Saturday, 16 April 2016

కాళీ మందిరం నుంచి 300కోట్ల నగదు, 300కేజీల బంగారం మాయం..

అస్సాం డిస్‌పూర్‌లోని టీ గార్డెన్స్‌లో ఉన్న కాళికా మాత మందిరం నుంచి 300కోట్ల రూపాయల నగదు, 300కేజీల బంగారం, నాలుగు ఏకే47 తుపాకులు మాయమయ్యాయి. అవినీతి పోలీసు అధికారుల సాయంతోటే ఈ సంపదంతా మాయమైందంటూ మనోజ్ కుమార్ కౌశల్ అనే మాజీ ఆర్మీ ఇంటలిజెన్స్ ఆఫీసర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఘటనపై సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. కౌశల్ 2006 నుంచి 2009 మధ్యలో అస్సాంలో పనిచేశారు. అస్సాం టీ గార్డెన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మృదుల్ భట్టాచర్య సొంత టీ గార్డెన్‌లోని కాళికా మందిరం నుంచి ఈ సంపద మాయమైంది. ఉల్ఫా వంటి తీవ్రవాద సంస్థలకు టీ గార్డెన్స్ యజమానులనుంచి డబ్బు వసూలు చేసి పెడతారనే పేరు ఆయనకుండేది. అంతేకాదు మయన్మార్‌కు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తారని కూడా అంతా అంటుండేవారు. ఘటన జరగక ముందే భట్టాచార్యను, ఆయన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
 
కాళికా మాత విగ్రహం కింద ఈ సంపద ఉందనే విషయం రహస్యవేగుల ద్వారా తెలుసుకున్నాక 2014 జూన్ ఒకటిన ఆర్మీ ద్వారా సంపదను దక్కించుకునేందుకు యత్నించినట్లు కౌశల్ తెలిపారు. అయితే ఆర్మీ మందిరానికి చేరుకునే లోగానే సంపద మొత్తం మాయమైంది.
 
దీనికి సంబంధించి 13 మంది అనుమానితులను గుర్తించి వారి కాల్ డేటాను పరిశీలిస్తే వారంతా ఒకరితో మరొకరు నిరంతరం టచ్‌లో ఉండటంతో పాటు సంపదను ఉమ్మడిగా మాయం చేశారని, ఇందుకు వారి బ్యాంక్ అకౌంట్లలో భారీ సంపద రావడాన్ని కూడా కౌశల్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విషయాలన్నింటినీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని వాపోయారు. పోలీసు ఉన్నతాధికారులకు కూడా దీంతో సంబంధం ఉందని నొక్కి చెబుతున్నారు.
 
జాతి సంపద జాతికే దక్కాలని, తీవ్రవాదుల చేతిలో పడితే దేశ వ్యతిరేక చర్యలకు ఉపయోగించే ప్రమాదం ఉందని కౌశల్ వాదిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. రాబోయే కొద్దిరోజుల్లో సంపద అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment