Wednesday, 20 April 2016

టైటానిక్‌ నుంచి వెళ్లిన చివరి లైఫ్‌ బోట్‌ ఏమైంది!

లండన్‌: అట్లాంటిక్‌ సముద్రంలో జరిగిన టైటానిక్‌ షిప్‌ ప్రమాదం మానవ చరిత్రలోనే అత్యంత విషాధమైనది. ఎందుకంటే అందులో చనిపోయింది సామాన్య ప్రజలు, స్త్రీలు, పిల్లలు. కొంతమందిని అందుబాటులో ఉన్న లైఫ్‌బోట్ల సహాయంతో రక్షించినప్పటికీ.. ఎన్నో వందల మంది వణికించే చలిని తట్టుకోలేక అక్కడే మరణించారు.
 
        టైటానిక్‌ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్న లైఫ్‌బోట్లన్నీ ఒడ్డుకు చేరుకున్నా.. చివరి లైఫ్‌బోట్‌ మాత్రం ఒడ్డుకు చేరుకోలేదట. ఆ ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత అట్లాంటిక్‌ సముద్రంపై ప్రయాణం చేస్తున్న ఆర్‌ఎమ్‌ఎస్‌ ఓసియానిక్‌ అనే ఓడలోని సిబ్బందికి ఆ లైఫ్‌ బోట్‌ కనిపించిందట. ప్రమాదం జరిగిన స్థలం నుంచి ఎంతో మందిని ఎక్కించుకుని బయల్దేరిన ఆ లైఫ్‌బోట్‌లో వీరికి కనిపించేసరికి మూడు శవాలు ఉన్నాయట. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 200 మైళ్ల దూరంలో అది దొరికిందట. ఆ మూడు శవాల్లో రెండు టైటానిక్‌ సిబ్బందివి కాగా, మరొకటి ఫస్ట్‌క్లాస్‌ పాసింజర్‌ థామ్సన్‌ బైటీది. అతను భోజనం చేస్తున్నప్పుడే టైటానిక్‌కు ప్రమాదం జరిగింది అనే విషయానికి గుర్తుగా అతని ఒంటిపై డిన్నర్‌ జాకెట్‌ ఉందట. ఇంకా ఆ పడవలో లభించిన మరో ముఖ్యమైన వస్తువు ఓ వెడ్డింగ్‌ రింగ్‌. దాని మీద ‘ఎడ్వార్డ్‌ టు గెర్డా’ అని రాసుంది. వేరొక లైఫ్‌ బోట్‌లో వెళ్లిన భర్త ఎడ్వార్డ్‌ను కలుసుకోవడానికి గెర్డా లిండెల్‌ అనే మహిళ ఈ లైఫ్‌ బోట్‌ ఎక్కింది. అయితే ఇది మధ్యలోనే మునిగిపోవడంతో ఆమె చనిపోయింది. ఎడ్వార్డ్‌ కూడా మరో లైఫ్‌బోట్‌ ఎక్కినా.. చలికి తట్టుకోలేక మరణించాడు. కాగా, ఈ వస్తువులన్నీ ఇప్పుడు వేలానికి వచ్చాయి. ఆ వెడ్డింగ్‌ రింగ్‌, ఆ లైఫ్‌ బోట్‌ను రక్షిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను వేలం వేయడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది.

No comments:

Post a Comment