Tuesday, 12 July 2016

24 గంటల్లో 190 సెం.మీ వర్షం

  • నాసిక్‌లో కుంభవృష్టి.. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, అసోంలలో కుండపోత
  • 27 మంది మృతి.. వందలాది పశువులు గల్లంతు
           మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో గత 24 గంటల్లో ఏకంగా 1,899 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. దీంతో నాసిక్‌కు ప్రధాన నీటి వనరులైన గంగాపూర్‌, దర్నా డ్యామ్‌లలో నీటి మట్టం 50 శాతానికి పైగా పెరగడంతో గోదావరి నదిలోకి 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు ఓ రైలు పట్టాలు తప్పింది. పలు రాషా్ట్రల్లో కుండపోత వర్షాలకు హైవేలు, లింకు రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దేశవ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడ్డారు. ప్రధాన నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహారాష్ట్రలో సూరత నుంచి నందుర్బర్‌కు వెళ్లే ఓ రైలు పట్టాలు తప్పింది. వరద నీటికి ఐదు బోగీలు ఓ పక్కకు ఒరిగిపోవడంతో కొంత మంది ప్రయాణికులు గాయపడ్డారు. నందుర్బన్‌ ప్రాంతంలోనే వరదలు నలుగురి ప్రాణాలు తీశాయి. కొల్హాపూర్‌, నాసిక్‌ సహా ఉత్తర మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను సైతం ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో మరో నలుగురు గాయపడ్డారు. నర్మదా, తమస్‌, సోనే, మందాకిని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కొండ చరియలు విరుచుకుపడటంతో ఘాట్‌ రోడ్డును మూడు రోజులుగా మూసివేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, జబల్పూర్‌, విదిష జిల్లాల్లో గత 24 గంటల్లో మరో ఏడుగురు చనిపోవడంతో రాష్ట్రంలో వరద మృతుల సంఖ్య 22కు చేరింది. అసోం వరదల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. ఆరు జిల్లాల్లోని 60 గ్రామాల్లో పరిస్థితి సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రలో 1.35 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

No comments:

Post a Comment