Sunday, 25 September 2016

పండగల పూట.. ఈ-కామ్ ఆఫర్ల వరద...


పండగల సీజన్‌ దగ్గర పడుతోంది. దేశంలో పెద్ద పండగలైన దసరా, దీపావళి ఈసారి అక్టోబర్‌ నెలలోనే వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇ-కామర్స్‌ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పకడ్బందీ ఆఫర్లతో సిద్ధమయ్యాయి. సంవత్సర కాల స్తబ్దత తీరేలా ఇదే నెలలో పెద్ద ఎత్తున అమ్మకాలను పెంచుకోవాలన్నది ఇ-కామ్‌ దిగ్గజాల ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తమ ప్రత్యేక సేల్‌ గురించి కంపెనీలు ప్రచారం మొదలుపెట్టాయి...
 
ఇ-కామ్‌ రంగంలో ప్రధాన కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలు అక్టోబర్‌లో పెద్ద ఎత్తున ఆఫర్లను ఇవ్వనున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరుతో అమ్మకాల ను నిర్వహించనుంది.

ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ఆఫర్‌ చేయడంతోపాటు వేగవంతంగా డెలివరీ చేయనున్నట్టు సం స్థ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్స్‌, పీసీలు, మ్యూజికల్‌ ఇన్‌స్ర్టూమెంట్లు, స్టేషనరీ ఉత్పత్తులు, పుస్తకాలు, బేబీ కేర్‌ ఉత్పత్తులు, బొమ్మలు, దుస్తులు, యాక్సెసరీలు, షూస్‌, బ్యూటీ ఉత్పత్తులు వంటి వాటిపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఉత్పత్తులను తొందరగా డెలివరీ చేయడానికి ఉపయోగపడే 24 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఈ సంస్థకు ఉన్నాయి. డిసెంబర్‌ లోపే మరో 3 సెంటర్లను కూడా ప్రారంభించడానికి అమెజాన్‌ సన్నద్ధమవుతోంది. వీటి ద్వారా త్వరగా ఉత్పత్తులను డెలివరీ చేసే అవకాశం ఏర్పడుతుంది. పండగల సీజన్‌లో పోటీ కంపెనీల మార్కెట్‌ వాటాను కూడా హస్తగతం చేసుకోవాలనుకుంటోంది.
 
ఇక ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహించనుంది. కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, భారీ అప్లయెన్సె్‌సపై ఎలాంటి అదనపు భారం లేని ఈఎంఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ‘బిగ్‌ బిలియన్‌ డే’ సేల్‌ సందర్భంగా అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు తప్పనిసరి పరిస్థితిగా మారిపోయింది. కొత్త కస్టమర్లను ఆకర్షించి విక్రయాలను పెంచుకుంటే కంపెనీ మరిన్ని నిధులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడనుంది. మరో ఇ-కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ ‘అన్‌బాక్స్‌ దీవాళి సేల్‌’ పేరుతో అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమ్మకాలను నిర్వహించనుంది. హోమ్‌ అప్లయెన్సెస్‌, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్స్‌, హోమ్‌ ఫర్నీషింగ్‌, ఫర్నీచర్‌, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలను ఈ సంస్థ ఆఫర్‌ చేయనుంది. వివిధ ఉత్పత్తులపై గంటల వారీగా అమ్మకాలను సంస్థ నిర్వహించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేయనుంది.
 
అమ్మకాలపై ప్రభావం.. 

 పెద్ద ఎత్తున ఆఫర్లుంటాయని ఇ-కామర్స్‌ సంస్థలు చెబుతున్నప్పటికీ ఈసారి అమ్మకాలపై ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వరాదన్న పారిశ్రామిక విధానం, ప్రమోషన్‌ విభాగం (డిఐపిపి) మార్గదర్శకాల నేపథ్యంలో ఆఫర్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయినప్పటికీ పండగల సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయన్న ఆశతో డెలివరీ, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలు పెంచుకోవడానికి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు క్షీణించడంతో ఇ-కామ్‌ కంపెనీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీల విక్రయాలు 19 శాతం మేర తగ్గ గా.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు 5-10 శాతం క్షీణించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పండగల సీజన్‌పైనే కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి.

No comments:

Post a Comment