Monday, 30 May 2016


రేపు, ఎల్లుండి సంజీవయ్య పార్కు మూసివేత
హైదరాబాద్‌: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌ నగరంలోని సంజీవయ్య పార్కును మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మున్సిపల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) తెలిపింది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున అతి పెద్ద పతాకం ఆవిష్కరణ దృష్ట్యా పార్కును మూసివేయనున్నారు. రెండు రోజుల పాటు సందర్శకులు, పాదాచారులను పార్కులోనికి అనుమతించబోమని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.

స్మార్ట్‌ఫోన్లపై మహిళలకే మోజెక్కువట!

వారే ఎక్కువగా బానిసలవుతున్నారట 
 సియోల్‌: స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతిఒక్కరి చేతివేళ్లు టచ్‌స్క్రీన్‌పైనే ఉంటున్నాయి. అవసరమున్నా లేకపోయినా.. మనలో చాలా మందికి పదేపదే ఫోన్‌ను చూసుకోవడం అలవాటు. ఇక గంటలు గంటలు ఆన్‌లైన్‌ సర్ఫింగ్‌ చేయడం సరేసరి. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువగా వినియోగిస్తూ.. వాటికి బానిసైన వారిలో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారట. దక్షిణకొరియాలోని అజౌ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ప్రొఫెసర్‌ చాంగ్‌ జే-యియోన్‌ ఆధ్వర్యంలో దక్షిణకొరియాలోని ఆరు కాలేజీలకు చెందిన 1,236 మంది విద్యార్థులతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై సర్వే నిర్వహించారు. దీని ప్రకారం.. 52 శాతం మహిళలు తాము రోజుకు నాలుగు గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పురుషుల్లో ఈ సంఖ్య 29.4శాతంగా ఉంది.
అంతేగాక.. రోజుకు ఆరుగంటలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే మహిళలు 23శాతం ఉన్నారట. అయితే పురుషుల్లో 11 శాతం మాత్రమే 6గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. 37 శాతం మహిళలయితే.. వేరే వారితో మాట్లాడుతున్నా, నడుస్తున్నా పదేపదే ఫోన్‌ చూసుకోవడం అలవాటని చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకపోతే అభద్రతాభావం వెంటాడుతుంటుందని 20శాతం మహిళలు చెప్పినట్లు సర్వేలో తేలింది. కాగా.. పురుషుల్లో ఈ సంఖ్య 8.9 శాతం. చాలా మంది మహిళలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్‌మీడియా కోసమే స్మార్ట్‌ఫోన్‌ను అధికంగా వినియోగిస్తున్నట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో డీజిల్‌ కార్లపై నిషేధం?

డీజిల్‌ కార్ల తయారీదారులకు భారత్‌లో మరో ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. కాలుష్యం అధికంగా ఉన్న మరో 11 నగరాల్లోనూ డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర నగరాల్లో డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే ఇప్పుడు కార్ల తయారీ సంస్థలు డీజిల్‌ కార్ల తయారీపై భారీగా పెట్టుబడులు పెట్టాయని ఇలా భారీ ఎత్తున వాటిపై నిషేధం విధిస్తూ పోతే ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల మొదట్లో ఎన్‌జీటీ కేరళలో డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2000సీసీ ఇంజన్‌ కెపాసిటీ గల వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపేయాలని కోరింది. ప్రజా రవాణాకు ఉపయోగించే వాహనాలను మాత్రం మినహాయించాలని చెప్పింది. దిల్లీలో ఇప్పటికే ఈ వాహనాలపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

వీడు చిన్నోడు కాదు.. పెద్దోడు

ఈ బాలుడు.. ఏడాదికే మగాడయ్యాడు

న్యూఢిల్లీ: పుట్టి ఏడాదైనా కాని బాలుడు పూర్తి మగాడుగా మారాడు. ఆ వయసు పిల్లలకంటే 15 సెంటీమీటర్ల ఎత్తు ఎక్కువగా పెరిగాడు. ముఖంపై గడ్డం , మీసంతో పాటు మర్మాంగాల పెరుగుదలలో తేడా కనిపించింది. ఢిల్లీకి చెందిన పేరెంట్స్  మరో ఆరు నెలలకు దీన్ని గమనించలేకపోయారు. బిడ్డ అసహజ ఎదుగుదలపై ఆందోళన చెందారు. వెంటనే వైద్యులను సంప్రదించడంతో తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది.
 
తమ కుమారుడు ఏడాది వయసులోనే పూర్తి యుక్త వయసు లక్షణాలు కలిగి ఉన్నట్లు వైద్య  పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. ఏడాది వయసు బాలుడికి 25 ఏళ్ళ వ్యక్తి మాదిరిగా టెస్టోస్టెరాన్ లెవల్స్ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అంత చిన్న వయసులో పాతికేళ్ళ వయసు లక్షణాలను ఆ బాలుడు తట్టుకోలేకపోతున్నాడు. లక్ష మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ లెవల్స్ నియంత్రించేందుకు ప్రతి నెలా హార్మన్ ఇంజక్షన్స్ చేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులకు వైద్యులు సూచించారు.

హైద్రాబాద్ ఎలా గెలిచింది... బెంగళూరు ఎందుకు ఓడింది ?

ఐపీఎల్ మహాసంగ్రామం ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానేవచ్చింది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో హైద్రాబాద్ సన్‌రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ వార్నర్ సేన అనూహ్య విజయం సాధించింది.
హైద్రాబాద్ సన్‌రైజర్స్‌లో వార్నర్, ధావన్, యువరాజ్ మినహాయిస్తే పెద్దగా బ్యాట్స్‌మెన్స్ లేరు. బెంగళూరు జట్టులో ఆల్ రౌండర్లు చాలామంది ఉన్నారు. కానీ 208 పరుగులను అందుకోవడంలో విఫలమయ్యారు. గేల్ సూపర్ సిక్స్‌లతో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్ గెలుపుకు కారణాలను విశ్లేషించుకోకపోయినా ఫర్వాలేదు కానీ ఓటమిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఈ  విషయాల్లో విఫలం కావడమే కారణమంటున్నారు క్రీడా విశ్లేషకులు.
1. విఫలమయిన షేన్ వాట్సన్:
బెంగళూరు జట్టులో షేన్ వాట్సన్‌ది ప్రత్యేక స్థానం. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే వాట్సన్ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వాట్సన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి విమర్శల పాలవుతున్నాడు. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ బెన్ కటింగ్ వాట్సన్ వేసిన ఒక్క ఓవర్లో 3 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టి స్కోర్ బోర్డ్‌ను 200 వైపు పరిగెత్తించాడు. బ్యాటింగ్‌లో కూడా వాట్సన్ నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వాట్సన్ 11 రన్స్ చేసి ఔటయ్యాడు.

2. బౌలింగ్ కూడా అంతంత మాత్రమే:
సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయడంలో ఆర్‌సీబీ బౌలర్లు విఫలమయ్యారనే చెప్పాలి. లెగ్ స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్‌లో మాత్రం తన మాయాజాలాన్ని చూపించలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ తీశాడు. 35 పరుగులు ఇచ్చి భారీగానే మూల్యాన్ని చెల్లించుకున్నాడు. జోర్డాన్ 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. 3 కీలక వికెట్లు తీసినప్పటికీ పరుగులు కట్టడి చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. పైగా ఆరు వైడ్‌లతో ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చాడు.
3. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్:
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు కోహ్లీ, గేల్ శుభారంభాన్ని ఇచ్చారు. గేల్ సిక్స్‌లతో చితక్కొట్టి 76 పరుగులు చేసి పటిష్ట పునాది వేసి ఔటయ్యాడు. గేల్ తర్వాత వచ్చిన డివిలియర్స్ ఫ్యాన్స్ ఆశలను తలకిందులు చేశాడు. 5 పరుగులకే ఔటయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్ 11 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆల్ రౌండర్‌ను కోల్పోయి ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన లోకేష్ రాహుల్, సచిన్ బేబీ, స్టార్ట్ బిన్నీ కూడా చేతులెత్తేయడంతో బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది.
4. కొంపముంచిన అతివిశ్వాసం:
బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. విరాట్ కోహ్లీ, గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో ఉన్న చాహల్, షేన్ వాట్సన్ ఉండనే ఉన్నారు. దీంతో దాదాపు అందరూ ఐపీఎల్ కప్ కొట్టేది ఆర్‌సీబీయేనని భావించారు. అయితే ఈ అతినమ్మకమే బెంగళూరు కొంప ముంచింది. బెంగళూరు వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ మ్యాచ్ మొదలవక ముందు ఓ ప్రశ్నకు సమాధానంగా ‘మేము ఆల్‌రెడీ మ్యాచ్ గెలిచేశామని’ చెప్పాడు. ఆర్‌సీబీ ఆటగాళ్లంతా ఈ మనస్తత్వంతోనే బరిలోకి దిగారు. చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

హైదరాబాద్‌షా

ఐపీఎల్‌ ఛాంప్‌ సన్‌రైజర్స్‌
అదరగొట్టిన వార్నర్‌
కటింగ్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులు
గేల్‌ చెలరేగినా బెంగళూరుకు భంగపాటు
బెంగళూరు

ద్విశతక లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఏమీ.. గేల్‌ బాదేస్తుంటే.. ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టిస్తుంటే.. ఆశలు అడుగంటిపోతున్నాయన్న వేదన. సిక్సర్ల మోత మోగుతుంటే.. పరుగుల వరద పారుతుంటే.. కల చెదురుతున్న భావన. లక్ష్యం తరిగిపోతుంటే కప్పు చేజారినట్లేనన్న ఆందోళన. కానీ సన్‌రైజర్స్‌ పట్టుదలతో నిలిచింది. తన బౌలర్లపై కెప్టెన్‌ వార్నర్‌ పెట్టుకున్న నమ్మకం గెలిచింది. ఓటమి తప్పదనుకున్న స్థితి నుంచి అద్భుత పోరాటంతో పుంజుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ సరికొత్త ఛాంపియన్‌గా అవతరించింది. మూడోసారి ఫైనల్లో ఓడిన బెంగళూరు నిరాశతో నిష్క్రమించింది. వార్నర్‌ తన బ్యాటింగ్‌, కెప్టెన్సీతో హైదరాబాద్‌ అద్భుత విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు.
ప్రతికూల పరిస్థితుల్లో గొప్పగా పోరాడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌-9 విజేతగా నిలిచింది. కెప్టెన్‌ వార్నర్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లు రాణించిన వేళ ఆదివారం రసవత్తరంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్‌ 8 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును మట్టికరిపించింది. వార్నర్‌ (69; 38 బంతుల్లో 8×4, 3×6), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ కటింగ్‌ (39 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4, 4×6; 2/35), యువరాజ్‌ సింగ్‌ (38; 23 బంతుల్లో 4×4, 2×6) మెరవడంతో మొదట సన్‌రైజర్స్‌ 7 వికెట్లకు 208 పరుగులు సాధించింది. భువనేశ్వర్‌ (0/25), ముస్తాఫిజుర్‌ (1/37), కటింగ్‌ (2/35) రాణించడంతో ఛేదనలో బెంగళూరును 200 (7 వికెట్లకు) కట్టడి చేసింది. గేల్‌ (76; 38 బంతుల్లో 4×4, 8×6), కోహ్లి (54; 35 బంతుల్లో 5×4, 2×6) మెరుపులతో ఛేదనలో 10.2 ఓవర్లలో 114/0తో నిలవడంతో బెంగళూరు గెలుపు ఖాయమనుకున్నారంతా. కానీ సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో ఆ జట్టును కట్టడి చేశారు. ‘బౌలింగే మా బలం’ అంటూ.. అంచనాలకు భిన్నంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కెప్టెన్‌ వార్నర్‌ నమ్మకాన్ని నిలబెట్టారు. గేలా.. సుడిగాలా!: అసలే భారీ లక్ష్యం. ఆపై టోర్నీలో అత్యంత విజయవంతమైన సన్‌రైజర్స్‌ బౌలింగ్‌. బెంగళూరు ముందున్నది క్లిష్టమైన సవాలే. కానీ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగిన గేల్‌ విధ్వంసక విన్యాసాలతో బెంగళూరును వడివడిగా లక్ష్యంగా దిశగా నడిపించాడు. సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వరద పారించాడు. కళ్లు చెదిరే షాట్లు ఆడిన గేల్‌.. కేవలం 25 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడు హెన్రిక్స్‌ వేసిన 9వ ఓవర్లో వరుసగా 6, 6, 4 బాదడంతో బెంగళూరు స్కోరు 100కు చేరుకుంది. అప్పటిదాకా గేల్‌కు సహకరిస్తూ వచ్చిన కోహ్లి కూడా జోరందుకున్నాడు. ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. కటింగ్‌ ఓవర్లో గేల్‌ నిష్క్రమించడంతో 114 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడ్డా కోహ్లి చక్కగా ఆడడంతో బెంగళూరు 140/1 సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ సన్‌రైజర్స్‌.. 8 పరుగుల వ్యవధిలో ప్రమాదకర కోహ్లి, డివిలియర్స్‌ (5)లను ఔట్‌ చేసి పోటీలోకి వచ్చేసింది. కోహ్లిని శరణ్‌ బౌల్డ్‌ చేయగా.. బిపుల్‌ శర్మ బౌలింగ్‌లో ఏబీ.. హెన్రిక్స్‌కు దొరికిపోయాడు. రాహుల్‌ (11) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అతణ్ని కటింగ్‌ బౌల్డ్‌ చేశాడు. బెంగళూరు క్రమంగా ఒత్తిడిలోకి కూరుకుపోయింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సాధించాల్సిన రన్‌రేట్‌ను పెంచుతూ సన్‌రైజర్స్‌ పట్టుబిగించింది. వార్నర్‌ చివరి నాలుగు ఓవర్లను తన ప్రధాన అస్త్రాలైన భువనేశ్వర్‌, ముస్తాఫిజుర్‌ల కోసం అట్టిపెట్టడంతో బెంగళూరు పని ఇంకా కష్టమైపోయింది. 17వ ఓవర్లో వాట్సన్‌ను ఔట్‌ చేయడం ద్వారా మ్యాచ్‌ను ముస్తాఫిజుర్‌ పూర్తిగా సన్‌రైజర్స్‌ వైపు తిప్పాడు. అతడితోపాటు భువనేశ్వర్‌ అద్భుత బౌలింగ్‌ను కొనసాగించడంతో కిందివరుస బ్యాట్స్‌మెన్‌కు సంచలనం సృష్టించే అవకాశం లేకపోయింది.
వార్నర్‌.. అదే జోరు: టోర్నీ ఆరంభం నుంచి సన్‌రైజర్స్‌ను ముందుండి నడిపించిన వార్నర్‌.. ఫైనల్లోనూ అలాగే ఆడాడు. మరో సూపర్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్‌తో కలిసి వార్నర్‌ చెలరేగిపోవడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికే సన్‌రైజర్స్‌ 59/0తో పటిష్టంగా నిలిచింది. ధావన్‌ (28; 25 బంతుల్లో 3×4, 1×6) కూడా చక్కని బౌండరీలు సాధించాడు. ఏడో ఓవర్లో ధావన్‌ ఔటైనా వార్నర్‌ జోరు కొనసాగించాడు. 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 97/2. హెన్రిక్స్‌ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ కూడా కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. యువీ చకచకా నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల బాదడంతో 16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 147/4తో ఉంది. అప్పటికి అరవింద్‌ వేసిన వేరు వేరు ఓవర్లలో వార్నర్‌, హుడా ఔటయ్యారు.
వారెవ్వా కటింగ్‌: నిజానికి సన్‌రైజర్స్‌ 200 దాటడమనేది ఎవరి అంచనాలకు అందని విషయం. ఎందుకంటే జోరు మీదున్న యువరాజ్‌ 17వ ఓవర్లోనే వెనుదిరిగాడు. నమన్‌ ఓజా కూడా వెంటనే ఔటయ్యాడు. కానీ బెన్‌ కటింగ్‌ విధ్వంసక విన్యాసాలతో విరుచుకుపడ్డాడు. చివరి మూడు ఓవర్లలో ఆ జట్టు 52 పరుగులు పిండుకుంది. చివరి ఓవర్లో కటింగ్‌ విశ్వరూపాన్నే చూపించాడు. ఏకంగా మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాదేశాడు. వాట్సన్‌ ఫుల్‌టాస్‌కు అతడు కొట్టిన ఓ భారీ సిక్సైతే 117 మీటర్లు ప్రయాణించి స్టేడియం దాటింది.

ప్రైజ్‌మనీ: విజేతకు రూ.15 కోట్లు
రన్నరప్‌కు రూ.10 కోట్లు
ఫెయిర్‌ప్లే అవార్డు - సన్‌రైజర్స్‌
వర్థమాన ఆటగాడు - ముస్తాఫిజుర్‌
ఉత్తమ ఫీల్డర్‌ - డివిలియర్స్‌ (19 క్యాచ్‌లు)
ఉత్తమ క్యాచ్‌ - రైనా
విలువైన ఆటగాడు - కోహ్లి
అత్యధిక సిక్సర్లు - కోహ్లి (38)

హైదరాబాద్‌కు రెండో కప్పు
పీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఐతే హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఇది రెండో కప్పు. 2009లో గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలో డెక్కన్‌ ఛార్జర్స్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. 2009లో కూడా హైదరాబాద్‌ జట్టు.. బెంగళూరుపైనే గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్‌ జట్టు కప్పు సొంతం చేసుకుంది.

అయ్యో బెంగళూరు
ఫైనల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఇది మూడో ఓటమి. 2009, 2011లో కూడా ఆ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐతే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్‌ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయింది.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇక్బాల్‌ అబ్దుల్లా (బి) అరవింద్‌ 69; ధావన్‌ (సి) జోర్డాన్‌ (బి) చాహల్‌ 28; హెన్రిక్స్‌ (సి) చాహల్‌ (బి) జోర్డాన్‌ 4; యువరాజ్‌ (సి) వాట్సన్‌ (బి) జోర్డాన్‌ 38; హుడా (సి) కోహ్లి (బి) అరవింద్‌ 3; కటింగ్‌ నాటౌట్‌ 39; నమన్‌ ఓజా రనౌట్‌ 7; బిపుల్‌ శర్మ (సి) చాహల్‌ (బి) జోర్డాన్‌ 5; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208;
వికెట్ల పతనం: 1-63, 2-97, 3-125, 4-147, 5-148, 6-158, 7-174; బౌలింగ్‌: అరవింద్‌ 4-0-30-2; గేల్‌ 3-0-24-0; వాట్సన్‌ 4-0-61-0; చాహల్‌ 4-0-35-1; ఇక్బాల్‌ అబ్దుల్లా 1-0-10-0; జోర్డాన్‌ 4-0-45-3 బెంగళూరు ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) బిపుల్‌శర్మ (బి) కటింగ్‌ 76; కోహ్లి (బి) శరణ్‌ 54; డివిలియర్స్‌ (సి) హెన్రిక్స్‌ (బి) బిపుల్‌శర్మ 5; కేఎల్‌ రాహుల్‌ (బి) కటింగ్‌ 11; వాట్సన్‌ (సి) హెన్రిక్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 11; సచిన్‌ బేబి నాటౌట్‌ 18; బిన్నీ రనౌట్‌ 9; జోర్డాన్‌ రనౌట్‌ 3; ఇక్బాల్‌ అబ్దుల్లా నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200;

వికెట్ల పతనం: 1-114, 2-140, 3-148, 4-160, 5-164, 6-180, 7-194; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-25-0; శరణ్‌ 3-0-41-1; కటింగ్‌ 4-0-35-2; ముస్తాఫిజుర్‌ 4-0-37-1; హెన్రిక్స్‌ 3-0-40-0; బిపుల్‌ 2-0-17-1

ఐపీఎల్‌-9 విజేత హైదరాబాద్‌

చివరి వరకూ పోరాడి గెలిచిన సన్‌రైజర్స్‌
క్రిస్‌గేల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ వృథా..
ఒత్తిడిలో తేలిపోయిన బెంగళూరు

    ఐపిఎల్ 2016 విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. 8 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టును ఓడించింది. 209 పరుగుల టార్గెట్‌ను ఛేదించకుండా బెంగుళూరు జట్టును కట్టడి చేసింది. 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి ఓవర్ వేశాడు భువనేశ్వర్. కెప్టెన్ వార్నర్ భూవీతో పలుమార్లు మంతనాలు జరిపాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ బెంగుళూరు టెయిలెండర్స్‌ను కట్టడి చేయగలిగాడు. 20వ ఓవర్ మూడో బంతికి భూవీ వేసిన చక్కని బంతిని కీపర్ అందుకుని రనౌట్ చేశాడు. ఆ సమయానికి 3 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒత్తిడిలో ఉన్న బెంగళూరు ఆటగాళ్లు చేతెలెత్తేశారు. 
     ఐపిఎల్ చరిత్రలో మొదటిసారిగా కప్‌ను అందుకుంది సన్‌రైజర్స్ టీం.
జట్టు స్కోర్లు : సన్‌రైజర్స్ హైదరాబాద్ 208/7(20 ఓవర్లలో), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 200/7 (20 ఓవర్లలో) 
 
హైదరాబాద్ బ్యాటింగ్ : వార్నర్ 69, బెన్ కటింగ్ 39, యువరాజ్ 38, ధావన్ 28
బెంగళూరు బ్యాటింగ్ : గేల్ 76, కోహ్లీ 54, డెవిలియర్స్ 5, వాట్సన్ 11, సచిన్ బాబీ 18.

Sunday, 29 May 2016

ఐపిఎల్ విజేతగా సన్‌రైజర్స్ దాదాపు ఖాయమే..!

         ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు జట్టు నుంచి హైదరాబాద్ వైపుకు మళ్లింది. జట్టులో వరల్డ్ క్లాస్ ఆటగాళ్లైన కోహ్లీ, గేల్, డెవిలియర్స్, వాట్సన్‌లు ఔట్ కావడంతో సన్‌రైజర్స్ జట్టులో విజయంపై ఆశలు చిగురించాయి. ప్రస్తుతం 17 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసిన కోహ్లీ సేన మరో 18 బంతుల్లో 37 పరుగులు చేయాలి. అయితే ఆడుతున్నాది టెయిలెండర్స్ కావడంతో గెలుపు కష్టమే. కానీ చివరి బంతి వరకు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే.

కోహ్లీ బౌల్డ్..వరల్డ్ రికార్డ్ మిస్..

బెంగళూరు: ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 54 పరుగుల వద్ద ఔటయ్యాడు. బరిందర్ బౌలింగ్‌లో బైల్డ్ అయ్యాడు. 35 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. అయితే ఈ క్రమంలో అద్భుతమైన రికార్డు మిస్ అయ్యాడు కెప్టెన్ కోహ్లీ. ఒకే టీ20 టోర్నమెంట్‌లో ఇంతవరకూ ఎవరూ చేయలేని 1000 పరుగులు రికార్డుకు 27 పరుగుల దూరంలో వదిలేశాడు. మొత్తం 973 పరుగలతో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోహ్లీ రియల్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్.

కోహ్లీ అర్ధశాతకాల వరల్డ్ రికార్డు..

      ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ అదే క్రమంలో అర్ధశతకాల రికార్డును నమోదు చేశాడు. ఈ ఐపిఎల్‌లో మొత్తం 28 మ్యాచ్‌లాడిన కోహ్లీ 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఒకే ఏడిదిలో అత్యధిక అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అది కూడా ఒకే టోర్నమెంట్‌లో సాధించాడు. కోహ్లీ తర్వాత 2012లో క్రిస్ గేల్ 16 అర్ధశతకాలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గేల్ 38 ఇన్నింగ్స్‌లలో వాటిని సాధించాడు.

హైదరాబాద్‌పై బెంగళూరు లక్ష్యం 209

అర్ధశతకం బాదిన వార్నర్‌
మెరిసిన యువరాజ్‌, బెన్‌ కటింగ్‌
తేలిపోయిన బెంగళూరు బౌలర్లు
బెంగళూరు: ఐపీఎల్‌-9లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (69: 38 బంతుల్లో 8×4, 3×6) మరోసారి మెరుపు అర్ధశతకం బాదేయగా.. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (28: 25 బంతుల్లో 3×4, 1×6) చక్కటి సహకారం అందించడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేయగలిగింది. ప్రమాదకరంగా మారిన ఈ ఓపెనింగ్‌ జోడిని ధావన్‌ను ఔట్‌ చేయడం ద్వారా స్పిన్నర్‌ చాహల్‌ విడదీశాడు. దీంతో 63 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే ధావన్‌ ఔట్‌ అనంతరం వచ్చిన హెన్రిక్స్‌ (4) తడబడినా వార్నర్‌ మాత్రం ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ షాట్లు బాదేశాడు. అతనికి హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (38: 23 బంతుల్లో 4×4, 2×6) కూడా తోడవడంతో హైదరాబాద్‌ స్కోరు బోర్డు పరుగులెత్తింది. కానీ జట్టు స్కోరు 125 వద్ద కెప్టెన్‌ వార్నర్‌ ఔటవగా.. తర్వాత వచ్చిన దీపక్‌ హుడా (3), నమన్‌ ఓజా (7), బిపుల్‌ శర్మ (5) నిరాశపరచడంతో సన్‌రైజర్స్‌ తడబడినట్లు కనిపించింది. అయితే ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన వాట్సన్‌ బౌలింగ్‌లో బెన్‌ కటింగ్‌ (39 నాటౌట్‌: 15 బంతుల్లో 3×4, 4×6) వరుస బౌండరీలు బాదేయడంతో హైదరాబాద్‌ 208 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్‌ జోర్దాన్‌ 3, శ్రీనాథ్‌ అరవింద్‌ 2, చాహల్‌ ఒక వికెట్‌ తీశారు.


హైద్రాబాద్ సన్‌రైజర్స్‌కు షాక్ !

హైద్రాబాద్ సన్‌రైజర్స్‌కు కొండంత అండగా నిలుస్తున్న బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో 38 బంతుల్లో 69 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ దూకుడుకు శ్రీనాథ్ అరవింద్ అడ్డుకట్ట వేశాడు. శ్రీనాథ్ అరవింద్ బౌలింగ్‌లో స్టైట్ షాట్‌‌కు యత్నించిన వార్నర్ అబ్దుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో హైద్రాబాద్ సన్‌రైజర్స్‌కు గట్టి దెబ్బ తగిలినట్టయింది.

కోహ్లీ తనపైకి బంతి విసరడంతో షాకైన వార్నర్.. ఆ తర్వాత ఏమైందో తెలుసా?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడుతున్నాడు. తాను కొట్టిన బంతిని దూరంగా ఉండి ఫీల్డింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టుకున్నాడు. ఆ వెంటనే బంతిని బలంగా విసిరాడు. అయితే అది అనుకోకుండా వార్నర్‌కు కొంచెం ఎత్తులో పోయింది. అయితే ఆ బంతి తనకు తగులుతుందేమో అని వార్నర్ పూర్తిగా కిందకు వంగిపోయాడు. ఆ తర్వాత పడిపోయాడు. కోహ్లీ అకస్మాత్తుగా తనపైకి బంతి విసరడంతో తనకు తగులుతుందేమో అని వార్నర్ భయపడ్డాడు. ఆ తర్వాత వెంటనే కోలుకున్నాడు. అంతగా భయపడిపోయావేంటన్నట్లుగా కోహ్లీ సారీ చెబుతున్నట్లుగా చేయి చూపించాడు. ఆ తర్వాత చిన్న చిరునవ్వు నవ్వాడు. దీంతో వార్నర్ కూడా నవ్వేశాడు.

IPL 2016, Final - RCB vs SRH

మ్యాచ్‌కు ముందే శుభవార్త చెప్పిన సన్‌రైజర్స్ కెప్టెన్..

సన్‌రైజర్స్ జట్టు గెలుపుకు ఛాన్స్ ఉన్న పెద్ద వార్త..
 
బెంగుళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపిఎల్ తుది పోరు మొదలైంది. టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే సన్‌రైజర్స్ ముఖ్య బౌలర్ ముస్తఫిజర్ రెహ్మాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ బంగ్లాదేశీ బౌలర్ పొట్టి క్రికెట్‌లో ఉత్తమ బైలర్‌గా చెలరేగుతున్నాడు. గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ముస్తఫిజర్‌ను వార్నర్ పట్టుబట్టి మరీ జట్టులోకి తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే బౌలింగే హైదరాబాద్ జట్టుకు బలం. నెహ్రా కాలికి ఆపరేషన్ కారణంగా మ్యాచ్‌కు దూరం కాగా, ముస్తఫిజర్ కూడా అందుబాటులో ఉండడేమో అనుకుంటున్న తరుణంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు కెప్టెన్ వార్నర్.

నేచురల్ కాల్ కోసం టాయ్‌లెట్‌కు వెళ్లాడు... లోపల కనిపించిన దాన్ని చూసి...

    బ్యాంకాక్: నేచురల్ కాల్ కోసం టాయ్‌లెట్‌కు వెళ్లిన వ్యక్తి బాత్రూమ్‌లో కనిపించిన దాన్ని చూసి కంగు తిన్నాడు. బ్యాంకాక్‌లోని ఛాకొన్గ్‌సయో ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాత్రూమ్‌కని టాయ్‌లెట్‌కు వెళ్లిన బూన్‌కు టాయ్‌లెట్ పైప్‌లో 10 అడుగుల పైతాన్ కనిపించింది. దీంతో వెంటనే బాత్రూమ్ నుంచి బయటికొచ్చాడు. ఇరుగుపొరుగు వారు... భార్య సహాయంతో దాన్ని ఎట్టకేలకు చంపేసి బయటకు తీశాడు. అయితే ఈ క్రమంలో ఆ పాము బూన్‌ను కాటేసింది. ప్రస్తుతం బూన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

ఫైనల్‌ సవాల్‌లో గెలిచేదెవరు..?

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ప్రత్యర్థి ఎవరైనా ఈ కెప్టెన్ల కళ్లలో ఇసుమంతైనా బెరుకు కనిపించదు.. జట్టును ముందుండి నడిపించాలనే కసి తప్ప. ఒకరు క్లాస్‌ బ్యాటింగ్‌తో ఫీల్డర్ల మధ్యలోంచి చాకచక్యంగా బంతిని బౌండరీకి తరలించగల నేర్పరి. మరొకరు విధ్వంసక బ్యాటింగ్‌తో అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపేయగల హిట్టర్‌. భిన్న ధ్రువాలుగా కనిపించే ఈ ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రస్తుతం ఒక్కటే.. తాజా ఐపీఎల్‌లో తమ జట్టును విజేతగా నిలపడం. కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌, వాట్సన్‌ తదితర హిట్టర్లతో తుదిపోరుకు కాలు దువ్వుతుండగా.. డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌, హెన్రిక్స్‌లతో బెంగళూరును ఢీకొట్టబోతోంది. పరుగుల వరద పారే చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో ఈ పోరుపై అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా తొమ్మిదేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఓ కొత్త విజేత అవతరించినట్లే..!
పరుగుల యంత్రంలా ‘కోహ్లీ’ సేన
తాజా ఐపీఎల్‌ ఆరంభం వరకూ విరాట్‌ కోహ్లీకి టీ20 శతకం అందని ద్రాక్షగా ఉండేది. కానీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లాడిన కోహ్లీ ఏకంగా నాలుగు శతకాలు, ఆరు అర్ధశతకాలు బాది మొత్తం 919 పరుగులతో టోర్నీలోనే టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ విధ్వంసంతోనే ప్లేఆఫ్‌ ఆశలు లేని దశ నుంచి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా ఫైనల్‌కు చేరింది. అతనితో పాటు జట్టులో క్రిస్‌గేల్‌, ఏబీ డివిలియర్స్‌, షేన్‌ వాట్సన్‌ లాంటి అనుభవజ్ఞులైన హిట్టర్లుండటం బెంగళూరుకు కలిసొచ్చే అంశం. కేఎల్‌ రాహుల్‌, సచిన్‌ బేబీ మధ్య ఓవర్లలో విలువైన ఇన్నింగ్స్‌ ఆడగలమని ఇప్పటికే నిరూపించుకున్నారు. బౌలింగ్‌లో క్రిస్‌ జోర్దాన్‌, వాట్సన్‌, చాహల్‌, అబ్దుల్లా, స్టువర్ట్‌ బిన్నీ సత్తా చాటుతున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియం అంటేనే భారీ స్కోర్లతో విరుచుకుపడే కోహ్లీ సేనను హైదరాబాద్‌ బౌలర్లు నిలువరించడంపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.
బ్యాటింగ్‌లో ‘వార్నర్‌’.. బౌలింగ్‌లో అందరూ
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ బలం, బలహీనత కెప్టెన్‌ డేవిడ్‌ వార్నరే అనడంలో అతిశయోక్తి కాదు! వార్నర్‌ ముందుండి నడిపించగలిగితే హైదరాబాద్‌ తిరుగులేని విజయాలను అందుకోగలదని ఇప్పటికే నిరూపితమైంది. 16 మ్యాచ్‌లాడిన వార్నర్‌ 779 పరుగులతో విరాట్‌ కోహ్లీ తర్వాత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. అతనికి తోడు శిఖర్‌ ధావన్‌, యువరాజ్‌ సింగ్‌, హెన్రిక్స్‌, దీపక్‌ హుడా, బిపుల్‌ శర్మ బ్యాట్‌ ఝళిపించగలిగితే హైదరాబాద్‌ అలవోకగా భారీ స్కోరు సాధించగలదు. కానీ వార్నర్‌ తొందరగా పెవిలియన్‌ చేరితే టాప్‌ ఆర్డర్‌ ఒత్తిడిలో పడే బలహీనతను ఫైనల్లోనైనా హైదరాబాద్‌ అధిగమించాల్సి ఉంది. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉందనే చెప్పవచ్చు. ముస్తాఫిజుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, బరీందర్‌ శరణ్‌, బెన్‌ కటింగ్‌, హెన్రిక్స్‌తో పేస్‌ దళం అద్భుతంగా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ అనూహ్య విజయాలను అందుకుంటోంది. కోహ్లీ వదలడు.. ఇప్పుడు వార్నర్‌ కూడా
మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా క్రీజులో కుదురుకుంటే జట్టుకు విజయం అందించే వరకూ పట్టువదలని తత్వం విరాట్‌ కోహ్లీది. ప్రస్తుతం వార్నర్‌ కూడా ఇలాంటి స్థితికే చేరుకున్నాడు. గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో వార్నర్‌ చివరి వరకూ పోరాట పటిమతో జట్టును గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. దీంతో కెప్టెన్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసక పోరు తప్పదనే సంకేతాలు కన్పిస్తున్నాయి. బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌, వ్యూహాలు రచించడంలో ఇప్పటికే ఇద్దరూ ఆరితేరిపోవడంతో ఎవరిపై ఎవరు పైచేయి సాధించి విజేతగా నిలుస్తారో చూడాల్సి ఉంది!

ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్ నిలిచిపోయే అవకాశం ?

   ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణ గండం తప్పేలా లేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు, హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు మధ్య ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. బెంగళూరు చినస్వామి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై వరుణుడి ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బెంగళూరు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వర్షం తీవ్రత తగ్గకుంటే మ్యాచ్‌ను వాయిదా వేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా జరగాలని ఐపీఎల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పంట అరకొర... కూర కొరకొర




తెలంగాణలో కరవు ప్రభావంతో పంటల సాగు తగ్గి కూరగాయల కొరతతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. చిల్లర మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ మంటతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఏకంగా పచ్చిమిరప కిలో రూ.100కు పైగా చిల్లర మార్కెట్‌లో అమ్ముతున్నారు. రైతుబజార్లలోనే వీటి ధర రూ.83 ఉంది. ఇక్కడ ధర తక్కువున్నా నాణ్యత ఉండటం లేదు. ఎండల తీవ్రత కారణంగా పంటల దిగుబడులు బాగా పడిపోయాయి. వ్యాపారం లేక రైతులు.. కూరగాయలు కొనలేక ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు.
రాష్ట్రంలో కూరగాయలు కొనేందుకు సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఒకపక్క పంట పండక ధరలు ఆకాశానంటుతుండటంతో కొనుగోలుకు ఇబ్బందులు తప్పడం లేదు. పండిన పంట పూర్తి నాణ్యత ఉండటం లేదు. బాగున్నవాటిని పెద్ద పెద్ద మాల్స్‌, దుకాణాల వారు కొనేస్తున్నారు. రైతుబజార్లకు ద్వితీయ శ్రేణి రకాలే వస్తున్నట్లు రైతులే చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నగరాలతో పాటు ఇతర పట్టణాలకు రైతులు కూరగాయలు తీసుకురావడం తగ్గిపోయింది. చిల్లర మార్కెట్లలో ఎంత అమ్ముతున్నారనే దానిపై అధికారికంగా లెక్కలు లేవు. కానీ రైతుబజార్లు, టోకు మార్కెట్లకు వచ్చిన వాటినే చిల్లర వ్యాపారులు కొని తీసుకెళ్లి మారుబేరానికి అమ్ముతున్నారు. రాష్ట్రం మొత్తం మార్కెట్లకు వచ్చిన వాటి గణాంకాలను చూస్తే కూరగాయల ధరలెందుకు విపరీతంగా పెరగుతున్నాయన్నది అర్థమవుతుంది. 2013 మే నెలలో తెలంగాణ రైతుబజార్లు, మార్కెట్లకు మొత్తం 3.59 లక్షల క్వింటాళ్ల కూరగాయలు వస్తే ఈ నెలలో 3.04 లక్షల క్వింటాళ్లకు తగ్గిపోయాయని మార్కెటింగ్‌ శాఖ వర్గాలే చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ జిల్లాలకు కూరగాయలు వస్తున్నందునే కొంత కొరత తీరుతోంది. పూర్తిగా తెలంగాణ రైతులపైనే ఆధారపడితే ఇందులో సగం కూడా రావని మార్కెటింగ్‌ శాఖ అధికారి ఒకరు వివరించారు.
* ధరలు పెరిగిన కూరగాయల రాకలో అంతరం కనిపిస్తోంది. టమాటాల ధర రెండు నెలల్లోనే రూ.5 నుంచి 50 రూపాయలకు పెరిగింది. 2013 మే నెలలో తెలంగాణ మార్కెట్లకు 28,241 క్వింటాళ్లు వస్తే ఈ ఏడాది ఇదే నెలలో కేవలం 9,286 క్వింటాళ్లే వచ్చాయి.
* బెండకాయలు గత నెలలో 39,506 క్వింటాళ్లొస్తే...ఈ నెల 6,641 క్వింటాళ్లే వచ్చాయి. ఇంత భారీ తగ్గుదల కారణంగా వీటి ధర రెట్టింపైంది.
* ఇక్కడ చుట్టుపక్కల పండే కూరగాయల రాకతో పోలిస్తే దూర ప్రాంతం నుంచి ఏడాది పొడవునా వచ్చేవాటిలోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. టమాటాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి తెలంగాణకు వస్తుంటాయి. గత మార్చిలో 17,217 క్వింటాళ్లు రాగా ఈ నెల 9,286 క్వింటాళ్లకు తగ్గాయి. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఏడాది పొడవునా తెలంగాణకు వచ్చే ఆలుగడ్డలు గత నెలలో 13,563 క్వింటాళొæ్ల®్త ఈ నెల 14,025 క్వింటాళ్లకు పెరిగాయి.
ముందుచూపు లేకనే కొరత తీవ్రం
కూరగాయల పంటల సాగు పెంచి కొరత ఏర్పడకుండా చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు అల్లాడుతున్నారు. గత మార్చి నుంచి కూరగాయల రాక క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాది జూన్‌ నుంచి వర్షపాతం బాగా తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్లు పనిచేస్తున్న రైతులను గ్రామాల వారీగా గుర్తించి వారికి రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చి అప్రమత్తం చేసి కూరగాయ పంటలు సాగు చేయిస్తే ఇప్పుడు మార్కెట్‌లో కొరత ఉండేది కాదు. కానీ రాయితీ విత్తనాలకు కనీసం నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. కనీసం ఖరీఫ్‌లోనైనా పంటలు సాగు చేయించేందుకు విత్తనాల పంపిణీ ఇంతవరకూ ప్రారంభించలేదు. ప్రస్తుత వేసవిలో తెలంగాణలో సాధారణంగా 50 వేల ఎకరాల్లో కూరగాయల పంటలుండాలి. కానీ 25 వేల ఎకరాల్లో కూడా లేవని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాల్లో వేయాలి. కానీ విత్తనాలే లేక రైతులు ఎదురుచూస్తున్నారు.


300 గ్రాములు తినాలి
నిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు తప్పనిసరిగా 300 గ్రాముల వరకూ తాజా కూరగాయలు తప్పనిసరిగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ) సూచించింది. భారతీయులు అన్నం ఎక్కువ ఉంచి, కూర తక్కువ కలిపి తింటారు. కానీ అన్నం, కూర దాదాపు సమాన నిష్పత్తిలో తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో రోజూ కనీసం కిలోకు తగ్గకుండా కూరలు తినాలి. ఇప్పుడు కిలో తాజా కూరగాయలతో తినాలంటే కనీసం రూ.40 నుంచి 50 దాకా ఖర్చవుతుంది.

హోటల్‌ వంటకాల్లోనూ మార్పులు
హోటళ్లలో వండే కూరగాయలలోనూ మార్పులొచ్చాయి. ధరల మంట కారణంగా టమాటా, బీన్స్‌, బెండ వాటిని తగ్గించి సులభంగా లభించే ఆలుగడ్డ, దోస, సొర వంటి వాటిని ఎక్కువకు కొని వండుతున్నట్లు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భోజన హోటల్‌ వ్యాపారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిన వాటిని వండి వడ్డిస్తే తమకు నష్టం వస్తుందని, కాబట్టి అధిక ధరలుండే వాటిని వండటం లేదని తెలిపారు. ఇంతకుముందు రోజూ తమ హోటల్‌లో 15 కిలోల దాకా టమాటాలతో వంటలు చేసేవారమని ఇప్పుడు ఐదారు కిలోలు వాడటం లేదని వివరించారు. రైతుబజార్లలో, మార్కెట్లలో ప్రజల కొనుగోలు తీరులోనూ మార్పు వచ్చింది. గతంలో కిలోల కొంటే, ఇప్పుడు అర, పావుకిలోతో సరిపెడుతున్నామని సరూర్‌నగర్‌ రైతుబజారుకు కూరగాయలు కొనడానికి వచ్చిన గృహిణి సంధ్యారాణి ‘ఈనాడు’తో చెప్పారు.

ఇంటి పంట...సరైన పరిష్కారం
కూరగాయల ధరల మంటను సులభంగా ఎదుర్కోవడానికి ప్రతి ఇంటికి మంచి అవకాశముంది. ఇంటి ఆవరణలో లేదా భవనంపై 100 చదరపు అడుగుత స్థలముంటే ఒక కుటుంబానికి అవసరమైన కూరగాయలు ఏడాది పొడవునా పండించుకోవచ్చు. పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఉద్యానశాఖ కార్యాలయం అధికారులు ఈ ఇంటి పంట పథకం అమలుకు ఒక్కో కుటుంబానికి రూ.3 వేల వరకూ రాయితీలిస్తున్నారు. విత్తనాలు, కుండీలు, ఎరువు వంటివి సమకూర్చుకోవడానికి సహకారం అందిస్తారు. ఇప్పటికే నగరంలోని పలు కుటుంబాలు ఇళ్లపై పండిస్తున్నాయి.


పంట లేదు...లాభాలు లేవు...
మాకు రెండెకరాల భూమి ఉంది. వానలు లేక బోరులో నీరు సరిగ్గా రావడం లేదు. కొద్ది నీటితోనే పండించడానికి ఆకుకూరలు సాగు చేశాం. ధరలు పెరిగినా మాకు లాభాలు రావడం లేదు. పంట సరిగా పండటం లేదు. నీరు అందించలేక అల్లాడుతున్నాం. మళ్లీ వానలు పడితేనే పంటలు సాగు చేయగలం.
-జయమ్మ, మహిళా రైతు
మంగళపల్లి, రంగారెడ్డి జిల్లా
అప్పుల పాలయ్యాం
మాకు మూడెకరాల భూమి ఉంది. బ్యాంకులో రుణం పూర్తిగా మాఫీ కాలేదని మళ్లీ రుణం పూర్తిగా ఇవ్వడం లేదు. రూ.50 వేలు మాఫీ కావాలి. కానీ రూ.13 వేలే కొత్త రుణం ఇచ్చారు. కూరగాయలు సాగు చేసి అప్పుల పాలయ్యాం. రూ.లక్ష వరకూ అప్పులున్నాయి. టమాటా, వంగ సాగు చేశాం. ఇప్పుడు పంట సరిగా పండనందున ధరలు పెరిగినా అప్పులు తీరతాయనే ఆశలేదు.
- రాములు, రైతు
పోల్కంపల్లి, రంగారెడ్డి
 




తొలి పరిచయ ప‌రిమళాలు...

తొలి అనుభవాలెప్పుడూ మరపురాని జ్ఞాపకాలే. వాటిని ఎన్నిసార్లు నెమరువేసుకొన్నా మధురంగానే ఉంటాయి. కెమెరా ముందుకొచ్చిన తొలి క్షణాల్ని గుర్తుచేసుకొంటున్నప్పుడు కథానాయికలు కూడా... అలాంటి మధుర భావనకే గురయ్యారు. మేకప్‌ వేసుకొన్న తొలి రోజుల పేజీల్ని వెనక్కి తిప్పి ముగ్ధులైపోయారు. ‘మీ తొలి సినిమా అనుభవాలేంటి’ అని కాజల్‌, తమన్నా, సమంతను అడిగితే ఇలా ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు. ఆ పరిమళాలు మీరూ ఆస్వాదించండి.
ఆ సినిమా నమ్మకం కలిగించింది
‘‘చిన్నప్పుడు ఓసారి భారతీరాజాగారు నన్ను చూశారు. ‘సినిమాల్లోకి వస్తావా... నీకో పాత్ర ఇస్తా’ అన్నారు. నాకూ ఆసక్తి కలిగింది. కానీ నాన్నగారు అడ్డు చెప్పారు. ‘డిగ్రీ చేతికొచ్చాక నీ ఇష్టమొచ్చిన రంగం ఎంచుకో...’ అన్నారు. ఆ తరవాత పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టా. పదో తరగతిలో ‘క్యోం హో గయానా’లో ఓ చిన్న పాత్ర చేశా. కెమెరా ముందుకెళ్లడం అదే తొలిసారి. డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను చూసి కొంతమంది ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీశారు. అవి చేతులు మారుతూ, మారుతూ తేజ గారి దగ్గరకు చేరాయి. అలా ‘లక్ష్మీ కళ్యాణం’లో అవకాశం వచ్చింది. తొలి సినిమాకే ఓ అనుభవజ్ఞుడైన దర్శకుడు దొరకడం నా అదృష్టం. పైగా పాటలకు వచ్చి వెళ్లిపోయే రొటీన్‌ హీరోయిన్‌ పాత్ర కాదు. అన్నిరకాల భావోద్వేగాల్నీ తొలి సినిమాతోనే పలికించే అవకాశం వచ్చింది. దాంతో... ఎలాంటి పాత్రనైనా పోషిస్తానన్న నమ్మకం కలిగింది. ‘లక్ష్మీ కళ్యాణం’ సెట్లో భయంభయంగానే ఉండేది. ఎందుకంటే తేజగారికి కోపం ఎక్కువ. అది ఎప్పుడు ఏ రూపంలో చూడాల్సివస్తుందో అనుకొనేదాన్ని. కానీ అలాంటి క్రమశిక్షణ తొలిరోజుల్లోనే నాకు పరిచయమైనందుకు సంతోషపడుతుంటా’’
- కాజల్‌
పాకెట్‌ మనీ కోసం
‘‘ఓ బర్త్‌డే పార్టీ నా జీవితాన్ని మర్చింది. స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల్లో నన్నెవరో ఫొటోలు తీశారు. మరుసటి రోజు దినపత్రికలో ఆ ఫొటోలు వచ్చాయి. అవి చూసి చెన్నైలోని ఓ వ్యాపారవేత్త నన్ను కలిశారు. వాళ్లకో వస్త్రదుకాణం ఉంది. దానికి మోడలింగ్‌ చేయమన్నారు. అలా మోడల్‌ అయిపోయా. నిజానికి నాకు కెమెరా ముందుకు రావాలంటే చాలా భయంగా ఉండేది. కేవలం పాకెట్‌ మనీ కోసం మోడల్‌నయ్యా. ఆ తరవాత సినిమాటోగ్రాఫర్‌ రవివర్మన్‌ ద్వారా నాకు కథా నాయికగా తొలి అవకాశం వచ్చింది. దానికంటే ముందు విడుదలైన ‘ఏ మాయ చేసావె’తో నా లైఫ్‌ మారిపోయింది. కథానాయికల్ని అందంగా చూపిస్తారు గౌతమ్‌ మేనన్‌. తొలి సినిమానే ఆయనతో పనిచేయడం బాగా కలిసొచ్చింది. జెస్సీ పాత్రతో నాకు పేరు రావడం వెనుక నా ప్రత్యేకమైన కృషి ఏం లేదు. గౌతమ్‌ సార్‌ ఏం చెబితే అది చేశా. యూత్‌ఫుల్‌ స్టోరీ, రెహమన్‌ స్వరాలు, గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వ ప్రతిభ... ఇవన్నీ కలసి నా ఎంట్రీని సూపర్‌హిట్‌ చేశాయి’’
- సమంత
డైలాగులన్నీ అలా
‘‘చిన్నప్పటి నుంచీ నటన అంటే ఆసక్తి ఉండేది. సినిమాల్లోకి రావడానికి కూడా అదే ప్రేరణ. నా తొలి చిత్రం ‘శ్రీ’. అయితే అంతకు ముందే ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర చేశా. మా స్కూలు వార్షికోత్సవంలో నేను స్టేజ్‌ షో చేశాను. అది చూసిన ఓ హిందీ నటుడి ద్వారా నాకు ఆ అవకాశం వచ్చింది. ఇక ‘శ్రీ’తో కథానాయికగా మారా. తొలి సినిమాకి నటన విషయంలో పెద్దగా కష్టపడలేదు గానీ... భాషతో మాత్రం చాలా సమస్య ఎదురైంది. తెలుగు భాష నాకు పూర్తిగా కొత్త. సెట్లో చాలా కంగారుగా ఉండేది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది కాదు. అలాంటప్పుడు డైలాగులేం గుర్తుంటాయి? అందుకే నా డైలాగులన్నీ రికార్డు చేయించి ఇంటికి పట్టుకెళ్లిపోయేదాన్ని. వాటిని వింటూ ఇంగ్లీషులో రాసుకొంటూ బట్టీపట్టేసేదాన్ని. కొన్నాళ్ల పాటు మా ఇంట్లో కూడా తెలుగే మాట్లాడేదాన్ని. అలా... తెలుగు అలవాటైపోయింది. సెట్లో మనోజ్‌, దశరథ్‌ నన్ను చాలా బాగా చూసుకొనేవారు. ఇంటికి దూరంగా ఉన్నాననే భావనే ఉండేది కాదు’’
- తమన్నా

కాసేపట్లో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

    మరికాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూర్ సమావేశం కానుంది. సమావేశంలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా రాజ్యసభ అభ్యర్థులుగా ఎవరి పేర్లు కేటాయిస్తారో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
తెలుగు దేశం కోటాలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో  ఒకటి బీజేపీకి ఇవ్వడానికి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం కేంద్రమంత్రి సుజనా చౌదరి..అరుణ్ జైట్లీతో సమావేశమై బీజేపీకి ఒక్కసీటు వదిలేందుకు సిద్ధమని చెప్పారు. ఒక్క రాజ్యసభ సీటు ఇచ్చినందుకు గాను తెలుగు దేశం నేతలకు జాతీయ స్థాయిలో నామినేటెడ్ సదవులు ఇవ్వాలని సుజనా..జైట్లీని కోరినట్లు సమాచారం
 
ఇక టీడీపీ రాజ్యసభ స్థానాల విషయానికొస్తే..ఉన్న రెండింట్లో ఒక్కటి దాదాపు సుజనా చౌదరికి ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సుజనాను ఆంధ్రా ప్రాంత కోటా నుంచి అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇక రెండో స్థానాన్ని రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ, సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది..వారిలో ముఖ్యంగా కర్నూల్ జిల్లాకు చెందిన బీటీ రాయుడు, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే హేమలత రేసులో ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

Saturday, 28 May 2016

నిద్ర బాగా పడుతుంది..!

ఈ బనానా డ్రింక్‌ను ఓ సారి ట్రై చేసి చూడండి…
        మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెట్టేలా ఓ అద్భుతమైన చిట్కాతో నిత్యం చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు, దాల్చిన చెక్క పొడిలను ఉపయోగించి చేసే ఓ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోజూ చక్కగా నిద్ర పడుతుందట. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు :
తొక్కతీయని అరటి పండు – 1
నీరు – మరిగించడానికి సరిపడా
దాల్చిన చెక్క పొడి – చిటికెడు
షుగర్ ఫ్రీ చక్కెర – రుచికి సరిపడా (అవసరం అనుకుంటేనే)
తయారు చేసే విధానం :
అరటి పండును తొక్కతో సహా అలాగే శుభ్రంగా కడిగి పైన, కింది భాగాల్లో కట్ చేయాలి. అనంతరం ఒక చిన్న పాత్రలో మంచినీటిని తీసుకోవాలి. అందులో అంతకు ముందు సిద్ధం చేసుకున్న అరటి పండును వేయాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. నీరు మరిగాక దాంట్లో దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. రుచి కోసం కొద్దిగా షుగర్ ఫ్రీ చక్కెరను వేసుకోవచ్చు. సాధారణ చక్కెర వాడకూడదు. ఈ నీటిని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ నీరు బాగానే పనిచేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.
2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.
3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.
4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.
6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.
7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.
8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.
9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది.
 

*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.
*బొటనవేలు:అగ్నితత్వం
*చూపుడు వేలు:వాయుతత్వం
*మధ్యవేలు:ఆకాశం
*ఉంగరపు వేలు:భూమి
*చిటికిన వేలు:జలతత్వం.. ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.

 

సో దయుంచి
పిల్లలకు లంచ్ బాక్సులో స్పూన్స్ స్పోర్క్స్ వేయకండి.
స్పూన్స్ స్పోర్క్స్ కల్చర్ మానేద్దాం.
ఆరోగ్యంగా ఉందాం.....

ఐపీఎల్ కొత్త చాంపియన్‌ ఎవరో...?



‘అశ్లీలం’ విషయంలో మహిళలూ వెనకడుగు వేయడం లేదట!

వాటిని వాడడంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారట!
లండన్‌: ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల్లో పురుషులతో సామానంగా మహిళలూ అసభ్య, అశ్లీల పదాలను వాడేస్తున్నారట. కొన్ని రకాల బూతు పదాలను వాడడంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారని ఇటీవల జరిగిన ఓ సర్వే బయటపెట్టింది. బ్రిటన్‌కు చెందిన డెమోస్‌ గత మూడు వారాలుగా బ్రిటన్‌లోని యూజర్లు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తున్న కామెంట్లను విశ్లేషించింది.
 
మహిళలను కించపరిచే అసభ్య పదాలను వాడడంలో పురుషులతోపాటు సాటి స్త్రీలు కూడా ముందున్నారట. అలాగే సాటి మహిళలపై సెక్సీయెస్ట్‌ కామెంట్స్‌ చేయడానికి కూడా వారు వెనకాడడం లేదట. గత మూడు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా ట్వీట్‌ అవుతున్న వాటిల్లో సగటున రెండు లక్షల ట్వీట్లలో స్త్రీలను దూషించే పదాలు ఉన్నాయట. అవి వెంటనే దాదాపు ఎనభై వేల మందికి చేరుతున్నాయట.

తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చిన అకాల వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ గాలి దుమారం, భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాలు తెలంగాణలో విషాదాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులతో కూడిన వర్షానికి నల్గొండ జిల్లా పెదవూర మండలం ఈదెల గూడెంలో రోకుల షెడ్డు కూలి ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
 
ఇక ఖమ్మం జిల్లా విషయానికొస్తే.. వైరా రిజర్వాయర్‌‌లో ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. ఖమ్మం-వైరా మధ్య పెద్ద పెద్ద చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా పెద్దదేవుల పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈదురుగాలులకు చెరువులో పుట్టి బోల్తాపడి ముగ్గురు జాలర్లు మునిగిపోయారు. ఒకరు మరణించగా..ఇద్దరు గల్లంతయ్యారు.
 
ఆంధ్రప్రదేశ్‌‌లోనూ ఇదే పరిస్థితి..విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.రోడ్లు, ఇళ్లపై చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. చంద్రగిరి మండలంలో ఈదురుగాలులు, వర్షం పడుతోంది. పలు చోట్ల రోడ్డుగా అడ్గంగా చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

‘కబాలి’ మరో రికార్డు!

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కబాలి’ చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 30న విడుదలైన ఈ చిత్ర తమిళ టీజర్‌ ‘బాహుబలి’ ట్రైలర్‌ను బీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 2 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఇంత వరకు మన దేశంలో ఏ చిత్రానికి దక్కని ఘనత ‘కబాలి’కి దక్కడం గర్వంగా ఉందని పేర్కొంది.
పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ భార్యగా రాధికా ఆప్టే నటించారు. చెన్నైకి చెందిన డాన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జులై 1న ‘కబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక చార్జింగ్‌నూ షేర్‌ చేసుకోవచ్చు!

లండన్‌: ఇప్పుడు నడుస్తున్నదంతా స్మార్ట్‌ యుగం. ప్రతీ మనిషికీ ఫోన్‌ అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఫోన్‌లో చార్జింగ్‌ లేకపోతే ఏదో ముఖ్యమైన అవయవం దెబ్బతిన్నటే బాధపడుతుంటారు. అయితే అలాంటి బాధ ఇక అవసరం లేదు. ఇప్పటి వరకు ఫోటోస్‌, వీడియోస్‌తోపాటు బ్యాలెన్స్‌ కూడా షేర్‌ చేసుకోవచ్చు అన్న విషయమే మనకు తెలుసు. అయితే ఇకపై చార్జింగ్‌ కూడా ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌కు షేర్‌ చేయవచ్చట.
 
ఈ టెక్నాలజీని లండన్‌ పరిశోధకులు అందుబాటులోకి తేనున్నారు. పైగా ఇది పూర్తిగా వైర్‌లెస్‌ టెక్నాలజీ. వైర్‌లెస్‌ పవర్‌ ట్రాన్స్‌ఫర్‌ (డబ్ల్యూపీటీ)తో అత్యవసర సమయాల్లో చార్జింగ్‌ను మరో ఫోన్‌ నుంచి షేర్‌ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ‘పవర్‌ షేక్‌’ అని పిలుస్తున్నారు. పవర్‌ ట్రాన్స్‌మిట్‌ కాయిల్స్‌ సహాయంతో ఒక ఫోన్‌ నుంచి మరొక ఫోన్‌కు చార్జింగ్‌ను బదిలీ చేసుకోవచ్చు. ఇలా ఒక ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు 12 సెకెన్ల పాటు చార్జింగ్‌ షేర్‌ అయితే.. దాని సహాయంతో ఒక నిమిషం పాటు మాట్లాడవచ్చు.

అంబు‘లెస్‌‌’లు

అప్పుడే పుట్టిన శిశువును అత్యవసర వైద్యం కోసం మరో చోటుకు తరలించాలంటే అంబులెన్స్‌ దొరకదు. ఛాతీ, మానసిక ఆస్పత్రుల్లో గుండెపోటు వచ్చిన రోగిని పెద్దాస్పత్రులకు తీసుకెళ్లాలంటే వాహనం గగనమే... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేరుకు అంబులెన్స్‌లు ఉన్నాయి కానీ.. అవి రోగులకు ఏ మాత్రమూ ఉపయోగ పడడం లేదు. కొన్ని మూలనపడ్డాయి. ఒకటో, రెండో ఉన్నప్పటికీ అవి అధ్వాన స్థితికి చేరాయి.
  • లెక్కల్లోనే వాహనాలు
  • అత్యవసర సమయంలో రోగికి అవస్థలే
  • డిశ్చార్జి అయిన వారిని ఇంటికి చేరవేసే పరిస్థితి కరువు
  • ప్రసూతి ఆస్పత్రుల్లో నవజాత శిశువులకు దొరకని అంబులెన్స్‌లు
  • కదల్లేని స్థితిలో డొక్కు వాహనాలు
  • తరచూ మరమ్మతులు
          ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌ అడ్రస్‌ ఉండదు.రోగి విలవిల్లాడుతున్న దారిదాపుల్లో ఒక్కటి కూడా కనిపించదు. అప్పుడే పుట్టిన శిశువుకు అత్యవసర వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే దొరకనే దొరకదు. రోగుల సహాయకులు ఆటో కోసం రోడ్డు మీదకు పరుగు పెట్టాల్సి వస్తోంది. ఛాతీ, మానసిక ఆస్పత్రుల్లో గుండెపోటు వచ్చిన రోగిని పెద్దాస్పత్రులకు తరలించాలంటే నానా కష్టాలు పడాల్సిందే. ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలకు అత్యవసర వైద్యం కోసం మరో చోటకు తరలించలేని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేరుకు అంబులెన్స్‌ లుంటాయి. కానీ రోగులకు ఉపయోగ పడడం లేదు. పాతకాలం నాటివి పని చేయక మూలనపడ్డాయి. ఒకటో, రెండు ఉన్నా అధ్వానంగా ఉన్నాయి. అంబులెన్స్‌ లోపల కూర్చోవటానికి ఏమాత్రం అనువుగా లేదు.
 
       సీట్లు చిరిగిపోయి, డోరు పగిలి ఉంది. ఆపదలో ఉన్న రోగిని ఇలా ఉన్న వాటిలో మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఇబ్బందిగా ఉంటోంది. కొన్ని ఆస్పత్రుల్లో ఒకరికి దొరికితే మరొకరికి దొరకదు. అంబులెన్స్‌ దొరికినా ముందుకు కదిలే పరిస్థితి లేదు. కదిలినా కొద్ది దూరం వెళ్లి ఆగిపోవాల్సిందే. కొన్ని ఆస్పత్రులో తాతలకాలం నాటివి నేటికీ ఉపయోగిస్తున్నారు. అవి కొద్దికాలం పని చేయడం... తర్వాత షెడ్డులో పడేయటం.. రిపేర్‌ చేయించి మరలా కొద్దిరోజులు వినియోగించడం ఇలా దాదాపు అన్ని ఆస్పత్రులో ఈ పరిస్థితి ఉంది. కొన్ని ఆస్పత్రుల్లో అంబులెన్స్‌లు లేక రోగులు అవస్థ పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రోగులను వ్యాధి నిర్ధారణ కోసం ఇతర ఆస్పత్రులకు తరలించాలంటే కష్టమవుతోంది. ప్రైవేట్‌ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.
 
పేట్లబురుజులో ఎవరో ఒకరికే...
   పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఒకే ఒక అంబులెన్స్‌ ఉంది. పాతకాలం నాటి జీపు, జిప్సీ ఉన్నాయి. ఉన్న ఒక అంబులెన్స్‌ ఒకరిద్దరు రోగులకు మాత్రమే ఉపయోగ పడుతోంది. ఒకరికి దొరికితే మరొకరికి దొరకదు. సీరియస్‌ రోగులను జీపు, జిప్సీలో తరలించడం సాధ్యం కావడం లేదు. కొంచెం మంచిగా ఉన్న రోగుల కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. వారిని నిలోఫర్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించాలి. కానీ అంబులెన్స్‌ కొరతతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. ఆస్పత్రిలో రోజుకు 60 నుంచి 80 ప్రసవాలు ఉంటాయి. ఇందులో 20 నుంచి 30 మంది నవజాత శిశువులకు ఏదో ఒక సమస్య ఉంటోంది.
 
సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రిలో ఒకటే
   సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో మూడు అంబులెన్స్‌లున్నాయి. రెండు పాడైపోయాయి. నవజాత శిశువులను ఇతర ఆస్పత్రులకు తరలించడానికి ఒకటి ఉపయోగిస్తున్నారు. మరో రెండు జీపు లాంటివి చిన్నవి ఉండడంతో రోగులకు అనువుగా లేవు.
 
   ఇక్కడి నుంచి నిత్యం ఐదుగురు నవజాత శిశువులు, మూడు నుంచి ఐదుగురు గర్భిణులను వివిధ పరీక్షల నిమిత్తం ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటోంది. రోగుల అవసరాల మేరకు అంబులెన్స్‌లు అందుబాటులో ఉండడం లేదు.
   ఈ ఆస్పత్రి నుంచి ఎక్కువగా నిలోఫర్‌, ఉస్మానియాకు రోగులను తరలిస్తున్నారు. ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకుని వెళుతున్నారు. వారు అవసరాన్నిబట్టి ఎక్కువ చార్జీ డిమాండ్‌ చేస్తున్నారు పేదరోగులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయాల్లో ఆటోలను ఆశ్రయించి తీసుకెళు తున్నారు. కొంతమంది గర్భిణిలు ఆర్టీసీ బస్సుల్లో వెళుతున్నారు.
 
చెస్ట్‌ ఆస్పత్రిలో అదేతీరు
   చెస్ట్‌ ఆస్పత్రిలో నాలుగు అంబులెన్స్‌ లున్నాయి. ఇందులో రెండు 15 సంవత్సరాల నాటివి. అవి ఉపయోగపడటం లేదు. ఉన్న రెండు రోగుల అవసరాలకు అందుబాటులో ఉండవు. ఆ రెండింటిని ఎవరికి, ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియని పరిస్థితి. ఈ ఆస్పత్రి నుంచి హార్ట్‌, న్యూరాలజీ, కిడ్నీ, ఆర్థో, కంటి పరీక్షలకు రోగులను ఉస్మానియా, నిలోఫర్‌, గాంధీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్కానింగ్‌, ఎమ్మారై లేకపోవడంతో వాటి కోసం రోగులను ఉస్మానియా, గాంధీకి తీసుకెళ్లాలి. అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఆటోలు, బస్సుల్లో వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తున్నారు.
 
మానసిక ఆస్పత్రిలో...
  మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు తరచూ గుండె, బ్రెయిన్‌ సో్ట్రక్‌ సమస్యలు వస్తాయి. ఇతర చికిత్సల కోసం రోగులను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. మానసిక రోగులను ఇతర వాహనాల్లో తరలించే పరిస్థితి లేదు. వీరికి అత్యవసర వైద్యం అందించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. 108 సర్వీస్‌లకు ఫోన్‌ చేస్తే మీకు అంబులెన్స్‌లున్నాయి కదా.. మేము పంపిం చలేమని సమాధానం చెబుతున్నారు.
 
డ్రైవర్ల కొరత
  కొన్ని ఆస్పత్రుల్లో డ్రైవర్ల కొరత ఉంది. అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ డ్రైవర్లు ఆ రోజు డ్యూటీకి రాకపోతే నడిపించే వారు ఉండరు. అదనపు డ్రైవర్లను నియమించడం లేదు. అంబులెన్స్‌లకు డీజిల్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది. వీటి నిర్వహణకు కేటాయించే బడ్జెట్‌ సకాలంలో విడుదల కావడం లేదు. డీజిల్‌ లేని సమయంలో కొన్నిసార్లు పక్కన పెట్టేస్తున్నారు. దశల వారీగా విడుదల కావాల్సిన డీజిల్‌ బడ్జెట్‌ త్వరగా రావడం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.
 
ఉస్మానియాలో రెండు... పార్కింగ్‌ యార్డుకే పరిమితం
   ఉస్మానియా ఆస్పత్రిలో ఆరు అంబులెన్స్‌లున్నాయి. అవి తాతాల కాలం నాటివి కావడంతో కొన్ని పాడైపోగా... కొన్ని మోరాయిస్తున్నాయి. ఆరు అంబులెన్స్‌లో రెండింటిని మాత్రమే రోగుల అవసరాలకు వినియోగిస్తున్నారు. రెండు పాడైపోవడంతో పార్కింగ్‌ యార్డుకే పరిమితయ్యాయి. ఒకటి మందుల తరలింపు, మరొకటి ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. రోగులకు రెండు అంబులెన్స్‌లు సరిపోకపోవడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
 
   పేషెంట్‌ ఒకచోట... వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరోచోట ఉండడంతో రోగులను ఈ భవనం నుంచి ఆ భవనానికి అంబులెన్స్‌లో తరలించాలి. అవి లేకపోవడంతో వీల్‌చైర్‌లో తీసుకెళ్లాల్సి రావడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. 1980 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉస్మానియా ఆస్పత్రికి తెలుగు సంజీవిని శకటం పేరిట రెండు అంబులెన్స్‌లను మంజూరు చేశారు.
 
   1994లో జపాన్‌ దేశ ఆర్థిక సహకారంతో ఉస్మానియా ఆస్పత్రికి జైకా కంపెనీకి చెందిన రెండు అంబులెన్స్‌లను కేటాయిం చారు. 2007లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రెండేసి అంబులెన్స్‌లను కేటాయించింది. ఇప్పటి వరకు నూతన అంబులెన్సులను ఉస్మానియా ఆస్పత్రికి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. పాతవాటితోనే పాలకవర్గం నెట్టుకొస్తోంది. పాతవాటికి మరమ్మతులు చేయించి వాడుతున్నారు.
 

మీరు ఇంట్లో అగర్ బత్తీలు వెలిగిస్తుంటారా..? అయితే జాగ్రత్త

  ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మనిషికీ, జబ్బులకీ అనుసంధానం అగర్‌ బత్తీ అనే మాట నిజం అంటున్నారు నిపు ణులు. సువాసనలు వెదజల్లే అగర్‌బత్తీ పొగలో అనేక రకాల అనారోగ్యం కలిగించే మూలకాలున్నాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన అగర్‌ బత్తీల తయారీలో పాలీఅరోమేటిక్‌ హైడ్రో కార్బన్‌లను వాడతారు. ఈ రసాయనం మండించడం ద్వారా వచ్చే పొగ పీల్చడం వల్ల జలుబు, దగ్గు, ఎలర్జీ, తుమ్ములు, ఆస్తమా లాంటి సాధారణ అనారోగ్య సమస్యల నుంచి గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ పొగలోని కార్బన్ డై ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, కార్బన్ మోనాక్సైడ్‌లు ఊపిరితిత్తు లల్లోని కణాలకు వాపు కలిగిస్తాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టమవు తుంది. ఈ రసాయనాల వల్ల చర్మం, కళ్లు తీవ్ర మైన ఎలర్జీలకు లోనవుతాయి. తరచుగా ఈ పొగ పీల్చడం వలన ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్యాన్సర్‌ లు వచ్చే అవకాశం ఎక్కువ. ఆధ్యాత్మిక కార్యకలాపాలే వృత్తిగా జీవించే వారికి, నిత్యం ఇటువంటి కార్యకలాపాల్లో మునిగి తేలే వారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇళ్లలో ఇటువంటి కార్యక్రమాలు జరిపే సమయంలో చాలా కొద్దిసేపు మాత్రమే లాంఛనంగా అగర్‌బత్తీలు వెలిగించడం మేలంటున్నారు నిపుణులు. పిల్లలను ఈ పొగకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.

Friday, 27 May 2016

10 రూపాయలకే బోలెడన్ని సినిమాలు చూసేయండి..

  ఇంటర్‌నెట్‌ వచ్చిన తరువాత నచ్చిన సినిమాలు చూడటం తేలిక అయిపోయింది. ఒకపుడు సినిమా చూడాలంటే థియటర్‌కు వెళ్లాల్సి వచ్చేది. కేబుల్‌ టీవీ వచ్చిన తరువాత సినిమా నట్టింట్లోకి వచ్చేసింది. ఇంటర్‌నెట్‌ విస్తరించిన తరువాత కొత్త సినిమాలను కూడా నెట్‌లో చూసే వెసులుబాటు వచ్చేసింది. అదే ఫాస్ట్‌ ఫిల్మ్జ్‌. ఈ యాప్‌ రీజనల్‌ సినిమాలకు ఉద్దేశించినది. రూ.10 చెల్లిస్తే చాలు అన్‌లిమిటెడ్‌గా సినిమాలు చూడొచ్చు. ఈ యాప్‌లో ప్రత్యేక లైబ్రరీ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి 150 తమిళ సినిమాలను పొందుపరిచారు. ఈ యాప్‌లో తెలుగు సినిమాలను కూడా పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెలవారీ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోవాల్సినపని లేదు. రోజుకు రూపాయి లెక్కన పది రోజులకు పది రూపాయలు చెల్లిస్తేచాలు. ఈ యాప్‌ కేవలం సినిమాను చూడటమే కాదు, డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. ఈ యాప్‌లో ఆరు విభాగాలు ఉంటాయి. స్టార్లు, సీన్స్‌, న్యూ ఎరైవల్స్‌, షో కేస్‌, ఎక్స్‌ప్లోర్‌ మరియు మై డౌన్‌లోడ్స్‌ అని ఉంటాయి.

73ఏళ్ల నాటి సబ్‌మెరైన్‌ లభ్యం...

  లండన్‌: రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అదృశ్యమైన సబ్‌మెరైన్‌ 73ఏళ్ల తర్వాత బయటపడింది. బ్రిటన్‌కు చెందిన ఈ 1,290 టన్నుల జలాంతర్గామిని సర్దీనియా తీరాన మధ్యధరాసముద్రంలో కనుగొన్నారు. 100 మీటర్ల లోతులో ఓ డైవింగ్‌ బృందం ఈ సబ్‌మెరైన్‌ను గుర్తించి అధికారులకు సమాచారమందించారు. ఇందులో 71 మంది అవశేషాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
   1942, డిసెంబర్‌ 28న ఇటలీ యుద్ధ విమానాలను ధ్వంసం చేసేందుకు ఈ సబ్‌మెరైన్‌ మాల్టా ప్రాంతం నుంచి బయలుదేరింది. చివరిసారిగా డిసెంబర్‌ 31న ఈ జలాంతర్గామి నుంచి సిగ్నల్స్‌ వచ్చాయి. అనంతరం 1943 జనవరి 2న ఈ సబ్‌మెరైన్‌ కన్పించకుండా పోయింది. సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అప్పటి అధికారులు భావించారు.
   ఇన్నేళ్ల తర్వాత మధ్యధరా సముద్రంలో దీన్ని గుర్తించారు. చిన్న డ్యామేజ్‌ మినహా.. ఈ సబ్‌మెరైన్‌ ఇప్పటికీ పూర్తి కండిషన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ లేకపోవడంతో ఇందులోని సిబ్బంది చనిపోయారని తెలిపారు.
 

ఖరీదైన ఆపరేషన్‌ చేయించుకుందని..

   సౌదీ అరేబియాలో ఇటీవలి కాలంలో విడాకుల పర్వం ఎక్కువవుతోంది. అయితే వీరు విడాకులు తీసుకోడానికి గల కారణాలు వింటే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. మొన్నటికి మొన్న తనను పట్టించుకోకుండా ఫోన్‌ వినియోగిస్తుందన్న కోపంతో పెళ్లయిన వెంటనే భార్య నుంచి విడాకులు కోరాడో భర్త. తాజాగా.. భార్య ఖరీదైన ఆపరేషన్‌ చేయించుకుందని.. ఆమెకు విడాకులిచ్చాడు మరో భర్త.
సౌదీ రాజధాని రియాద్‌కు చెందిన ఓ వ్యక్తి... తన భార్య లావుగా ఉండటంతో బరువు తగ్గమని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి విధుల నిమిత్తం నజ్రాన్‌ ప్రాంతానికి వెళ్లాడు. అయితే భర్త తిరిగొచ్చే సరికి నాజూగ్గా కన్పించాలని భావించిన ఆ భార్య.. ఓ వైద్యుడి దగ్గరకు వెళ్లి.. బరువు తగ్గేందుకు ఆపరేషన్‌ చేయించుకుంది. ఇందుకు 80వేల రియాల్స్‌(భారత కరెన్సీలో దాదాపు రూ.14లక్షలు) ఖర్చుచేసింది.
విధుల నుంచి తిరిగొచ్చిన ఆ వ్యక్తి భార్యను చూడగానే ఆనందం వ్యక్తం చేశాడు. అయితే.. అందుకైన ఖర్చు వివరాలు చెప్పేసరికి ఆగ్రహానికి గురయ్యాడు. ఇంటి కోసం దాచిపెట్టిన డబ్బును ఆపరేషన్‌ కోసం ఖర్చు చేసిందన్న కోపంతో ఆమెకు విడాకులిచ్చేశాడు.