Monday, 18 April 2016

బ్రిటిష్‌ వాళ్లు దొంగిలించలేదు...

         కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటిష్‌ వాళ్లు దొంగిలించలేదు, బలవంతంగా తీసుకెళ్లలేదు, దాన్ని వారికి బహుమతిగా ఇచ్చారు.. కాబట్టి వెనక్కి అడిగే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దానిని పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్‌సింగ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని తెలిపింది. కాబట్టి కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి ఇవ్వమని అడిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. వజ్రాన్ని బ్రిటన్‌ వద్దే ఉంచుకోనివ్వమని తెలిపింది.
భారత్‌కు చెందిన కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల ఈ అంశంపై కేంద్రం వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఈ విధంగా స్పందించింది.
105 క్యారెట్ల కోహినూర్‌ వజ్రాన్ని 1850లో బ్రిటన్‌ రాణికి అందజేశారు. ఆ వజ్రం ప్రస్తుతం రాణి కిరీటంలో ఉంది. గతంలో కోహినూర్‌ వెనక్కి ఇచ్చే అంశాన్ని బ్రిటన్‌ కూడా వ్యతిరేకించింది. రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని వెనక్కి ఇవ్వలేమని వెల్లడించింది. అయితే ఈ వజ్రంతో పాటు టిప్పు సుల్తాన్‌ కత్తి బ్రిటన్‌లో ఉన్న పలు విలువైన వస్తువులు వెనక్కి తీసుకురావాలని కోరుతూ ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ ఫ్రంట్‌ నిర్వాహకులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
ఈరోజు విచారణలో కేంద్రం తమ వైఖరిని స్పష్టంచేసింది. అయితే ఈ కేసులో మరో పార్టీగా ఉన్న విదేశాంగ శాఖ కూడా తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. ఆరు వారాల్లోగా తమ స్పందనను సమగ్రంగా తెలియజేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సాంస్కృతిక శాఖ, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, బ్రిటన్‌ల హైకమిషనర్లను కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పార్టీలుగా పేర్కొన్నారు.

No comments:

Post a Comment