Wednesday, 20 July 2016

‘చిక్కు’ముళ్లు విప్పేద్దాం!

మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌ లక్ష్యం
ఆటోలు.. బస్సుల పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి 
వాహనాల వరద... ట్రాఫిక్‌ చిక్కులు... నిమిషాల తరబడి జాం... పాదచారుల అవస్థలు... నగరంలో అస్తవ్యస్తంగా కొనసాగుతున్న ఈ పరిస్థితిపై జీహెచ్‌ంఎసీ, పోలీసు శాఖలు సంయుక్తంగా దృష్టి సారించాయి. దిల్‌సుఖ్‌నగర్‌-కోఠి, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌-మెహిదీపట్నం, సికింద్రాబాద్‌-మాదాపూర్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు పోలీస్‌ కమిషనర్‌(ట్రాఫిక్‌) జితేందర్‌లు ఇటీవల సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్ల సమీపంలోని బస్‌స్టాప్‌ల వద్ద ట్రాఫిక్‌ జాంలు ఏర్పడకుండా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌లను ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నారు. ఆటోలు, బస్సులు, కార్ల ద్వారానే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది వివరించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
చివరి స్టాప్‌లతోనే ఇబ్బందులు... ఆర్టీసీ ప్రయాణికులు, ప్రజల అవసరాలను పరిగణనలోని తీసుకుని రెండు, మూడు దశాబ్దాల క్రితం జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు చివరి బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ రేతిఫైల్‌, జూబ్లీబస్‌ స్టేషన్‌, కోఠి¸, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నంలను బస్‌ టెర్మినళ్లుగా నిర్ణయించారు. అప్పట్లో వాటిని దాటి వెళ్లే ప్రయాణికులు, ప్రజలు లేకపోవడంతో అవి సరిపోయాయి. మెహిదీపట్నం తర్వాత సిటీ బస్సులను నడిపినా... వెళ్లేందుకు ప్రయాణికులు ఉండేవారు కాదు. పాతబస్తీ, సికింద్రాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు కోఠి¸లో దిగి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. నగరంలో ఇతర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ వద్ద ఆగేవి. హైదరాబాద్‌, ఇతర జిల్లా నుంచి వచ్చే ప్రజలు, ప్రయాణికుల సంఖ్య, అవసరాల దృష్ట్యా బస్‌ టెర్మినళ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు, ప్రయాణికులు పెరుగుతున్నా అవి మాత్రం మారలేదు.
ఆటోలు.. బస్సుల నుంచే ఇబ్బందులు
నగరంలోని ప్రధాన ప్రాంతాలు, ప్రయాణికులు, ప్రజలు రాకపోకలు కొనసాగించే మార్గాల్లో బస్‌స్టాప్‌లు, బస్‌స్టాప్‌ల వద్ద ఎక్కువగా సమస్యలొస్తున్నాయని జీహెచ్‌ంఎసీ, ట్రాఫిక్‌ ఉన్నతాధికారుల పర్యటనలో తేలింది. బస్‌స్టాప్‌లో బస్సులు సక్రమంగా నిలపక పోవడం, వాటివెంటే ఆటోలు ఉండటంతో కార్లు, ద్విచక్ర వాహనాలు వాటి వెనుక ఆగిపోతున్నాయని గుర్తించారు. దీంతోపాటు ఏఎస్‌రావ్‌నగర్‌, మలేసియా టౌన్‌షిప్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌డిపో వెనుక ప్రాంతాలు, మెట్రోరైల్‌కు అనుసంధానంగా ఉండే రోడ్డు మార్గాల్లో వెళ్లే బస్సులకోసం ఎక్కువగా ప్రయాణికులు ఉంటున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో సెవెన్‌ సీటర్లు, ఆటోలు అక్కడ తిష్ఠ వేస్తున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, రాయదుర్గం, గోల్కొండ వంటి ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాలకు బస్సుల రాకపోకలకన్నా ఆటోలు, సెవెన్‌ సీటర్లు ఎక్కువగా ఉంటున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లలో ప్రస్తుతం వస్తున్న బస్సులు, వాటి రూట్లను పరిశీలించి కొద్దిరోజుల్లో పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రత్యామ్నాయాలపై ఆర్టీసీ అధికారులతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ అధికారులు చర్చించనున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఆటోస్టాండ్లను మారిస్తేనే ట్రాఫిక్‌ సజావుగా కొనసాగే అవకాశాలున్నాయి.

ఒకచోటి నుంచి మరో చోటికి...
చివరి బస్‌స్టాప్‌లను దాటి జనావాసాలు పెరగడం, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు రావడంతో నగరం నలుమూలల నుంచి 25 కిలోమీటర్ల వ్యాసార్థం(రేడియస్‌)లో ప్రయాణికులతోపాటు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో రద్దీ పెరిగిపోతోంది. సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, కూకట్‌పల్లి సహా వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌కు వెళ్లాలంటే దిల్‌సుఖ్‌నగర్‌లో దిగి సెవెన్‌ సీటర్‌ ఆటో లేదా మరో బస్సును ఆశ్రయించాల్సిందే. మెహిదీపట్నం నుంచి లంగర్‌హౌస్‌, టోలీచౌకి, గచ్చిబౌలి మాదాపూర్‌, లింగంపల్లి వరకూ ప్రయాణికులు నిత్యం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. వీరిలో చాలామంది మెహిదీపట్నంలో బస్‌ దిగి మరో బస్సులో గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, అంబర్‌పేట, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు కోఠి దాటి వెళ్లాలంటే... అక్కడ దిగి ఇంకో బస్సు ఎక్కాల్సి వస్తోంది.

 

No comments:

Post a Comment