Wednesday, 13 July 2016

ఆ గ్యాడ్జెట్లతో జాగ్రత్త గురూ!

ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగింది. ఇప్పుడు నాజూకైన స్మార్ట్‌వాచీలు.. ఫిట్‌నెస్‌ ట్రాకర్లు కుర్రకారును తెగ ఆకర్షిస్తున్నాయి. అయితే.. కొత్తగా వచ్చాయని వీటిని అజాగ్రత్తగా వాడేస్తే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదముందని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌వాచీలు.. ఫిట్‌నెస్‌ ట్రాకర్ల సాయంతో సైబర్‌ నేరగాళ్లు ఏటీఎం పిన్‌ నంబర్లను సులువుగా తస్కరించే అవకాశాలు ఉన్నాయని న్యూయార్క్‌లోని బర్మింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
స్మార్ట్‌వాచీలు.. ఫిట్‌నెస్‌ ట్రాకర్లలో మోషన్‌ సెన్సర్లు ఉంటాయి. అవి మన ప్రతి కదలికను గమనిస్తుంటాయి. వాటి ద్వారానే ఏటీఎం పిన్‌ నంబర్లు ఎంటర్‌ చేస్తున్నప్పుడు చేతి వేళ్ల కదలికలను గుర్తించే వీలుంటుందట. దీంతో హ్యాకర్లు మాల్‌వేర్‌తో దాడి చేసి ఆ సెన్సర్ల పనితీరుపై ఓ కన్నేసి ఉంచే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
మొబైల్‌లోకి మాల్‌వేర్‌ను పంపించి.. మొబైల్‌కి బ్లూటూత్‌ ద్వారా ఫిట్‌నెస్‌ ట్రాకర్లు.. స్మార్ట్‌వాచీలు కనెక్ట్‌ అయినప్పుడు సెన్సర్ల డాటాను హ్యాకర్లు చోరీ చేస్తారు. అందుకే ఈ కొత్తరకం గ్యాడ్జెట్లను వాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment