Sunday, 29 May 2016

పంట అరకొర... కూర కొరకొర




తెలంగాణలో కరవు ప్రభావంతో పంటల సాగు తగ్గి కూరగాయల కొరతతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. చిల్లర మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ మంటతో సామాన్యులు అల్లాడుతున్నారు. ఏకంగా పచ్చిమిరప కిలో రూ.100కు పైగా చిల్లర మార్కెట్‌లో అమ్ముతున్నారు. రైతుబజార్లలోనే వీటి ధర రూ.83 ఉంది. ఇక్కడ ధర తక్కువున్నా నాణ్యత ఉండటం లేదు. ఎండల తీవ్రత కారణంగా పంటల దిగుబడులు బాగా పడిపోయాయి. వ్యాపారం లేక రైతులు.. కూరగాయలు కొనలేక ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు.
రాష్ట్రంలో కూరగాయలు కొనేందుకు సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. ఒకపక్క పంట పండక ధరలు ఆకాశానంటుతుండటంతో కొనుగోలుకు ఇబ్బందులు తప్పడం లేదు. పండిన పంట పూర్తి నాణ్యత ఉండటం లేదు. బాగున్నవాటిని పెద్ద పెద్ద మాల్స్‌, దుకాణాల వారు కొనేస్తున్నారు. రైతుబజార్లకు ద్వితీయ శ్రేణి రకాలే వస్తున్నట్లు రైతులే చెబుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నగరాలతో పాటు ఇతర పట్టణాలకు రైతులు కూరగాయలు తీసుకురావడం తగ్గిపోయింది. చిల్లర మార్కెట్లలో ఎంత అమ్ముతున్నారనే దానిపై అధికారికంగా లెక్కలు లేవు. కానీ రైతుబజార్లు, టోకు మార్కెట్లకు వచ్చిన వాటినే చిల్లర వ్యాపారులు కొని తీసుకెళ్లి మారుబేరానికి అమ్ముతున్నారు. రాష్ట్రం మొత్తం మార్కెట్లకు వచ్చిన వాటి గణాంకాలను చూస్తే కూరగాయల ధరలెందుకు విపరీతంగా పెరగుతున్నాయన్నది అర్థమవుతుంది. 2013 మే నెలలో తెలంగాణ రైతుబజార్లు, మార్కెట్లకు మొత్తం 3.59 లక్షల క్వింటాళ్ల కూరగాయలు వస్తే ఈ నెలలో 3.04 లక్షల క్వింటాళ్లకు తగ్గిపోయాయని మార్కెటింగ్‌ శాఖ వర్గాలే చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ జిల్లాలకు కూరగాయలు వస్తున్నందునే కొంత కొరత తీరుతోంది. పూర్తిగా తెలంగాణ రైతులపైనే ఆధారపడితే ఇందులో సగం కూడా రావని మార్కెటింగ్‌ శాఖ అధికారి ఒకరు వివరించారు.
* ధరలు పెరిగిన కూరగాయల రాకలో అంతరం కనిపిస్తోంది. టమాటాల ధర రెండు నెలల్లోనే రూ.5 నుంచి 50 రూపాయలకు పెరిగింది. 2013 మే నెలలో తెలంగాణ మార్కెట్లకు 28,241 క్వింటాళ్లు వస్తే ఈ ఏడాది ఇదే నెలలో కేవలం 9,286 క్వింటాళ్లే వచ్చాయి.
* బెండకాయలు గత నెలలో 39,506 క్వింటాళ్లొస్తే...ఈ నెల 6,641 క్వింటాళ్లే వచ్చాయి. ఇంత భారీ తగ్గుదల కారణంగా వీటి ధర రెట్టింపైంది.
* ఇక్కడ చుట్టుపక్కల పండే కూరగాయల రాకతో పోలిస్తే దూర ప్రాంతం నుంచి ఏడాది పొడవునా వచ్చేవాటిలోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. టమాటాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల నుంచి తెలంగాణకు వస్తుంటాయి. గత మార్చిలో 17,217 క్వింటాళ్లు రాగా ఈ నెల 9,286 క్వింటాళ్లకు తగ్గాయి. ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఏడాది పొడవునా తెలంగాణకు వచ్చే ఆలుగడ్డలు గత నెలలో 13,563 క్వింటాళొæ్ల®్త ఈ నెల 14,025 క్వింటాళ్లకు పెరిగాయి.
ముందుచూపు లేకనే కొరత తీవ్రం
కూరగాయల పంటల సాగు పెంచి కొరత ఏర్పడకుండా చూడటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పుడు ప్రజలు అల్లాడుతున్నారు. గత మార్చి నుంచి కూరగాయల రాక క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాది జూన్‌ నుంచి వర్షపాతం బాగా తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. బోర్లు పనిచేస్తున్న రైతులను గ్రామాల వారీగా గుర్తించి వారికి రాయితీపై విత్తనాలు, ఎరువులు ఇచ్చి అప్రమత్తం చేసి కూరగాయ పంటలు సాగు చేయిస్తే ఇప్పుడు మార్కెట్‌లో కొరత ఉండేది కాదు. కానీ రాయితీ విత్తనాలకు కనీసం నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. కనీసం ఖరీఫ్‌లోనైనా పంటలు సాగు చేయించేందుకు విత్తనాల పంపిణీ ఇంతవరకూ ప్రారంభించలేదు. ప్రస్తుత వేసవిలో తెలంగాణలో సాధారణంగా 50 వేల ఎకరాల్లో కూరగాయల పంటలుండాలి. కానీ 25 వేల ఎకరాల్లో కూడా లేవని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఖరీఫ్‌లో 2 లక్షల ఎకరాల్లో వేయాలి. కానీ విత్తనాలే లేక రైతులు ఎదురుచూస్తున్నారు.


300 గ్రాములు తినాలి
నిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు తప్పనిసరిగా 300 గ్రాముల వరకూ తాజా కూరగాయలు తప్పనిసరిగా తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ) సూచించింది. భారతీయులు అన్నం ఎక్కువ ఉంచి, కూర తక్కువ కలిపి తింటారు. కానీ అన్నం, కూర దాదాపు సమాన నిష్పత్తిలో తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో రోజూ కనీసం కిలోకు తగ్గకుండా కూరలు తినాలి. ఇప్పుడు కిలో తాజా కూరగాయలతో తినాలంటే కనీసం రూ.40 నుంచి 50 దాకా ఖర్చవుతుంది.

హోటల్‌ వంటకాల్లోనూ మార్పులు
హోటళ్లలో వండే కూరగాయలలోనూ మార్పులొచ్చాయి. ధరల మంట కారణంగా టమాటా, బీన్స్‌, బెండ వాటిని తగ్గించి సులభంగా లభించే ఆలుగడ్డ, దోస, సొర వంటి వాటిని ఎక్కువకు కొని వండుతున్నట్లు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భోజన హోటల్‌ వ్యాపారి ఒకరు తెలిపారు. ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిన వాటిని వండి వడ్డిస్తే తమకు నష్టం వస్తుందని, కాబట్టి అధిక ధరలుండే వాటిని వండటం లేదని తెలిపారు. ఇంతకుముందు రోజూ తమ హోటల్‌లో 15 కిలోల దాకా టమాటాలతో వంటలు చేసేవారమని ఇప్పుడు ఐదారు కిలోలు వాడటం లేదని వివరించారు. రైతుబజార్లలో, మార్కెట్లలో ప్రజల కొనుగోలు తీరులోనూ మార్పు వచ్చింది. గతంలో కిలోల కొంటే, ఇప్పుడు అర, పావుకిలోతో సరిపెడుతున్నామని సరూర్‌నగర్‌ రైతుబజారుకు కూరగాయలు కొనడానికి వచ్చిన గృహిణి సంధ్యారాణి ‘ఈనాడు’తో చెప్పారు.

ఇంటి పంట...సరైన పరిష్కారం
కూరగాయల ధరల మంటను సులభంగా ఎదుర్కోవడానికి ప్రతి ఇంటికి మంచి అవకాశముంది. ఇంటి ఆవరణలో లేదా భవనంపై 100 చదరపు అడుగుత స్థలముంటే ఒక కుటుంబానికి అవసరమైన కూరగాయలు ఏడాది పొడవునా పండించుకోవచ్చు. పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఉద్యానశాఖ కార్యాలయం అధికారులు ఈ ఇంటి పంట పథకం అమలుకు ఒక్కో కుటుంబానికి రూ.3 వేల వరకూ రాయితీలిస్తున్నారు. విత్తనాలు, కుండీలు, ఎరువు వంటివి సమకూర్చుకోవడానికి సహకారం అందిస్తారు. ఇప్పటికే నగరంలోని పలు కుటుంబాలు ఇళ్లపై పండిస్తున్నాయి.


పంట లేదు...లాభాలు లేవు...
మాకు రెండెకరాల భూమి ఉంది. వానలు లేక బోరులో నీరు సరిగ్గా రావడం లేదు. కొద్ది నీటితోనే పండించడానికి ఆకుకూరలు సాగు చేశాం. ధరలు పెరిగినా మాకు లాభాలు రావడం లేదు. పంట సరిగా పండటం లేదు. నీరు అందించలేక అల్లాడుతున్నాం. మళ్లీ వానలు పడితేనే పంటలు సాగు చేయగలం.
-జయమ్మ, మహిళా రైతు
మంగళపల్లి, రంగారెడ్డి జిల్లా
అప్పుల పాలయ్యాం
మాకు మూడెకరాల భూమి ఉంది. బ్యాంకులో రుణం పూర్తిగా మాఫీ కాలేదని మళ్లీ రుణం పూర్తిగా ఇవ్వడం లేదు. రూ.50 వేలు మాఫీ కావాలి. కానీ రూ.13 వేలే కొత్త రుణం ఇచ్చారు. కూరగాయలు సాగు చేసి అప్పుల పాలయ్యాం. రూ.లక్ష వరకూ అప్పులున్నాయి. టమాటా, వంగ సాగు చేశాం. ఇప్పుడు పంట సరిగా పండనందున ధరలు పెరిగినా అప్పులు తీరతాయనే ఆశలేదు.
- రాములు, రైతు
పోల్కంపల్లి, రంగారెడ్డి
 




No comments:

Post a Comment