Friday, 15 July 2016

కొడుకు ముందే ‘గోల్డ్‌మ్యాన్‌’ దారుణహత్య

పుణె: రూ. కోటి విలువైన బంగారు చొక్కా ధరించి.. ‘గోల్డ్‌మ్యాన్‌’గా వార్తల్లో నిలిచిన పుణెకు చెందిన వ్యాపారవేత్త దత్తాత్రేయ ఫుగె దారుణ హత్యకు గురయ్యారు. పుట్టిన రోజు వేడుకలకని ఆహ్వానించి.. కన్న కొడుకు కళ్ల ముందే దత్తాను కిరాతకంగా రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశారు. అదృష్టవశాత్తు దుండగుల బారి నుంచి ఆయన కుమారుడు తప్పించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పింప్రి-చించ్వాడ్‌ ప్రాంతానికి చెందిన దత్తాత్రేయ స్థానికంగా చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తుంటాడు. బంగారం మీద మోజుతో ఆభరణాలు ధరించడమే కాక బంగారు షర్టు కూడా కుట్టించుకున్న అతడిని అందరూ గోల్డ్‌మ్యాన్‌ దత్తాగా పిలిచేవారు. గురువారం రాత్రి 11.30 సమయంలో దత్తా, ఆయన కుమారుడిని ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించాడు. దత్తా అక్కడకు వెళ్లగానే దాదాపు 12 మంది దుండగులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. అతడి కుమారుడు.. దుండగుల నుంచి తప్పించుకున్నాడు. దత్తా భార్య పింప్రి-చించ్వాడ్‌ మాజీ కార్పొరేటర్‌.
ఆర్థిక వ్యవహారాల కారణంగానే దత్తాను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 1.27కోట్లతో 3.5కేజీల బంగారు చొక్కాను ధరించి 2012లో దత్తా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గోల్డ్‌మ్యాన్‌గా పేరొందారు.

No comments:

Post a Comment