Sunday, 24 April 2016

కోరలు చాస్తున్న డ్రాగన్‌...

  •   భూ, జల మార్గాల్లో భారత్ అష్టదిగ్బంధానికి యత్నం..
  • శ్రీలంక, పాక్‌, నేపాల్‌ దేశాల్లో కదలికలు
  • కమ్ముకొస్తున్న చైనా.. భూ, జల మార్గాల్లో భారత్ అష్టదిగ్బంధానికి యత్నం
  • శ్రీలంక, పాక్‌, నేపాల్‌లో పాగా.. దక్షిణ చైనా సముద్రంలో అణు మోహరింపు
  • అమెరికావైపు భారత్ చూపు.. మసూద్‌పై వీటోకు టిట్‌ ఫర్‌ టాట్‌
చైనా చేతులు చాస్తోంది. భారత్‌ను అష్ట దిగ్బంధం చేస్తోంది. నేలపై నుంచీ, నీటిలో నుంచీ భారత్‌పైకి మంటలు చిమ్ముతోంది. భారత శత్రు దేశాలకు తన సహకారం అందిస్తోంది. భారత మిత్ర దేశాలపైనా కన్నేసి వాటిని తన వైపునకు తిప్పుకుంటోంది. పసిఫిక్‌ మహా సముద్రంలో భాగమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని స్తరించుకుంటోంది. హిందూ మహాసముద్రంపైనా కన్నేసి భారత్‌ను ఇక్కట్లపాలు చేస్తోంది. చివరికి భారత వ్యతిరేక ఉగ్రవాదులకు కూడా ఊతమిస్తోంది. ముత్యాల సరం పేరుతో భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో, సముద్ర జలాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఇటీవల పలు పరిణామాలు చాప కింద నీరులాంటి చైనా కదలికల్ని సూచిస్తున్నాయి.
 
లుక్‌ అమెరికా..
చైనా చర్యలు భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో భారత అమెరికాకు మరింత చేరువగా జరుగుతోంది. భారత-అమెరికా రక్షణ సహకారం మున్నెన్నడూ లేనంతగా బలపడుతోంది. అమెరికన్‌ ఎఫ్‌-16 విమానాలను భారతలో తయారు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారతతో కలిసి విమానవాహక యుద్ధనౌకల తయారీకీ అమెరికా సిద్ధపడుతోంది. మన నౌకాదళ, వైమానిక, భూతల స్థావరాలను అమెరికా వినియోగించుకునేందుకు భారత ఇటీవల అంగీకరించింది. అలీన దేశంగా ఉన్న భారత ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం చైనాయే!
 
దక్షిణ చైనా సంద్రంలో పాగా
దక్షిణ చైనా సముద్రం పసిఫిక్‌ మహా సముద్రంలో ఒక భాగం. ప్రపంచంలో నౌకా వాణిజ్యానికి ఇది అత్యంత కీలక ప్రాంతం. భారత నౌకా వాణిజ్యంలో సగం దీని మీదుగానే జరుగుతుంది. ఇక్కడ నీటి అడుగున భారీఎత్తున చమురు, సహజవాయు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పలు దీవులు ఎవరివనే విషయంలో చైనా, ఫిలిప్పీన్స్‌, తైవాన్‌, వియత్నాం వంటి దేశాల మధ్య పలు వివాదాలున్నాయి. అలాంటి ఈ సముద్రంలో చైనా కృత్రిమంగా ఒక దీవిని నిర్మించింది. జబ్బు పడ్డ ఉద్యోగులకు సహాయ చర్యల పేరిట ఇటీవల తన సైనిక విమానాన్ని ఇక్కడ ల్యాండ్‌ చేసింది. అంతేకాదు.. అక్కడ తాను ఆక్రమించిన భూముల్లో చేపడుతున్న సైనిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా తీరం నుంచి అక్కడిదాకా వెళ్లి కావాల్సిన విద్యుత సరఫరా చేసే మొబైల్‌ న్యూక్లియర్‌ పవర్‌ ప్లాట్‌ఫాంలను రూపొందించే యోచనలో ఉంది. కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్‌ డైలీ అనుబంధ ప్రచురణ ‘ద గ్లోబల్‌ టైమ్స్‌’ ఈ విషయాన్ని బయటపెట్టింది. కానీ, షరా మామూలుగానే చైనా సర్కారు మాత్రం అవన్నీ పత్రికల ఊహాగానాలే అని కొట్టిపారేస్తోంది.
 
మనకు 3 వైపులా.
మహాసముద్రంలో కీలక నౌకా మార్గాలకు చేరువలో ఎంతో కీలకమైన ప్రదేశంలో శ్రీలంక ఉంది. శ్రీలంకతో భారతకు అనాదిగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల శ్రీలంకపై చైనా కన్నేసింది. శ్రీలంకతో ఆర్థిక సంబంధాలే కాదు, రక్షణ సంబంధాలనూ పెంచుకుంటోంది. భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనా అణు జలాంతర్గాములు శ్రీలంకను సందర్శించాయి. శ్రీలంకలో యుద్ధ విమానాల నిర్వహణ కేంద్రానికి చైనా సహాయం అందజేస్తోంది.
 
పాక్‌కు క్షిపణి పరిజ్ఞానం
పాకిస్థాన్‌తో చైనాకు ఎప్పటినుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పాక్‌, చైనా మధ్య ఆర్థిక, సైనిక సహకారం బాగా పెరిగింది. పాక్‌కు యుద్ధ విమానాలను, క్షిపణి పరిజ్ఞానాన్ని చైనా అందజేస్తోంది. అంతేకాదు... భారత్ లో విధ్వంసం సృష్టిస్తున్న పాక్‌ ఉగ్రవాదులకూ చైనా అండగా నిలుస్తోంది. గజ ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి ద్వారా ‘టెర్రరిస్టు’గా ప్రకటింపజేయాలన్న భారత ప్రయత్నానికి చైనా ఇటీవల గండికొట్టింది. ఐరాసలో రహస్య వీటో ద్వారా దానిని అడ్డుకుంది. సీపీఈసీ ప్రాజెక్టు సంగతి చెప్పనే అక్కర్లేదు. చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గుండా పాకిస్థాన్‌లోని గ్వదర్‌ రేవు దాకా రూ.3 లక్షల కోట్లతో తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టు ఇది. ఈ రేవు ఇరాన్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉండటం.. దీనికి మరోపక్క చమురు రవాణాకు కీలక మార్గమైన హెర్ముజ్‌ జలసంధి కూడా ఉండటం గమనార్హం. ఈ ప్రాజెక్టు ద్వారా చమురును తక్కువ శ్రమ, ఖర్చుతో రోడ్డు మార్గాన తమ దేశానికి చేర్చుకోవచ్చన్నది చైనా యోచన.
 
భారత్- నేపాల్‌ మధ్య చిచ్చు
శ్రీలంక, పాకిస్థాన్‌తోనే కాదు.. ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యమైన నేపాల్‌తోనూ సంబంధ బాంధవ్యాలను నెరపడం ద్వారా ఆ దేశంలో తమ పట్టు పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. నిజానికి నేపాల్‌ భారత్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కల దేశం. అయితే భారత-నేపాల్‌ల మధ్య కూడా చైనా చిచ్చు పెడుతోంది. నేపాల్‌లో భారత సంతతి వారైన మాధేసీలకు వ్యతిరేకంగా రాజ్యాంగ రచన జరగడంలో చైనా కీలక పాత్ర వహించిందనే ఆరోపణలున్నాయి. మాధేసీల డిమాండ్లకు అనుకూలంగా నేపాల్‌పై భారత అనధికారికంగా ఆంక్షలు విధించినప్పుడు, ఆ ఆంక్షలు నీరుగారిపోయేలా వివిధ ఉత్పత్తులను చైనా నేపాల్‌కు సరఫరా చేసింది. క్రమేపీ నేపాల్‌పై చైనా పట్టు బిగుస్తోంది.

No comments:

Post a Comment