Thursday, 19 May 2016

పుదుచ్చేరి ‘నమశ్శివాయ’కేనా?


    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకే కూటమి మొత్తం 30 స్థానాల్లో 17 గెలిచి ఘనవిజయం సాధించింది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా పుదుచ్చేరిలో అధికారంలో వున్న ఏఐఎన్‌ఆర్‌సీ నేత, సీఎం రంగస్వామి పాలనకు తెరపడింది. ఏఐఎన్‌ఆర్‌సీ 8, అన్నాడీఎంకే 4, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు. ప్రతీకారం తీర్చుకున్న అన్నాడీఎంకే
రంగస్వామి ఓటమితో అన్నాడీఎంకే ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. 2008లో కాంగ్రెస్‌నుంచి వేరుపడిన రంగస్వామి సొంతంగా పార్టీని ఏర్పాటుచేశాడు. 2011 ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాడు. విజయం సాధించిన అనంతరం అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకోవడం జయకు ఆగ్రహం కలిగించింది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే అభ్యర్థులను నిలపడంతో రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్‌ఆర్‌సీకి నష్టం ఏర్పడింది.

సీఎంగా నమశ్శివాయకు అవకాశం
తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు కూటమిగా ఏర్పడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు నమశ్శివాయ విల్లియనూర్‌ స్థానంనుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌ కూటమి మెజార్టీస్థానాలు సాధించడంతో నమశ్శివాయకు సీఎం అయ్యే అవకాశముంది.

మూడు రాష్ట్రాల్లో విస్తరించిన పుదుచ్చేరి
పుదుచ్చేరి అసెంబ్లీలో 30 స్థానాలున్నాయి. అయితే స్థానాలు మాత్రం మూడు రాష్ట్రాల్లో విస్తరించివున్నాయి. కరైకాల్‌ తమిళనాడులో వుండగా యానాం ఆంధ్రప్రదేశ్‌లో మాహె కేరళలో వున్నాయి.

రంగస్వామి తీరే వేరు
పుదుచ్చేరి రాజకీయాల్లో రంగస్వామి అనూహ్యంగా ఎదిగారు. 2001 నుంచి ఆయన 2008 వరకు కాంగ్రెస్‌లో వున్నారు. అనంతరం పార్టీతో విభేదించి ఏఐఎన్‌ఆర్‌సీ పేరిటి సొంతకుంపటి పెట్టుకున్నారు. ప్రజాకర్షకపథకాలతో పాటు బుల్లెట్‌ మోటార్‌సైకిల్‌లో పుదుచ్చేరిలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. ఆయనకు పూజలు , హోమాలుపై నమ్మకం ఎక్కువ. గురువుల మాటకు విలువిచ్చేవాడు. దీనినే ప్రతిపక్షాలు ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. గురువు అప్పా పైతియం స్వామి అంటే రంగస్వామికి తిరుగులేని గురి. 2000లో పైతియం స్వామి జీవసమాధి చెందారు. ఆయన సమాధి నుంచే సూచనలు స్వీకరిస్తున్నానని రంగస్వామి చెప్పుకోవడం గమనార్హం.

No comments:

Post a Comment