Thursday, 4 August 2016

డ్రైవరూ జాగ్రత్త!

    మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు, వాహనంతో ఢీకొట్టి పారిపోతే రూ.2 లక్షల జరిమానా విధించే మోటారు వాహన (సవరణ) బిల్లు-2016కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ.10 లక్షల పరిహారాన్ని అందించే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. రోడ్లను సురక్షితంగా మార్చేందుకు, లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు ఈ బిల్లు ఓ చరిత్రాత్మక అడగు అని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 రాష్ర్టాల రవాణా మంత్రుల సిఫారసుల ఆధారంగా ఈ ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు.
-నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా
-మోటారు వాహన చట్టం సవరణ బిల్లుకు ఆమోదం
-వచ్చేవారం పార్లమెంట్ ముందుకు
-కేంద్ర పథకాలు ఇక 30 దాటవు
-కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయాలు

అతి వేగానికి రూ.1000 నుంచి రూ.4 వేల వరకు జరిమానా విధించే అంశం ఈ బిల్లులో ఉందని తెలిపారు. ప్రస్తుత మోటారు వాహన చట్టంలో 223 సెక్షన్లు ఉన్నాయని, వాటిలో 68 సెక్షన్లను ఈ బిల్లు సవరించనుందని, కొత్తగా 28 సెక్షన్లను చేర్చనుందని చెప్పారు. రోడ్డు భద్రత, గ్రామీణ రవాణా వ్యవస్థ బలోపేతం, చివరి గ్రామం వరకూ రవాణా సదుపాయం, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ సేవలను ఈ బిల్లు ప్రతిపాదిస్తున్నదని గడ్కరీ చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను 50 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఈ బిల్లును వచ్చేవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతామని, అన్ని పార్టీలు మద్దతునివ్వాలని గడ్కరీ విజ్ఞప్తి చేశారు.


కేంద్ర ప్రాయోజిత పథకాలు ఇక 30 దాటవు 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకా (సీఎస్సెస్)ను హేతుబద్ధం చేయాలన్న ముఖ్యమంత్రుల కమిటీ సిఫారసులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర పథకాలను ఇకపై 30కి మించకుండా చూడాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. అలాగే కేంద్ర పథకాలకు ఫ్లెక్సీ నిధులను 25 శాతానికి పెంచాలన్న సిఫారసులకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే 75 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆదాయ వనరులుగా మార్చుకొనేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. ఆహారధాన్యాల సేకరణకు జనపనార సంచుల కొనుగోలు నుంచి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లయిస్, డిస్పోజల్స్ సంస్థను తొలగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. నవంబర్ నుంచి జౌళి శాఖ ఆ సంచులను కొనుగోలు చేస్తుంది. అంబేద్కర్ స్మారక చిహ్నం నిర్మాణానికి జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్‌కు చెందిన 12 ఎకరాల భూమిని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లావో పీపుల్స్ రిపబ్లిక్ దేశంతో వాయు సేవల ఒప్పందం (ఏఎస్‌ఏ)పై సంతకం చేసేందుకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

No comments:

Post a Comment