Sunday, 14 August 2016

కృష్ణమ్మ చెంత... భక్తుల పులకింత

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా తీరంలోని ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9గంటల వరకు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 6,86,742మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు అధికారులు తెలిపారు.
విజయవాడలోని దుర్గాఘాట్‌, పవిత్ర సంగమం, కృష్ణవేణి, పద్మావతి, పున్నమి ఘాట్‌లకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అనంతరం భక్తులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది. ఆదివారం వేకువజాము నుంచి 11గంటల వరకు సుమారు 90వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణని మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బీచుపల్లి, సోమశిల, మట్టపల్లి, అలంపూర్‌, నది అగ్రహారం, వాడపల్లి, గొందిమళ్ల ఘాట్లకు భక్తులు పోటెత్తారు.


 

No comments:

Post a Comment