Monday, 25 July 2016

ఛార్జింగ్‌ అలా పెట్టొద్దు


స్మార్ట్‌ఫోన్లు.. ట్యాబ్లెట్లు వచ్చాక అందరూ ఎదుర్కొంటున్న సమస్య బ్యాటరీ ఛార్జింగ్‌. ‘‘ఫోన్‌ కొని నాలుగు నెలలే అయ్యింది.. అప్పుడే బ్యాటరీ పాడైపోయింది. నాసిరకం బ్యాటరీ. ఛార్జింగ్‌ నిండా నింపినా.. కనీసం రెండు గంటలైనా రావడంలేదు’’ అంటూ చాలామంది విసుక్కుంటారు. అయితే.. ఇలా ఫోన్‌లోని బ్యాటరీ బ్యాకప్‌ తగ్గడానికి, త్వరగా చెడిపోవడానికి నాసిరకమే కాదు.. మనలోనూ మార్పు రావాల్సిన అవసరముందంటున్నారు టెక్‌ నిపుణులు. మార్పు అంటే అందుకు కష్టపడాల్సిందేమీ ఉండదు. ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అందుకు స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ క్యాడెక్స్‌కు చెందిన ‘బ్యాటరీ యూనివర్సిటీ’ కొన్ని సూచనలు చేస్తోంది. అవేంటో చూద్దాం.
1. బ్యాటరీలూ ఒత్తిడికి గురవుతాయి
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టేసి.. ఉదయం లేచిన తర్వాత తీస్తారు. అది ఏ మాత్రం మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్లలో వాడే లిథియం అయాన్‌ బ్యాటరీలు చాలా సున్నితమైనవి. ఎప్పుడూ ప్లగ్‌ పెట్టి ఉంచితే.. ఈ బ్యాటరీలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దాంతో త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ ప్లగ్‌ను అలాగే ఉంచడం మానుకోండి.
2. వంద శాతం అక్కర్లేదు
లిథియం అయాన్‌ బ్యాటరీలను పూర్తిగా నింపడం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. 100శాతం నిండినప్పుడు ఓల్టేజీ అధికమై బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుందట.
3. కొద్ది కొద్దిగా..
ఒకేసారి పూర్తిగా నింపకుండా సాధ్యమైనంత మేరకు అప్పుడప్పుడు ఛార్జింగ్‌ పెడుతూ ఉండాలి. అలా ఒకేసారి నింపినా.. 100శాతానికి దగ్గరగా రాగానే ఆపేయాలి. ఇలా చేస్తే బ్యాటరీ బ్యాకప్‌ మెరుగుపడుతుందట.
4. కూల్‌గా ఉంచండి
స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీలు చాలా సున్నితమైనవి. వేడి తగిలితే పేలిపోయే ప్రమాదముంది. అందుకే ఎప్పుడూ ఫోన్‌ను కూల్‌ ఉండేలా చూసుకోవాలి. ఫోన్‌ను పూర్తిగా కవర్‌ చేసే కేస్‌లు వాడకుండా ఉంటే మంచిది.
స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బ్యాటరీల మన్నిక పెరగడంతోపాటు.. బ్యాకప్‌ కూడా మెరుగుపడుతుంది.

No comments:

Post a Comment