Tuesday, 3 May 2016

ప్రపంచంలోనే అత్యంత విలువైన హోప్ డైమండ్ మనదే...

మనోళ్లు పట్టించుకోని ‘కోహినూర్‌’లు ఎన్నో...

 
కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తెస్తామంటూ భారత ప్రభుత్వం ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికితోడు అసలు కోహినూర్ వజ్రం మనదేనంటూ, దీనిపై పూర్తి విచారణ చేయాలంటూ పాకిస్తాన్ కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలయింది. బ్రిటన్ రాణి కిరీటంలో పొదిగి ఉన్న ఈ అమూల్యమైన వజ్రం ఎవరిదనే విషయం పక్కనపెడితే అసలు భారత్‌కు చెందిన ఇలాంటి కళాఖండం కోహినూర్ మాత్రమేనా..? ఇంకా లేవా..? అనే విషయం ఆరా తీస్తే ఎన్నో నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌కు చెందిన ఎన్నో కళాఖండాలు విదేశీ మ్యూజియాల్లో ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో కొన్నింటిని వెనక్కి రప్పించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. అవేంటో చూద్దామా...?

  
సుల్తాన్ గంజ్ బుద్ధుడి విగ్రహం గురించి తెలిసినవాళ్లను వేళ్లపై లెక్కించుకోవచ్చు. భారత్‌కు చెందిన ఈ విగ్రహం ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ మ్యూజియంలో కొలువుతీరి ఉంది. పూర్తిగా మార్బుల్‌తో రూపొంది ఒకప్పుడు మధ్యప్రదేశ్‌లోని భోజ్షాలోని గుడిలో పూజలందుకున్న సరస్వతీ దేవి విగ్రహం ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఉంది. ఈ విగ్రహాన్ని వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సింహముఖ కలి విగ్రహాన్ని చూసిన వాళ్లు తక్కువగానే ఉంటారు. చెన్నైలోని విర్ధగిరీశ్వర్ గుడిలో పూజలందుకున్న ఈ విగ్రహాన్ని ఓ దొంగ విదేశీయుల పంచన చేర్చాడు. ప్రస్తుతం ఈ విగ్రహం ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీలో ప్రదర్శనలో ఉంది. మయూరాసన సింహాసనం అని చెప్పుకునే నెమలి సింహాసనం మొఘల్ రాజుల కాలంలో విశేషంగా ఆకట్టుకుంది. రాజులు కూర్చునే ఈ సింహాసనం ఏ రీతినో... రెడ్‌పోర్ట్‌కు చేరింది. 1739లోనే పెర్షయన్ రాజు నాదిర్ షాహ్ దీన్ని తరలించుకుపోయాడని చెప్పుకుంటుంటారు.
 
అమరావతి చిహ్నాల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. గుంటూరులోని అమరావతిలో బయటపడ్డ ఈ చిహ్నాలను బ్రిటీష్ రాజు తరలించుకుపోయి మొదట చెన్నై మ్యూజియంలోనూ ఆ తర్వాత 1853లో లండన్‌కు చేర్చారు. ప్రస్తుతం అవి బ్రిటీష్ మ్యూజియంలో ఉన్నాయి. చత్రపతి శివాజీ వీర ఖడ్గం ‘భవానీ తల్వార్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొల్హాపూర్ దివాన్ మహదేవో భర్వే.. 1875లో ఎడ్వర్డ్ రాజుకు బహుమతిగా ఈ ఖడ్గాన్ని ఇచ్చాడని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది లండన్‌లోని రాయల్ అల్బెర్ట్ మ్యూజియంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా చెప్పుకునే హోప్ డైమండ్ గురించి తెలిసిన వాళ్లు తక్కువే. 45.52 క్యారెట్ల ఈ వజ్రం నీలిరంగులో ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గుంటూరులోనే తవ్వకాల్లో బయటపడ్డ ఈ వజ్రం ప్రస్తుతం వాషింగ్టన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో ఉంది.

No comments:

Post a Comment