Sunday, 31 July 2016

కబాలి రా...అంటున్న గవర్నర్..!

'కబాలి' రజనీ ఫీవర్ ఇంకా తగ్గుముఖం పట్టినట్టు లేదు. తలైవర్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్..సినిమాకొచ్చిన నెగిటివ్ టాక్‌ను కూడా అధిగమించి బాక్సాఫీస్ కలెక్షన్లు షేక్ చేస్తూ రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఆ మాటెలా ఉన్నా 'కబాలి' రిలీజ్ తర్వాత మళ్లీ రజనీకాంత్‌కు పుదిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ నుంచి బహిరంగ ఆహ్వానం వెళ్లింది. తాను చేపట్టిన 'ప్రోస్పరర్ పుదుచ్చేరి' ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని ఆదివారంనాడు మరోసారి రజనీకాంత్‌కు ఆమె ప్రపోజ్ చేశారు. ఈ ఏడాది మే 29 పదవీ బాధ్యతలు చేపట్టిన కిరణ్ బేడీ...పుదుచ్చేరి అభ్యున్నతే లక్ష్యంగా చురుగ్గా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పరిసరాల్లో చెత్తాచెదారం ఏరివేతకు ఆదివారం చేపట్టిన డ్రైవ్‌లో మున్సిపల్ వర్కర్స్‌ను బేడీ ఉత్సాహపరుస్తూ అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాండిచ్చేరి అభ్యున్నతి కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు రజనీ ముందుకు రావాలంటూ ఆమె పిలుపునిచ్చారు. గతంలోనూ ట్విట్టర్‌లో బేడీ రజనీకి ఇదే రిక్వెస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో రజనీ విదేశాల్లో ఉన్నారు. ఇటీవల 'కబాలి' చిత్రం రిలీజ్ సమయంలోనూ కిరణ్ బేడీ ఆ చిత్రం టిక్కెట్లు ఉచితంగా సెల్లిపేట్ గ్రామస్థులకు పంపిణీ చేయించారు. ప్రధాని మోదీ చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్‌'లో భాగంగా తమ ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకున్న 147 మంది గ్రామస్థులకు కలెక్టర్ సారథ్యంలో రెవెన్యూ సిబ్బంది ఈ టిక్కెట్లు అందజేశారు.

No comments:

Post a Comment