Saturday, 2 July 2016

పెట్రోల్‌ తయారీలో తగ్గనున్న బెంజీన్‌ వాడకం

డెహ్రడూన్‌: క్యాన్సర్‌ వ్యాధికి కారణమయ్య బెంజీన్‌ రసాయనం వాడకం పెట్రోల్‌ తయారీలో ఇక నుంచి తగ్గనుంది. ద ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియమ్‌(ఐఐపీ), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఐఐపీ శాస్త్రవేత్త ఎంపీ గార్గ్‌ మాట్లాడుతూ... పెట్రోల్‌ తయారు చేయాలంటే తప్పనిసరిగా 1శాతం వరకు బెంజీన్‌ రసాయనం వాడవలసి వచ్చేది. తాజా పరిశోధనలో దాని వాడకాన్ని 0.2శాతానికి తగ్గించామని తెలిపారు. జామ్‌నగర్‌లోని ఆర్‌ఐఎల్‌ ఇప్పటికే బెంజీన్‌ తక్కువ శాతం ఉండే పెట్రోల్‌ను తయారుచేసి ఎగుమతి చేస్తోందని తెలిపారు. ఐఐపీ డైరెక్టర్‌ ఆర్‌. విశ్వకర్మ మాట్లాడుతూ... దేనిలోనైనా బెంజీన్‌ వాడకం 0.62 శాతం కంటే ఎక్కువ ఉండకూడదన్నారు. 2000 సంవత్సరం ముందు వరకు పెట్రోల్‌లో 5శాతం బెంజీన్‌ వాడేవారని, దానిని 1శాతానికి తెచ్చారని, ఇప్పుడు మరింత తగ్గించడం ఆనందించతగ్గ విషయమన్నారు. బెంజీన్‌తో తయారయిన పెట్రోల్‌ వాడకం వల్ల వాహనాలు నుంచి కార్బన్‌ ఉద్గారాలు పెద్ద స్థాయిలో గాలిలోకి విడుదలయి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) గతంలో ప్రకటించింది. ముఖ్యంగా బెంజిన్‌ వాడకం వల్ల దీర్ఘకాలిక క్యాన్సర్‌ వ్యాధులు వస్తాయని తెలిపింది.

No comments:

Post a Comment