'కబాలి' రజనీ ఫీవర్ ఇంకా
తగ్గుముఖం పట్టినట్టు లేదు. తలైవర్ రజనీకాంత్కు ఉన్న
క్రేజ్..సినిమాకొచ్చిన నెగిటివ్ టాక్ను కూడా అధిగమించి బాక్సాఫీస్
కలెక్షన్లు షేక్ చేస్తూ రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఆ మాటెలా ఉన్నా
'కబాలి' రిలీజ్ తర్వాత మళ్లీ రజనీకాంత్కు పుదిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
కిరణ్ బేడీ నుంచి బహిరంగ ఆహ్వానం వెళ్లింది. తాను చేపట్టిన 'ప్రోస్పరర్
పుదుచ్చేరి' ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలని ఆదివారంనాడు
మరోసారి రజనీకాంత్కు ఆమె ప్రపోజ్ చేశారు. ఈ ఏడాది మే 29 పదవీ బాధ్యతలు
చేపట్టిన కిరణ్ బేడీ...పుదుచ్చేరి అభ్యున్నతే లక్ష్యంగా చురుగ్గా ప్రజలను
చైతన్యవంతులను చేసేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పరిసరాల్లో
చెత్తాచెదారం ఏరివేతకు ఆదివారం చేపట్టిన డ్రైవ్లో మున్సిపల్ వర్కర్స్ను
బేడీ ఉత్సాహపరుస్తూ అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి
అభ్యున్నతి కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు రజనీ ముందుకు రావాలంటూ ఆమె
పిలుపునిచ్చారు. గతంలోనూ ట్విట్టర్లో బేడీ రజనీకి ఇదే రిక్వెస్ట్ చేశారు.
అయితే ఆ సమయంలో రజనీ విదేశాల్లో ఉన్నారు. ఇటీవల 'కబాలి' చిత్రం రిలీజ్
సమయంలోనూ కిరణ్ బేడీ ఆ చిత్రం టిక్కెట్లు ఉచితంగా సెల్లిపేట్ గ్రామస్థులకు
పంపిణీ చేయించారు. ప్రధాని మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్'లో భాగంగా
తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకున్న 147 మంది గ్రామస్థులకు కలెక్టర్
సారథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ టిక్కెట్లు అందజేశారు.

No comments:
Post a Comment