Thursday, 15 September 2016

మరణశిక్షని ఏడేళ్ల జైలుశిక్షగా మార్చారు

ఐదేళ్ల క్రితం కదులుతున్న రైలులో అత్యాచారానికి గురై, ఆ తర్వాత రైలులోనుంచి తోసివేయగా తీవ్రంగా గాయపడి మృతిచెందిన సౌమ్య కేసు గుర్తుందా? కేరళకు చెందిన ఆ సౌమ్య కేసులో దోషికి శిక్ష తగ్గించింది ఉన్నత న్యాయస్థానం. ఈ కేసులో దోషిగా తేలిన గోవిందచామికి మరణశిక్ష విధిస్తూ కింది కోర్టులు తీర్పు చెప్పగా.. దాన్ని ఏడేళ్ల జైలు శిక్షకు తగ్గిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది.
కోచిలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేసే 24ఏళ్ల సౌమ్య 2011, ఫిబ్రవరి 1న రైలులో అత్యాచారానికి గురైంది. సౌమ్య ఎర్నాకులం నుంచి శొరనూర్‌కు రైలులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సౌమ్యపై గోవిందచామి అనే వ్యక్తి దాడి చేశాడు. తొలుత దొంగతనానికి వచ్చిన నిందితుడు సౌమ్యపై అత్యాచారం చేశాడు. అనంతరం కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న సౌమ్య మరణించింది.
దీంతో గోవిందచామిపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. నేరచరిత్ర గల అతడు ఈ కేసులోనూ దోషిగా తేలడంతో 2012లో త్రిశూర్‌లోని ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు గోవిందచామికి మరణశిక్ష విధించింది. ఈ తీర్పును కేరళ హైకోర్టు కూడా సమర్థించి.. నిందితుడి మరణశిక్షను ఖరారుచేసింది. అయితే కింది కోర్టుల తీర్పుపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. గురువారం దీనిపై విచారణ జరిగింది.
సౌమ్యపై గోవిందచామి అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్‌ రుజువుచేసింది. అయితే రైలులో నుంచి తోసేశాడని నిరూపించడంలో విఫలమైంది. దీంతో హత్యకేసును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు.. అతడి మరణశిక్షను తగ్గించింది. అత్యాచారం కేసు కింద గోవిందచామికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. అయితే ఇప్పటికే 5 సంవత్సరాల ఏడు నెలల జైలుశిక్షను పూర్తిచేసుకున్న గోవిందచామి.. ఈ తీర్పుతో మరో 16 నెలల్లో జైలునుంచి విడుదల కానున్నాడు.

No comments:

Post a Comment