Monday, 30 May 2016

హైద్రాబాద్ ఎలా గెలిచింది... బెంగళూరు ఎందుకు ఓడింది ?

ఐపీఎల్ మహాసంగ్రామం ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానేవచ్చింది. బెంగళూరు చినస్వామి స్టేడియంలో హైద్రాబాద్ సన్‌రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. అయితే రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధిస్తుందని చాలా మంది అంచనా వేశారు. ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ వార్నర్ సేన అనూహ్య విజయం సాధించింది.
హైద్రాబాద్ సన్‌రైజర్స్‌లో వార్నర్, ధావన్, యువరాజ్ మినహాయిస్తే పెద్దగా బ్యాట్స్‌మెన్స్ లేరు. బెంగళూరు జట్టులో ఆల్ రౌండర్లు చాలామంది ఉన్నారు. కానీ 208 పరుగులను అందుకోవడంలో విఫలమయ్యారు. గేల్ సూపర్ సిక్స్‌లతో సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మ్యాచ్ గెలుపుకు కారణాలను విశ్లేషించుకోకపోయినా ఫర్వాలేదు కానీ ఓటమిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ ఓటమికి ఈ  విషయాల్లో విఫలం కావడమే కారణమంటున్నారు క్రీడా విశ్లేషకులు.
1. విఫలమయిన షేన్ వాట్సన్:
బెంగళూరు జట్టులో షేన్ వాట్సన్‌ది ప్రత్యేక స్థానం. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే వాట్సన్ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వాట్సన్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా 4 ఓవర్లలో 61 పరుగులు ఇచ్చి విమర్శల పాలవుతున్నాడు. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ బెన్ కటింగ్ వాట్సన్ వేసిన ఒక్క ఓవర్లో 3 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టి స్కోర్ బోర్డ్‌ను 200 వైపు పరిగెత్తించాడు. బ్యాటింగ్‌లో కూడా వాట్సన్ నిరాశపరిచాడు. 9 బంతులు ఆడిన వాట్సన్ 11 రన్స్ చేసి ఔటయ్యాడు.

2. బౌలింగ్ కూడా అంతంత మాత్రమే:
సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్స్‌ను కట్టడి చేయడంలో ఆర్‌సీబీ బౌలర్లు విఫలమయ్యారనే చెప్పాలి. లెగ్ స్పిన్నర్ చాహల్ ఈ మ్యాచ్‌లో మాత్రం తన మాయాజాలాన్ని చూపించలేకపోయాడు. 4 ఓవర్లు వేసిన చాహల్ ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ తీశాడు. 35 పరుగులు ఇచ్చి భారీగానే మూల్యాన్ని చెల్లించుకున్నాడు. జోర్డాన్ 4 ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చాడు. 3 కీలక వికెట్లు తీసినప్పటికీ పరుగులు కట్టడి చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. పైగా ఆరు వైడ్‌లతో ఎక్స్‌ట్రా రన్స్ ఇచ్చాడు.
3. చేతులెత్తేసిన మిడిల్ ఆర్డర్:
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు కోహ్లీ, గేల్ శుభారంభాన్ని ఇచ్చారు. గేల్ సిక్స్‌లతో చితక్కొట్టి 76 పరుగులు చేసి పటిష్ట పునాది వేసి ఔటయ్యాడు. గేల్ తర్వాత వచ్చిన డివిలియర్స్ ఫ్యాన్స్ ఆశలను తలకిందులు చేశాడు. 5 పరుగులకే ఔటయ్యాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షేన్ వాట్సన్ 11 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఆల్ రౌండర్‌ను కోల్పోయి ఆర్‌సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన లోకేష్ రాహుల్, సచిన్ బేబీ, స్టార్ట్ బిన్నీ కూడా చేతులెత్తేయడంతో బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది.
4. కొంపముంచిన అతివిశ్వాసం:
బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. విరాట్ కోహ్లీ, గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో ఉన్న చాహల్, షేన్ వాట్సన్ ఉండనే ఉన్నారు. దీంతో దాదాపు అందరూ ఐపీఎల్ కప్ కొట్టేది ఆర్‌సీబీయేనని భావించారు. అయితే ఈ అతినమ్మకమే బెంగళూరు కొంప ముంచింది. బెంగళూరు వికెట్ కీపర్ లోకేష్ రాహుల్ మ్యాచ్ మొదలవక ముందు ఓ ప్రశ్నకు సమాధానంగా ‘మేము ఆల్‌రెడీ మ్యాచ్ గెలిచేశామని’ చెప్పాడు. ఆర్‌సీబీ ఆటగాళ్లంతా ఈ మనస్తత్వంతోనే బరిలోకి దిగారు. చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నారు.

No comments:

Post a Comment