Thursday, 14 April 2016

కొత్త రైళ్లలో ఛార్జీల మోత..!

న్యూదిల్లీ: రైల్వే బడ్జెట్లో ఈ సారి టికెట్‌ ధరల పెంపు లేనప్పటికీ.. కొత్తగా ప్రతిపాదించిన రైళ్లలో మాత్రం ఛార్జీల మోత మోగనుంది. రైళ్లలో ఉండే సదుపాయాలను బట్టి ఈ ఛార్జీలు ఉంటాయట. దీంతో సాధారణ రైళ్లతో పోలిస్తే.. వీటి టికెట్‌ ధరలు 15 నుంచి 30 శాతం ఎక్కువగా ఉండనున్నాయి. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. మహామనా, గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించింది రైల్వేశాఖ. త్వరలోనే.. హంసఫర్‌, తేజస్‌, ఉదయ్‌ రైళ్లను కూడా ప్రారంభించనుంది. హంసఫర్‌లో అన్ని కోచ్‌లు ఏసీ కాగా.. తేజస్‌ 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉదయ్‌ డబుల్‌ డెక్కర్‌ రైలు 40శాతం ఎక్కువ ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలది. వీటితో పాటు అనేక సదుపాయాలు కూడా ఉండటంతో ఈ రైళ్ల టికెట్‌ ధరలు సాధారణ రైళ్లలా ఉండవని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.
ఈ రైళ్లలో మామూలు ధరల కన్నా 15 నుంచి 30 శాతం ఎక్కువ ఛార్జీలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సువిధ రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ రైలు టికెట్‌ ఛార్జీలు కూడా పెరుగుతుంటాయి. మరోవైపు క్రిస్మస్‌, హోలీ, కుంభమేళ లాంటి పండగల సమయంలోనూ.. అధిక ఛార్జీలతో ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటుచేస్తోంది రైల్వేశాఖ.

No comments:

Post a Comment