Wednesday, 1 June 2016

పెరిగిన సబ్సిడీయేతర ఎల్పీజీ ధర

     దిల్లీ: సబ్సిడీయేతర ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.21, విమాన ఇంధనం ధర 9.2శాతం పెంచుతూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో వరసగా నాలుగో నెలా ధరలు పెరిగాయి.
     సబ్సిడీయేతర ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.21 పెరిగింది. దీంతో దిల్లీలో 14.2 కేజీల సిలిండర్‌ ధర ఇప్పటి వరకు రూ.527.50గా ఉండగా పెంపుతో అది రూ.548.50కి చేరింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. రాష్ట్రాల వ్యాట్ల ఆధారంగా ఈ ధర రాష్ట్రాల వారీగా వేరు వేరుగా ఉంటుంది.
విమాన ఇంధనం ధర 9.2శాతం పెరగడంతో దిల్లీలో దాని ధర కిలో లీటరు రూ.46,729.48కి చేరింది. ఎయిర్‌పోర్టులు ఉన్న ప్రాంతాల్ని బట్టి రాష్ట్రాల్లో దీనిపై వ్యాట్‌ వేరు వేరుగా ఉంటుంది. దీంతో దేశంలో ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. విమాన ఛార్జీలపైనా ఈ పెంపు ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ విమానయాన సంస్థా ఈ విషయమై మాట్లాడలేదు.
ముఖ్య చమురు సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, భారత్‌ పెట్రోలియంలు నెల నెలా అంతర్జాతీయ మార్కెట్లలో ధరల ఆధారంగా దేశీయ ధరల్లో మార్పు చేర్పులు చేస్తాయి.అందులో భాగంగానే వీటి ధరలు పెరిగాయి.

No comments:

Post a Comment