Sunday, 31 July 2016

బీబీఎల్‌లో తొలి భారత మహిళా క్రికెటర్‌

మైదానంలో తన బ్యాటింగ్‌ ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంటున్న భారత మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ తరహాలో ఆస్ట్రేలియాలో నిర్వహిస్తున్న మహిళల బిగ్‌బాస్‌ లీగ్‌(బీబీఎల్‌)లోని సిడ్నీ థండర్స్‌ జట్టుకు రానున్న సీజన్‌లో ప్రాతినిథ్యం వహించేందుకు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సంతకం చేసింది. ఇలా ఓ విదేశీ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్‌ ఆడనుండటం ఇదే తొలిసారి. కెరీర్‌లో రెండు టెస్టులు, 55 వన్డేలతో పాటు 61 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన 27 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రస్తుతం మహిళల జట్టు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతోంది. ‘బిగ్‌బాస్‌ లీగ్‌లో ఆడనున్న భారత తొలి మహిళా క్రికెటర్‌ కావడం నాకు చాలా గర్వంగా ఉంది. మహిళా క్రికెటర్లకు నేర్చుకునేందుకు బీబీఎల్‌ సరైన వేదిక. సిడ్నీ థండర్స్‌ జట్టుకు ఆడేందుకు సంతకం చేయడం ఓ మధుర జ్ఞాపకం’ అంటూ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆనందం వ్యక్తం చేసింది. జూన్‌ నెలలోనే బీబీఎల్‌ కోసం కౌర్‌ సంతకం చేసినట్లు వార్తలు వచ్చినా.. అప్పట్లో సిడ్నీ థండర్స్‌ వాటిని ఖండించింది. విదేశీ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్లు ఆడేందుకు ఇటీవలే అనుమతిచ్చిన బీసీసీఐ ఈ నిర్ణయానికి సంబంధించి క్రికెటర్లకు ‘నిరభ్యంతర పత్రం’ జారీ చేయకపోవడంతో కౌర్‌ ఈ ఒప్పందాన్ని అప్పట్లో నిర్ధారించలేదని వార్తలు వచ్చాయి.

No comments:

Post a Comment