పాత్రలు దొరికితే తాను పోటీలోనే ఉన్నానని చెప్పేస్తుందీ సినిమా. ఆమెకీ సినిమా తప్పకుండా ఉపయోగపడుతుంది. ప్రకాష్‌రాజ్‌కు నల్లేరు మీద నడకలాంటి ప్రయాణమే. పృథ్వీ పాత్ర కొత్తగా కనిపిస్తుంది. చాలా సెటిల్డ్‌గా నటించాడు. సత్య నటన కూడా ఆకట్టుకొంటుంది.
ఇళయరాజా  అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. సన్నివేశాల్లోని తీవ్రత.. గాఢత చెప్పడంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. దర్శకుడిగా తన గత చిత్రాలకంటే మెరుగైన పనితనమే  కనబరిచారు ప్రకాష్‌రాజ్‌. మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందా లేదా అనేది పక్కన పెడితే, సినిమాపై ఇష్టంతో కూర్చుంటే మాత్రం ఫలితం కనిపిస్తుంది. రోటీన్ సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ఈ సినిమా కొత్త తరహా అనుభవమే.
బలాలు
+  కథా నేపథ్యం
+  ప్రియమణి.. పృథ్వీ
+  నేపథ్య సంగీతం

బలహీనత
-ద్వితీయార్ధంలో సాగతీత

చివరిగా: ‘మన వూరి రామాయణం’.. ఇది మన‘లోని’ రామాయణం

ప్రేమమ్‌ : రివ్యూ

నటీనటులు: నాగచైతన్య.. శ్రుతిహాసన్‌.. అనుపమ పరమేశ్వరన్‌.. మడోనా సెబాస్టియన్‌.. చైతన్యకృష్ణ.. ప్రవీణ్‌.. శ్రీనివాస్‌రెడ్డి.. బ్రహ్మాజీ.. నర్రా శ్రీనివాస్‌.. జీవా.. నాగార్జున - వెంకటేష్‌ (అతిథి పాత్రల్లో).. వైవాహర్ష తదితరులు
కథ: ఆల్ఫోన్స్‌ పుథరెన్‌
సంగీతం: గోపీసుందర్‌, రాజేశ్‌ మురుగేశన్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణం: ఎస్‌.రాధాకృష్ణ, పి.డి.వి.ప్రసాద్‌, ఎస్‌, నాగవంశీ
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల: 7-10-2016

విజయవంతమైన సినిమాని రీమేక్‌ చేస్తున్నప్పుడు చాలా భయాలు వెంటాడుతుంటాయి. మాతృకలోని మేజిక్‌ మన తెరపైకి అలానే తర్జుమా అవుతుందా లేదా? అనే సందేహం దర్శకుల్లో కనిపిస్తుంటుంది. ఇక క్లాసిక్‌ స్థాయి సినిమాని రీమేక్‌ చేస్తున్నప్పుడు ఆ భయాలు రెట్టింపు అవుతుంటాయి. ఆ ఒత్తిడితో తప్పులు చోటు చేసుకుంటుంటాయి. అలాంటి అనుభవాలు మన తెలుగు పరిశ్రమకి చాలానే. అందుకే మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్‌’ రీమేక్‌ అనగానే చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ దర్శకుడు చందు మొండేటి మాతృకని పట్టించుకోకుండా.. దాని తాలూకు విజయం గురించి భయపడకుండా కేవలం అక్కడి ఆత్మని మాత్రమే తీసుకొని స్వేచ్ఛగా రీమేక్‌ చేశారు. నాగచైతన్య కూడా తన కోసమే పుట్టిందీ కథ అన్నట్టుగా ‘ప్రేమమ్‌’లో ఒదిగిపోయాడు. అసలు ‘ప్రేమమ్‌’ కథేమిటి?.. అదెలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: ఇంజినీరింగ్‌ కుర్రాడు విక్రమ్‌ అలియాస్‌ విక్కీ (నాగచైతన్య). అతని టీనేజ్‌ నుంచి అంటే 2000 సంవత్సరం నుంచి ఈ కథ మొదలవుతుంది. మొదట సుమ (అనుపమ పరమేశ్వరన్‌) అనే అమ్మాయిని చూసి మనసు పారేసుకొంటాడు. ప్రేమలేఖ కూడా రాస్తాడు. సుమ మాత్రం తాను మరో అబ్బాయిని ప్రేమించానని.. పెళ్లి చేసుకోబోతున్నానని చెబుతుంది. మళ్లీ 2005లో ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడు లెక్చరర్‌ సితార (శ్రుతిహాసన్‌)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఆమె కూడా విక్కీని ఇష్టపడుతుంది.
ఇక ఆమెతోనే తన జీవితం అనుకున్న విక్కీకి అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఆ తర్వాత వృత్తిలో స్థిరపడ్డాక విక్కీని సింధు (మడోనా సెబాస్టియన్‌) వచ్చి పరిచయం చేసుకొంటుంది. ఆమెతో విక్కీకి ఉన్న సంబంధం ఏంటి? తన జీవితంలోకి వచ్చిన ఈ అమ్మాయినైనా పెళ్లి చేసుకోవాలనుకొన్న విక్కీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చు కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం కాదని చెప్పే కథ ఇది. విక్రమ్‌ అనే ఓ యువకుడి జీవితంలోని పలు దశల్ని ప్రేమ ఎలా ప్రేరేపించింది? ఆ అనుభవాల నుంచి విక్కీ ఏం నేర్చుకొన్నాడు? అనే విషయాలతో చిత్రం సాగుతుంది. తెరపై విక్కీ ప్రేమకథే కాదు.. ప్రతి ఒక్కరి ప్రేమకథ కనిపిస్తుంది. ప్రేమలో గెలవడం.. ఓడిపోవడం కంటే అందులో పడడమే కీలకమైన విషయం అని.. ప్రేమలో గెలిస్తే అమ్మాయి మన పక్కన ఉంటుంది.. ఓడితే ఆ జ్ఞాపకాలు మనతో ఉంటాయని చెప్పే ఓ అందమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. బాల్యాన్ని.. తుంటరి పనుల్ని.. ప్రేమలేఖల రోజుల్ని గుర్తుకు తెప్పిస్తూ విక్రమ్‌- సుమల ఎపిసోడ్‌ సాగుతుంది. ఆ తర్వాత విక్కీ - సితారల మధ్య సన్నివేశాలు అప్పుడప్పుడే సెల్‌ఫోన్‌ పరిచయమైన రోజుల్ని గుర్తుకు తెస్తూ సాగుతాయి. కళాశాలల్లోని గొడవలు.. స్నేహితులతో సరదాల్ని కళ్లముందు మెదిలేలా చేస్తాయి.
విక్కీ- సింధుల కథ నేటి వాతావరణాన్ని కళ్ల కడుతుంది. దర్శకుడు చందు మొండేటి కథని అడాప్ట్‌ చేసుకోవడం.. దాన్ని తన శైలిలో రాసుకొన్న విధానం ఆకట్టుకునేలా ఉంది. మాతృక నుంచి పూర్తిగా బయటికొచ్చి సినిమా చేశారు. అందుకే తెరపై మనదైన వాతావరణం.. మనవైన జీవితాలు కనిపిస్తాయి. వెంకటేష్‌.. నాగార్జునల్ని అతిథి పాత్రల్లో చూపించిన వైనం అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది.
సినిమా ఫక్తు ప్రేమకథే అయినా అభిమానులు ఆశించే మాస్‌ ఎలిమెంట్స్‌కి కూడా కొదవ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. దీంతో అటు సాధారణ ప్రేక్షకులు.. ఇటు అభిమానులు అందరూ ఆస్వాదించేలా సినిమా రూపుదిద్దుకొంది. ప్రేమకథలకి ఫీల్‌ చాలా ముఖ్యం. ఈ సినిమాలో చిన్నపాటి తడబాటు కనిపిస్తుంది. బ్రేకప్‌ అయినప్పుడు వచ్చే సన్నివేశాలు కానీ మరింత శ్రద్ధ తీసుకొని ఉంటే వేలెత్తి చూపించే అవకాశమే ఉండేది కాదన్న అభిప్రాయం కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే?: నాగచైతన్య మొత్తం తానై నటించి నడిపించారు. మూడు ప్రేమకథల్లోనూ చాలా బాగా ఒదిగిపోయాడు. నటుడిగా ఎంతగా రాటుదేలాడో.. సరైన పాత్ర పడితే నాగచైతన్య ఎలా నటించగలడన్నది ఈ సినిమా నిరూపిస్తుంది. మిగిలిన ఇద్దరు కథానాయికలతో పోలిస్తే శ్రుతిహాసన్‌ తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. సితారగా ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్‌ పక్కింటి అమ్మాయిని గుర్తుకు తెస్తుంది. మడోనా సెబాస్టియన్‌ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించింది.
బ్రహ్మాజీ.. నర్రా శ్రీనివాస్‌.. చైతన్యకృష్ణ.. ప్రవీణ్‌.. శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కామెడీ బాగా పండించారు. కథానాయకుడు వెంకటేష్‌ డీసీపీ రామచంద్ర పాత్రలో తళుక్కున మెరిసి అలరించారు. ఆయన పాత్ర ప్రభావం సినిమాపై చివరివరకూ ఉంటుంది. నాగార్జున వాయిస్‌ ఓవర్‌ కూడా సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రహణం.. గోపీసుందర్‌.. రాజేశ్‌ మురుగేశన్‌ సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. చందు మొండేటిలో ఎంత చక్కటి దర్శకుడు ఉన్నాడో.. అంత మంచి రచయిత కూడా ఉన్నాడన్న విషయాన్ని ఈ సినిమా చెప్పేస్తుంది. చాలా చోట్ల పంచ్‌లు బాగా పేలాయి. బలాలు
+ కథ.. కథనం
+ మాటలు
+ నాగచైతన్య
+ సాంకేతికత
బలహీనతలు
- అక్కడక్కడా మిస్‌ అయ్యే ఫీల్‌
చివరగా.. ‘ప్రేమమ్‌’.. మనల్ని మనకు గుర్తు చేస్తుంది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడికి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.