Friday, 16 September 2016

సిద్ధార్థ : రివ్యూ

సినిమాపేరు: సిద్ధార్థ
తారాగణం: సాగర్‌.. రాగిణి నంద్వాని.. సాక్షి చౌదరి.. కోట శ్రీనివాసరావు.. అజయ్‌.. సుబ్బరాజు.. సన.. తాగుబోతు రమేష్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
మాటలు: పరుచూరి బ్రదర్స్‌
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్‌
సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి
దర్శకత్వం: కె.వి.దయానంద్‌రెడ్డి
సంస్థ: రామదూత క్రియేషన్స్‌
విడుదల: 16-09-2016

బుల్లితెరతో ఇంటింటికీ చేరువైన నటుడు సాగర్‌. ఆయన కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారనగానే టీవీలకి అతుక్కుపోయే కుటుంబ ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరిచారు. నిజంగానే అలాంటి నటుడు సరైన కథ ఎంచుకొని సినిమా చేస్తే ఇంటిల్లిపాదీ కలిసి థియేటర్‌కి వచ్చే అవకాశముంటుంది. మరి సాగర్‌ నటించిన ‘సిద్ధార్థ’ ఆ స్థాయిలోనే ఉందా? బుల్లితెరపై నటించి అందరినీ అలరించిన సాగర్‌ వెండితెరపై కూడా అదే జోరు కనబరిచాడా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: మలేషియా వెళుతూ విమానంలో సహస్ర (రాగిణి నంద్వాని)ని చూస్తాడు సిద్ధార్థ్‌(సాగర్‌). తొలి చూపులోనే ఆమెపై ప్రేమ పెంచుకొంటాడు. ద్వేషం చేసిన గాయం ప్రేమతోనే మాయమవుతుందని.. ఆ ప్రేమే సహస్ర అని నమ్ముతాడు. మలేషియాలో రేడియా జాకీగా పనిచేసే సహస్ర కూడా సిద్ధార్థ్‌ని ప్రేమిస్తుంది. అతని వల్ల గర్భవతి అవుతుంది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోవాలనుకొంటారు. ఇంతలో అనుకోకుండా సిద్ధార్థ ఇండియా వెళ్లాల్సి వస్తుంది. అతను వెళ్లిపోగానే సిద్ధార్థ ఓ హత్య చేసి మలేషియాకి వచ్చాడని.. అతని అసలు పేరు సూర్య అని సహస్రకి తెలుస్తుంది.
తాను దూరమైతేనే సూర్య ప్రాణాలతో మిగులుతాడన్న విషయం సహస్రకి తెలుస్తుంది. దీంతో తన కడుపులో ఉన్న బిడ్డతోనే సూర్యకి దూరంగా వెళ్లిపోతుంది. ఇంతకీ సూర్య.. సిద్ధార్థగా ఎందుకు మారాల్ని వచ్చింది? సహస్ర.. సూర్య కలిశారా? లేదా? వీళ్లిద్దరి మధ్యకి అప్సర (సాక్షి చౌదరి) ఎలా ప్రవేశించింది? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే?: రెండు కుటుంబాల మధ్య పగ.. ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. 90వ దశకం నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ తరహా కథల్ని చూస్తూనే ఉన్నారు. తరాలుగా కక్షలు, కార్పణ్యాలున్నప్పటికీ శత్రువు కుటుంబంతో సంబంధం కలుపుకోవడం.. ఆ తర్వాత తీరిగ్గా పగ.. ప్రతీకారాల్ని తీర్చుకోవాలని వ్యూహం పన్నడంలాంటి కథలతో ఇప్పటికే బోలెడన్ని చిత్రాలు తెరకెక్కాయి. మరోసారి అదే కథని నమ్ముకొన్నారు కె.వి.దయానంద్‌రెడ్డి. బహుశా సాగర్‌కి బుల్లితెరతో వచ్చిన గుర్తింపే ఈ తరహా కథని తెరకెక్కించడానికి కారణమైందేమో. అయితే ఆ కథకైనా కొత్త కలరింగు ఇవ్వాల్సింది. దర్శకుడు ఆ పని చేయలేదు. ఫార్ములాను ఉన్నదున్నట్టు తీశాడు. దీంతో ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడి వూహకి తగ్గట్లే సాగుతుంది. కథానాయకుడి హావభావాలు సీరియల్‌ నటననే గుర్తుకు తెప్పించే పరిస్థితి. ఎమోషనల్‌ సన్నివేశాల్లో మాత్రం సాగర్‌ నటన ఆకట్టుకుంటుంది.
సిద్ధార్థ.. సహస్రల మధ్య ప్రేమ సన్నివేశాల్ని బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. లవ్‌.. రొమాన్స్‌.. కుటుంబ కక్షలు ప్రధానంగా కథని తీర్చిదిద్దారు. వీటిలో రొమాన్స్‌ మినహా మిగతా అంశాలేవీ పండలేదు. తెరపై సన్నివేశాలు మాత్రం రిచ్‌గా అనిపిస్తుంటాయి. హంగులు.. ఆర్భాటాలు ఎక్కువే. కథ విషయంలో శ్రద్ధ చూపిస్తే బాగుండేది. ప్రధమార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలోనే కథంతా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?: తొలి సినిమానే అయినా సాగర్‌కు మంచి మార్కులే పడతాయి. అయితే.. సీరియల్‌ నటనకీ.. సినిమాకీ కాస్త తేడా ఉంటుందని గుర్తించాల్సిన అవసరం ఉంది. సహస్రగా రాగిణి నంద్వాని తన పరిధి మేర నటించింది. అందంతో ఆకట్టుకుంటూ.. భావోద్వేగాల పరంగా పాస్‌ అయింది. హద్దులేమీ లేవంటూ ముద్దు సన్నివేశాల్లోనూ మెరిసింది. మరో కథానాయిక సాక్షి చౌదరి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. అజయ్‌.. సుబ్బరాజు.. కోట శ్రీనివాసరావు.. రణదీప్‌ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. సత్యం రాజేష్‌.. తాగుబోతు రమేష్‌ గ్యాంగ్‌ ద్వితీయార్థంలో పండించే నవ్వులు కాస్తలో కాస్త రిలీఫ్‌. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. ఎస్‌.గోపాల్‌రెడ్డి మలేషియా లొకేషన్లను కొత్తగా చూపించారు. మణిశర్మ సంగీతం బాగుంది. ప్రవీణ్‌ పూడి కత్తెరకి మరింత పదును పెట్టాల్సింది. సినిమా 2 గంటల 6 నిమిషాలే అయినా చాలా సన్నివేశాలు భారంగా సాగుతున్నట్టు అనిపిస్తాయి.
బలాలు
+ నటీనటులు
+ సాంకేతికత
+ ద్వితీయార్థం
బలహీనతలు
- పాత కథ
- వేగం లేకపోవడం
చివరగా.. సీరియల్‌లాంటి సినిమా.. సిద్ధార్థ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

No comments:

Post a Comment