Friday, 13 May 2016

తెలుగు ఓటు ఎటువైపు...

27 శాతం తెలుగువారే
డీఎంకేలో 16 సీట్లకు మనవారే
అన్నాడీఎంకేలోనూ ప్రాధాన్యం
 
నిర్బంధ తమిళంతో ఇటీవల తెలుగు విద్యార్థులు తల్లడిల్లినా పట్టించుకోని తమిళ పార్టీలు ఎన్నికల వేళ తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరానిపాట్లు పడుతున్నాయి. బహుముఖ పోరుతో ఈసారి ఫలితాలు అంచనా వేయడం ఏ మాత్రం వీలుకాని నేపథ్యంలో ఏ వర్గానికి చెందిన ఓటరునూ నిర్లక్ష్యం చేయకుండా మచ్చిక చేసుకోవాలని ద్రవిడ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తి గొలుపుతున్నాయి. సంప్రదాయానికి భిన్నంగా ప్రచారంలో తెలుగు పదాలను ఉచ్చరిస్తున్నారు. తెలుగు ప్రచార కరపత్రాలు, గోడ పత్రికలను ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో వారికి ఈ ఎన్నికల్లో ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపుతాడనేది తమిళ సమరంలో ఆసక్తి రేపుతోంది.
 
90 చోట్ల మన బలమే అఖిల భారత తెలుగు సమాఖ్య(ఏఐటీఎఫ్‌), తమిళనాడు నాయుడు పేరవైల అంచనాల ప్రకారం 90 స్థానాల్లో తెలుగు ఓటర్లు ప్రభావ శీలురుగా ఉన్నారు. 18 స్థానాల్లో తెలుగు ఓటర్లు 40 శాతం ఉన్నారు. అక్కడ అభ్యర్థుల జాతకాన్ని తెలుగు వారే తేల్చనున్నారు. దక్షిణ తమిళనాడులో పలు జిల్లాలో తెలుగువారి ప్రభావం ఎక్కువ. హోసూరులో తలపడుతున్న కాంగ్రెస్‌, అన్నాడీఎంకే అభ్యర్థులు గోపీనాథ్‌, బాలకృష్ణారెడ్డిలు ఇద్దరూ తెలుగు వారే. ఇక చెన్నై, కాంచీపురం జిల్లాల్లో అయితే 20 శాతానికి పైగా తెలుగు ఓటర్లే ఉన్నారు. శ్రీపెరంబుదూరు, కాంచీపురం, చెన్నై శివార్లలోని హార్బర్‌, ఆవడి, కొళత్తూరు, వేళచ్చేరి, అన్నానగర్‌, విరుగంబాక్కం, ఆర్‌.కె.నగర్‌ తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లే ప్రధాన తీర్పరులుగా మారుతున్నారు. డీఎంకే 16 స్థానాల్లో తెలుగు అభ్యర్థులను నిలబెట్టింది. అన్నాడీఎంకే 4 స్థానాల్లో నిలబెట్టింది. భాజపా కూడా తెలుగు వారికి ప్రాధాన్యమిచ్చింది. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌, ఎండీఎంకే నేత వైగోలు అచ్చ తెలుగువారే కావడంతో అక్కడ కూడా తెలుగు వారికి బాగానే టిక్కెట్లు వచ్చాయి. ఆర్‌.కె.నగర్‌లో జయలలితకు ప్రత్యర్థిగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుంటే తిరుత్తణిలో భాజపా అభ్యర్థి ఎం.చక్రవర్తి నాయుడు డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అన్నాడీఎంకే, డీఎంకేల్లోని కీలక పదవుల్లోనూ తెలుగు వారున్నారు. అన్నాడీఎంకేలో జయలలిత తరువాత అత్యున్నత స్థానం ప్రిసీడియం ఛైర్మన్‌ మధుసూదన్‌ అచ్చ తెలుగువారే. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురైస్వామి తెలుగువారే. తెలుగు ఓటర్లు ఇంత బలంగా ఉన్నా తెలుగువారి మధ్య ఐక్యతలేమి ప్రధాన అవరోధంగా మారింది. సీఎంకే రెడ్డి నేతృత్వంలోని అఖిల భారత తెలుగు సమాఖ్య భాజపాకు మద్దతిస్తోంది. తమిళనాట తెలుగువారిలో మంచి పట్టున్న కామాక్షినాయుడు నేతృత్వంలోని తమిళనాడు నాయుడు పేరవై డీఎంకేకు మద్దతిస్తోంది.
ఒకప్పుడు తెలుగే *తమిళనాడులో ఒకప్పుడు తెలుగు పాలనే నడిచేది. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో వరుసగా ఆరుగురు ముఖ్యమంత్రులు తెలుగువారే. పనగల్‌ రాజా, బి.మునస్వామి, బొబ్బిలిరాజా, టంగుటూరి ప్రకాశం, ఓమండూరు రామస్వామిరెడ్డియార్‌, కుమారస్వామి రాజాల పాలనలో తెలుగు ప్రభవించింది. మద్రాస్‌ నగర పాలక సంస్థ మొదటి మేయర్‌ పిట్టి త్యాగరాజ చెట్టి కూడా తెలుగువారే.
*భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిపోవడంతో తెలుగు జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
*ఒక అంచనా ప్రకారం తమిళనాట తెలుగువారి జనాభా దాదాపు 40 శాతం. తమిళ ప్రభుత్వాలు ఇక్కడ రికార్డుల నమోదులో ఒక వ్యూహం ప్రకారం తెలుగు పేర్లను తమిళీకరణ చేసి జనాభాను అధికారిక లెక్కల్లో 7శాతానికి పరిమితం చేసేశారు.
*2013లో ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం తమిళనాట తెలుగు జనాభా 27 శాతం.
23 సామాజిక వర్గాలు తమిళనాట తెలుగు వారున్న సామాజిక వర్గాలు 23. అందులో ప్రధానమైనవి నాయుడు(కాపు), కమ్మ నాయుడు, రెడ్డి, కొండరెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణులు, ఆదిఆంధ్ర, అరుంధతీయార్లు, బేరివైశ్య, 24-మనై తెలుగు చెట్టియార్‌లు, గొల్ల, యాదవ, క్షత్రియ, పద్మశాలి తదితర సామాజిక వర్గాలవారున్నారు.
తెలుగురాని తెలుగువాళ్లు దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల్లో వూళ్లకు వూళ్లు తెలుగువారే ఉనారు. అయితే వారెవరికీ తెలుగు మాట్లాడటం, చదవడం రాదు. మూలాలు మాత్రం తెలుగే. మదురై ప్రాంతంలోని నాయకర్లు(నాయుడు సామాజికవర్గం) ఒక బలమైన శక్తిగా ఉంది. వారి ఓటు బ్యాంకును ఆకర్షించడానికి జయలలిత తిరుమల నాయకర్‌ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
40 శాతానికి పైగా తెలుగు ఓటర్లున్న నియోజకవర్గాలు
కోవిల్‌పట్టి, విళాత్తికుళం, విరుద్‌నగర్‌, సాత్తూరు, రాజపాళ్యం, శ్రీవిళ్లిపుత్తూరు, ప్రియకుళం, తళి, సేలం, ఆండిపట్టి, సింగనల్లూరు, వేదసందూర్‌, తేని, బర్గూరు, గుడియాత్తం.

No comments:

Post a Comment