Friday, 30 September 2016

ఆ విమర్శలకు సెహ్వాగే కారణం: గంగూలీ

వేగంగా పరుగులు చేసే సంస్కృతికి వీరూ, హెడేన్‌ ఆద్యులు
కోల్‌కతా: ఇప్పటి తరం టెస్ట్‌ క్రికెట్‌ ఓపెనర్లకు ఎదురవుతున్న విమర్శలన్నిటికీ భారత డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఒకప్పటి ఆసీస్‌ ఓపెనర్‌ మాథ్యూ హెడేన్‌ కారణమని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చమత్కరించాడు. ఈ ఇద్దరు ఓపెనర్లూ టెస్టుల్లో అత్యంత వేగంగా పరుగులు రాబడుతూ భారీ స్కోర్లు నమోదు చేసే సంస్కృతికి ఆద్యులని పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుత ఓపెనర్లు వేగంగా, భారీ స్కోర్లు నమోదు చేయకపోతే విమర్శల పాలవుతున్నారని వివరించాడు. ‘వేగంగా పరుగులు చేయలేక విమర్శల పాలవుతున్న ప్రస్తుత ఓపెనర్లను చూడండి. ఈ సంస్కృతిని మొదలు పెట్టింది వీరేంద్ర సెహ్వాగ్‌, మాథ్యూ హెడేన్‌. జస్టిన్‌ లాంగర్‌ సైతం ఇదే కోవలోకొస్తాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌ నిర్వచనం మార్చింది మాత్రం ఆ ఇద్దరేనని’ గంగూలీ చెప్పాడు. వీరూతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ముందు తాను కాస్త డిఫెండ్‌ చేస్తే భారీ స్కోరు వస్తుందని చెప్పేవాడినని అయితే ఆ తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని దాదా చెప్పాడు. ఆటగాళ్లు వారికిష్టమైనట్లు ఆడడమే మంచిదని తెలుసుకున్నట్లు పేర్కొన్నాడు.
సెహ్వాగ్‌ స్పందిస్తూ విజయవంతమైన ఆటగాడి వెనక విజయవంతమైన కెప్టెన్‌ మద్దతుండాలని అభిప్రాయ పడ్డాడు. ‘నావెన్నంటే నా కెప్టెన్‌ (గంగూలీ) వుండటంతో నేనెప్పుడూ భయపడలేదు. రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ తెందుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, ఎంఎస్‌ ధోనీ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌ నా వెనకాల వస్తారని తెలుసని’ సెహ్వాగ్‌ చెప్పాడు. ‘ఇంగ్లాండ్‌లో కఠిన పరిస్థితుల్లో గంగూలీ నా దగ్గరికి వచ్చి తాను నాతో ఉన్నాడని చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. కొంతమంది ఆటగాళ్లకు కొందరు సారథుల ప్రోత్సాహం వుండాలని’ వీరూ పేర్కొన్నాడు.

No comments:

Post a Comment